నిరసన చేస్తున్న టీడీపీ నాయకులను అరెస్టు చేసి కోటనందురు పీఎస్కు తీసుకువెళ్తున్న స్కూల్ బస్సు నామగిరి నరేంద్రపట్నం వద్ద డీజిల్ లేక మార్గం మధ్యంలో నిలిచిపోయింది. పోలీసుల పనితీరుకు ఇది అద్దంపడుతోందని టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైసీపీ నాయకులు చెప్పినట్టల్లా చేస్తున్న పోలీసులు హడావుడిగా స్కూల్ బస్సును తీసుకొచ్చి నిరసన చేస్తున్న టీడీపీ నాయకులను తీసుకెళుతూ ఇలా అబాసుపాలయ్యారు.
రౌతులపూడిలో టీడీపీ నాయకుల నిరసన
టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్, అనిత, ఈశ్వరి, రాజేశ్వరీ, మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణిలతో కూడిన బృందం విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించి, గిరిజనులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. రౌతులపూడి మండలం జల్దామ్ నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు రోడ్డు విస్తరణ జరిగినట్లు గుర్తించిన టీడీపీ నాయకులు కేవలం లేటరైట్ తరలించేందుకే రోడ్డు వేశారని ఆరోపించారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు జగన్ ప్రభుత్వం మరోసారి తెరలేపిందని, రిజర్వు ఫారెస్టులో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేశారంటూ టీడీపీ నాయకులు రౌతులపూడిలో నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు.
మీడియాతో మాట్లాడకుండా..
గిరిజనులతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న టీడీపీ నాయకులను తూర్పు గోదావరి జిల్లా దబ్బాలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంతో టీడీపీ నాయకులు అక్కడే నిరసనకు దిగారు. రెండు గంటలకుపైగా మీడియా ప్రతినిధులు, టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతుండగా మీడియాతో మాట్లాడిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తామని నేతలు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్కు చిత్తశుద్ధి ఉంటే లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలన్నారు. అక్రమ మైనింగ్ ఆపి గిరిజనుల సంపదను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రౌతులపూడి ఘటనపై అయ్యన్నపాత్రుడు, చినరాజప్పతో పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. గిరిజన భూములు, అటవీ భూముల్లోనూ రోడ్లు వేసిన వైనంపై ఆరా తీశారు. మూడున్నర గంటల తర్వాత టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి వారిని హడావుడిగా స్కూల్ బస్సులో కోటనందురు పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా డీజిల్ లేక మధ్యలో ఆగిపోయింది.
పోలీసుల తీరు అమానుషం: చంద్రబాబు
రౌతులపూడిలో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకులకు మీడియాతో మాట్లాడే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా హడావుడిగా ఎక్కించిన బస్సులో సరిపడ డీజిల్ కూడ ఉందో లేదో చూసుకోకపోవడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేయడం మాని చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు.
Must Read ;- 15 ఏళ్లు, రూ.15 వేల కోట్లు!.. వైవీ రెడ్డి నయా దందా!











