తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీలు అధికారంలో ఉంటేనే.. లేదంటే ఆ పార్టీలను వీడుతూ పలువురు నేతలు తమదైన అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా రాజకీయాలు ఇటీవలి కాలంలో ఓ రేంజిలో సాగుతున్న వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఏపీలో అధికార పార్టీ నుంచి విపక్షంగా మారిపోయిన టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేయగా.. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు గుర్తింపు లభించడం లేదన్న మాటను చెబుతూ ఆమె పార్టీకి వీడ్కోలు పలికారు. త్వరలోనే ఆమె అధికార వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
క్యూ కట్టేశారుగా
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా.. జగన్ చెప్పిన మాయ మాటల ఫలితంగా టీడీపీ విపక్షంగా మారిపోయింది. ఎప్పుడైతే టీడీపీ విపక్షంగా మారిపోయిందో.. అప్పటి నుంచే జగన్ టీడీపీలోని పలువురు కీలక నేతలను తన పార్టీలోకి లాగే వ్యూహానికి పదును పెట్టారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా విజయవాడ శివారు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీమోహన్ ను తమదైన రీతిలతో బెదిరింపులకు గురి చేసిన వైసీపీ.. టీడీపీ నుంచి లాగేసుకుంది. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చినా వైసీపీ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఆ తర్వాత అదే జిల్లాకు చెందిన యువ నేత దేవినేని అవినాశ్, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, గుంటూరు జిల్లాకు చెందిన మద్దాలి గిరిధర్, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ లు వరుసపెట్టి వైసీపీలోకి క్యూ కట్టారు.
గుర్తింపు దక్కలేదా?
తాజాగా విశాఖ జిల్లాకే చెందిన శోభా హైమావతి కూడా టీడీపీకి రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది. మిగిలిన నేతల విషయాన్ని అలా పక్కనపెడితే… శోభా హైమావతికి రాజకీయ ఓనమాలు దిద్దించింది. శృంగవరపు కోట ఎమ్మెల్యేగా సీటిచ్చి మరీ గెలిపించుకుంది. ఆ తర్వాత టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళకు ఉమ్మడి రాష్ట్రంలోనే అధ్యక్షురాలిని చేసింది. మొత్తంగా శోభా హైమావతి రాజకీయ జీవితంలో టీడీపీ తప్పించి ఇతర పార్టీల ప్రమేయం కనిపించదనే చెప్పాలి. అలాంటి శోభా హైమావతి.. ఇప్పుడు పార్టీ విపక్షంలోకి మారిపోగానే.. అధికార పార్టీలోకి జంప్ కొడుతుండటం నిజంగానే టీడీపీ శ్రేణులను ఆగ్రహానికి గురి చేస్తోంది. టీడీపీకి తన రాజీనామాకు కారణం చెబుతూ పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. ఆ మాటే నిజమైతే.. ఎమ్మెల్యేగా సింగిల్ టైమ్ మాత్రమే గెలిచిన శోభాకు తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవి ఎలా దక్కిందని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
Must Read ;- ఆ నేత చనిపోయినా.. టీడీపీ పోరు ఆగలేదు