షర్మిల పార్టీ పెట్టే అంశంపై ఇప్పటికే క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఆ ఏర్పాట్లకు సంబంధించి రోజుకో విషయం బయటకు వస్తోంది. కాగా ఏప్రిల్ 10న షర్మిల పార్టీ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక షర్మిల అభిమానుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 21 లేదా 27న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు భారీగా వాహనాల ర్యాలీ, మార్గమధ్యంలో అభిమానులతో ముఖాముఖి నిర్వహించేందుకు ప్రణాళిక వేశారు. మొత్తం మీద పార్టీ ప్రకటనకు ముందే షర్మిల జనాల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోనే ఎందుకంటే..
2014లో వైసీపీకి ఖమ్మం జిల్లాలో ఆదరణ లభించింది. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యేగా బాణోతు మదన్లాల్, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యేగా పాయం వెంకటేశ్వర్లు గెలిచారు. అప్పటికే వైసీపీ రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని స్పష్టంగా ప్రకటించింది. అయినా ఇక్కడ మూడు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానం దక్కించుకుంది వైసీపీ. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో వారు టీఆర్ఎస్ లోకి వెళ్లినా జిల్లాలో వైఎస్ అభిమానులు బలీయంగానే ఉన్నారన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతోపాటు ఖమ్మం జిల్లాలో సెటిలర్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అంశాన్ని కూడా షర్మిల పరిగణనలోకి తీసుకుని అక్కడి నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.కాగా షర్మిల యాత్రలో గిరిజనులకు భూముల కేటాయింపు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన సమస్యలపై చర్చించనున్నారు.
Also Read ;- రాజన్న రాజ్యం కాదు.. రామ రాజ్యం కావాలి!
నిన్న ఆళ్ల, నేడు వైవీ సుబ్బారెడ్డి..
ఇక షర్మిల పార్టీకి సంబంధించి గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోటస్ పాండ్లో రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన షర్మిల.. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించకపోయినా..రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. అప్రకటితంగానే పార్టీ పెడతారని చెప్పినట్లు ప్రచారం జరిగింది. వైసీపీతో పాటు ఏపీ, తెలంగాణల్లోనూ చర్చనీయాంశమైంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం లోటస్పాండ్లో షర్మిలను కలిశారు. ఆమె భర్త అనిల్తోనూ సమావేశమయ్యారు. రామకృష్ణారెడ్డి జగన్ తరఫున రాయబారిగా వచ్చారన్న ప్రచారం జరుగుతుండగా, వైఎస్ కుటుంబీకురాలిగా షర్మిలకు విషెష్ చెప్పడానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు షర్మిలను తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి కూడ కలవనున్నట్లు సమాచారం. పార్టీ వ్యవహారంపై మాట్లాడతారా, లేక కుటుంబీకురాలితో జరిగే సాధారణ భేటీనా అనేది తేలాల్సి ఉంది. ఇక తెలంగాణ లోని ఒక్కో జిల్లా నుంచి కొందరు నేతలు షర్మిలను కలసి జిల్లాలకు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు లక్కినేని సుధీర్, శ్రీనివాసరాజు, రోషిరెడ్డి తదితరులు షర్మిలను కలిశారు.
ముహూర్తాలు..సెంటిమెంట్లు..
ఇక షర్మిల పార్టీ ప్రకటన ఏప్రిల్ 10 ఉండవచ్చని చెబుతున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్రెడ్డి అదే తేదీన పాదయాత్ర ప్రారంభించారు. షర్మిల తేదీల విషయంలో ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఫిబ్రవరి 9న వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ విజయమ్మ పెళ్లి రోజున ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 10న బ్రదర్ అనిల్ పుట్టినరోజు అని, పార్టీకి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించారని చెబుతున్నారు. ఇక 2009 ఏప్రిల్ 10 దివంగత సీఎం వైఎస్ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 18ఏళ్ల క్రితం జరిగిన ఆ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ తేదీన పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు.
Must Read ;- జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?