నేను మీతోనే ఉన్నాను అంటూ విద్యార్థులకు వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. తెలంగాణలో రాజన్నరాజ్యం ఏర్పాటు కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటులో భాగంగా వైఎస్ షర్మిల యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటికే జిల్లాల వారీగా నాయకులతో సమావేశం అవుతున్న షర్మిల తాజాగా లోటస్ పాండ్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఔత్సాహికులైన యువకులు తమతమ అభిప్రాయాలను చెప్పారు. ప్రధానంగా ఉద్యోగ అవకాశాలపై సమస్యలు ఏకరవుపెట్టారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీతో పాటు వివిధ కళాశాలల నుంచి దాదాపు 350 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఫీజు రీఎంబర్స్మెంట్పైనా పలువురు విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మీ అక్కగా..
ఈ సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ‘నా కుమారుడు, కుమార్తె మీలాగే చదువుతున్నారు. అందుకే నేను కూడా మీతో సమావేశం ఏర్పాటు చేశాను. మీ అక్కగా మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు వచ్చాను. మన సమాజాన్ని మనమే బాగు చేసుకుందాం. తెలుగు ప్రజలను డా.వైఎస్సాఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. పేదల విద్యార్థులకు చదువు ఆర్థికంగా భారం కాకూడదని ఆలోచించి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారు. అంతేకాదు..యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. జిల్లాకు ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. ఫీజ్ రిఎంబర్స్మెంట్ పథకం ద్వారా రూ.వెయ్యి కడితే చాలు.. మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేది. పేదలకు వైఎస్ ఇచ్చిన భరోసా అలాంటింది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్లు రావడం లేదన్నారు. అందరి సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు షర్మిల. ఓ విద్యార్థి చేసిన ప్రసంగంతో కొంత భావోద్వేగానికి గురైన షర్మిల.. ఆ విద్యార్థి కోరిక మేరకు ‘నేనున్నా’ అని హామీ ఇచ్చారు.
Must Read ;- షర్మిల నోట ‘జై తెలంగాణ’.. 11 అంశాలపై అభిప్రాయ సేకరణ

పలువురు నాయకుల భేటీ
కాగా షర్మిలతో పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే, వైఎస్ అభిమాని కాలె యాదయ్య కుమారుడు రవికాంత్ షర్మిలతో భేటీ అయ్యారు. దీనిపై సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ..తాము వైఎస్ అభిమానులమని, అందుకే తమ కుమారుడు కలిసి ఉంటాడని, తాము టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని, వేరే ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత దయానంద్ (డేవిడ్) టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. షర్మిలకు మద్దతు ప్రకటించారు. పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా షర్మిలకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే పలువురు నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆమెను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వీరితో పాటు ఇప్పటికే షర్మిల తన కార్యక్రమాల సమన్వయకర్తగా హైదరాబాద్కు చెందిన వైఎస్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్న రాజగోపాల్ను నియమించుకున్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో ఇప్పటికే షర్మిల భేటీ కాగా.. మరో నేత, మాజీ హోంమంత్రి కే.ప్రభాకర్రెడ్డి మద్దతు తెలిపారు. అంజయ్య క్యాబినెట్లో హోం మంత్రి గా పని చేసిన ప్రభాకర్రెడ్డి తరువాతి కాలంలో వైఎస్కు దగ్గరయ్యారు. కాగా తాము ఎవరికీ ఆహ్వానాలు పంపడం లేదని, వైఎస్ కుటుంబంపై నమ్మకం ఉన్నవారు వస్తున్నారని, వైసీపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ, ప్రస్తుతం షర్మిలకు మద్దతుగా నిలిచిన కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read ;- సెంటిమెంట్లు,ముహూర్తం.. ఖమ్మం నుంచి షర్మిల తొలి అడుగు











