దుబ్బాక ఉప ఎన్నికతో బీజేపీ ఊపులోకి వచ్చింది. పార్టీ నేతలు సైతం టీఆర్ఎస్ టార్గెట్గా మాటల దాడి పెంచారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్కు ధీటుగా ప్రచారంలో బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలోకి వచ్చే వారికి కండువాలు కప్పుతున్నారు. డివిజన్ స్థాయి సమావేశాలకు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతుండటంతో కేడర్లో మరింత ఉత్సాహం వస్తోంది. ఇక టీఆర్ఎస్కు ధీటుగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గం చేరికలకు కూడా ఊతమిస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంప్రదింపులు?
కాంగ్రెస్ పార్టీ నేతలతోనే కాకుండా టీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టీఆర్ఎస్ లో ప్రస్తుతం పదవిలో ఉన్న వారు తప్పిస్తే ఇక తమకు ఈ పార్టీలో స్థానం లేదనుకునే వారు బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. డివిజన్ స్థాయి నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు.. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన వారు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రేటర్లో డివిజన్ నేతలు కొంత మంది బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు ఎంపీగా పనిచేసి ఓడిపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో ఈయనతో బండి సంజయ్ మంతనాలు జరిపారని తెలుస్తోంది. వీరికి మధ్యవర్తిగా ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. గతంలోనే ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ కాంట్రాక్ట్ల బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఆయన రాక ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు. తాజాగా మరోమారు ఆయనతో సంజయ్ చర్చలు జరపడంతో పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
టచ్లోకి కాంగ్రెస్ నేత అద్దంకి..
బీజేపీ నేతలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ స్టార్ క్యాంపేయినర్ విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయం అయ్యింది. దీంతో ఆ పార్టీకి చెందిన మరింత మందికి బీజేపీ గాలం వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ వేదికగా ఈ మంతనాలకు తెర లేపింది. ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల రోజు బీజేపీకి అనుకూలంగా మాట్లాడటంతోనే ఆయన అంతరార్థం అర్థమయ్యిందంటున్నారు బీజేపీ నేతలు. ఆయనతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో ఆయన సంప్రదింపులు జరిపిన అనంతరం బండి సంజయ్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆలోచనలో ఉన్న అద్దంకి బీజేపీలో చేరి ఇప్పటి నుండే నియోజకవర్గంలో తిరిగితే తనకు టికెట్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీలో చేరిక లాంఛనమే అంటున్నారు పార్టీ నేతలు.