ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, మత మార్పిడులు, అన్యమత ప్రచారంపై పీఠాధిపతులు, ఉత్తరాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు వారంతా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పొన్పాడి గ్రామం శివారులోని కంచిపీఠానికి చెందిన ఓ ఆశ్రమంలో సమావేశమయ్యారు. సనాతన ధర్మ పరిరక్షణ పేరిట సదస్సుకు ఏపీ, తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు, ఉత్తరాధికారులు హాజరయ్యారు. దక్షిణాదిన హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశ వివరాలను గురువారం తిరుపతి ప్రెస్క్లబ్లో భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి కమలానంద భారతి స్వామి మీడియాకు వెల్లడించారు.
ధర్మ పరిరక్షణ సదస్సు..
హైందవ సమాజానికి ధైర్యాన్నిచ్చేలా సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ప్రతినిధి గౌరీశంకర్, హంపీ విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యారణ్య భారతి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి, తుని సచ్చిదానం తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, అహోబిల మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం, సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్ర్తి, కంచి మఠం ప్రతినిధి చల్లా విశ్వనాథ శాస్త్రి తదితరులు పాల్గొన్నారని ఆయన వివరించారు. కంచికామకోటి శంకర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా త్వరలోనే ఓ మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అపచారాలు.. ఆగడాలు..
సనాతన ధర్మం, హిందూ విశ్వాసాలు, ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సమావేశంలో చర్చించామని, కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలను ధ్వంసం చేయడాన్ని సదస్సు తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. రామతీర్థంలో రాముడి తల ధ్వంసం చేయడం స్వామీజీలకు ఆవేదన కలిగించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అన్యమత ప్రచారం, మైనారిటీల మెప్పుకోసం హిందూ ఆలయాల ఆదాయాన్ని వినియోగించడాన్ని సదస్సు తప్పుబట్టిందని పేర్కొన్నారు. హిందూ మతాన్ని అంతం చేయాలని అనుకుంటున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సదస్సు డిమాండ్ చేసిందని చెప్పారు. పష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభారతి స్వామి మాట్లాడుతూ తిరుమల నుంచి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీలో దేవదాయ శాఖ పనితీరు బాగోలేదని, ఆలయాల ఆదాయాన్ని సెక్యులర్ సంక్షేమానికి ఖర్చు చేయకూడదన్న విషయం కూడా తెలియక పోవడం బాధాకరమని అన్నారు. మాజీ న్యాయమూర్తులు, నిపుణుల ద్వారా ఆలయాల నగలను, ఆస్తులను కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
Must Read ;- రామతీర్థం సందర్శించిన చినజీయర్