తాడేపల్లి పాలెస్ గా వైరి వర్గాలు పిలిచే జగన్ అధికారిక నివాసానికి తక్షణమే గేట్లు పడాల్సిందే. ఈ విషయంలో ఇప్పటికే బాగా లేటైంది. ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా జారీ కాలేదు. అది సీఎం క్యాంపు కార్యాలయం అయితేనేమి? అది ప్రభుత్వ భవనమేమీ కాదు కదా. ప్రైవేట్ భవనమే కదా. నిబంధనలకు విరుద్ధంగా ఆ భవనానికి 16 నెలలుగా పన్ను కట్టకుండా ఉంటే… గేట్లు మూసేయక తప్పదు కదా. ఆ భవన యజమాని బకాయి పడ్డ పన్ను రూ.13.85 లక్షలు అయితే… దానికి జరిమానాగా రూ.2.82 లక్షలు జమ అయ్యింది. మొత్తంగా ఆ భవనం తాడేపల్లి మునిసిపాలిటీకి ఏకంగా రూ.16.67 లక్షలు బాకీ పడింది. మరి ఇంత మేర బాకీ పడ్డ భవనం… జగన్ ది కాకుండా వేరే ఏ సామాన్యుడిదో అయి ఉంటే ఏం జరిగేది? భవనానికి నోటీసులు అంటించేసి… ఆ భవనం గేట్లు మూతపడేవి కదా. మరి ఈ భవనానికి గేట్లు ఎందుకు మూతపడలేదు. కనీసం నోటీసులు కూడా అంటించలేదు కదా. ఇప్పటికైనా తాడేపల్లి మునిసిపాలిటీ అధికారులు స్పందించాలి. తాడేపల్లి పాలెస్ కు నోటీసులు అంటించాలి. ఆ వెంటనే గేట్లు వేయాలి. బకాయిలు మొత్తం చెల్లించేదాకా ఆ గేట్లను తీయకూడదు. ఇదీ… ఏపీలో జనం నోట వినిపిస్తున్న వాదనలు. విపక్షాల డిమాండ్లు వీటిని మించి వినిపిస్తున్నాయి. మరి తాడేపల్లి మునిసిపల్ ఎలా అధికారులు స్పందిస్తారా?
జనాన్ని మభ్యపెట్లేందుకే తాడేపల్లి పాలెస్
నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ నాడు చంద్రబాబు హయాంలోని టీడీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా మొదలయ్యాయి. ఓ వైపు పనులు యమా స్పీడుగా జరుగుతున్న నేపథ్యంలోనే 2019 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చాయి. అప్పటికే ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న జగన్… తాను అధికారంలోకి వచ్చినా రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని చెప్పారు. ఈ మాటను జనం బాగా నమ్మేందుకు ఏకంగా అమరావతి పరిధిలోని తాడేపల్లిలో తన భార్య భారతి రెడ్డి పేరిట స్థలం కొనుగోలు చేశారు. అందులో రాజభవంతి లాంటి భవనాన్ని నిర్మించారు. తన నివాసంతో పాటు తన పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తుందని ప్రకటించారు. ఇది నిజమేనని నమ్మిన జనం జగన్ కే పట్టం కట్టారు. అయితే అధికారంలోకి రాగానే… జగన్ తన మాట మార్చేసి మడమ తిప్పేసి అమరావతిని కేవలం శాసన రాజధానిగా కొనసాగిస్తానని, పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తానని సంచలన ప్రకటన చేశారు. అమరావతిలోని హైకోర్టును కర్నూలుకు తరలిస్తానని కూడా ప్రకటించేశారు. దీంతో అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములను ఇచ్చేసిన రైతులు నిరసనలకు దిగారు.
16 నెలలుగా పన్ను చెల్లించట్లేదు
ఇదంతా ఒక ఎత్తైతే… తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని తన రాజ భవంతికి పన్ను కట్టడాన్ని జగన్ ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయారు. తాను సీఎంగా ఉండగా తన అధికార నివాసానికి పన్ను కట్టడమేమిటని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… లక్షల మేర పన్నును ఎగ్గొట్టేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు కూడా… అది సీఎం నివాసం కదా అన్న ధోరణితో చర్యల మాట ఎత్తలేదు. అయితే మునిసిపాలిటీ సర్వర్లకు మాత్రం అది సీఎం నివాసం అని తెలియదు కదా. ఆ భవంతికి పన్ను చెల్లించని విషయాన్ని మునిసిపాలిటి సర్వర్లు బయటపెట్టేశాయి. పన్ను బకాయిలకు జరిమానా కూడా వేసేశాయి. ఆ విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. మునిసిపాలిటీ సర్వర్ల ప్రకారం జగన్ తాడేపల్లి పాలెస్… మునిసిపాలిటీకి 16 నెలల నుంచి పన్ను చెల్లించట్లేదు. దీంతో పన్ను బకాయి రూ.13.85 లక్షలుగా తేలింది. దానికి జరిమానాగా రూ.2.82 లక్షలు కలిపితే… మొత్తంగా జగన్ పాలెస్ తాడేపల్లి మునిసిపాలిటీకి రూ.16.67 లక్షలు బాకీ పడింది. దీనిని కట్టాలని అడిగిన నాథుడు లేడు. నోటీసులు జారీ చేసిన దాఖలా కూడా లేదు.
సీఎం నివాసానికీ పన్ను చెల్లించాల్సిందే
వాస్తవానికి సీఎం గానీ, మంత్రులు గానీ, అధికారులు గానీ ప్రభుత్వ భవనాల్లో నివసిస్తే… ఆయా భవనాల పన్నును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అందుకు విరుద్ధంగా వీరిలో ఎవరు ప్రైవేట్ భవనాల్లో నివసించినా… ఆ భవనాల పన్నును ఆయా భవనాల యజమానులే చెల్లించాలి. మరి తాడేపల్లి పాలెస్ ప్రభుత్వ భవనమేకీ కాదు కదా. అది జగన్ సతీమణి భారతిరెడ్డి పేరిట ఉన్న భవనం. అంటే ప్రైవేట్ భవనమే కదా. మరి దానిలో సీఎం జగన్ నివాసమున్నా… ఆయన పార్టీ వైసీపీ కార్యకలాపాలు సాగిస్తున్నా.. ఆ భవనానికి భారతిరెడ్డే పన్ను చెల్లించాలి కదా. మరి 16 నెలలుగా ఆ భవనానికి ఎందుకు పన్నులు చెల్లించడం లేదు. ఇదే ఏ సామాన్యుడో ఇలా చేసి ఉంటే… ఆ భవనానికి నోటీసులు జారీ అయ్యేవి కదా. ఆ నోటీసులకు స్పందించకుంటే… ఆ భవనానికి ప్రభుత్వం నుంచి అందే మంచినీరు, డ్రైనేజీ నిర్వహణ, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలన్నీ నిలిచిపోయేవి కదా. నిబంధనలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నానని చెప్పుకుంటున్న జగన్ జమానాలో… ఇప్పుడు ఈ భవనానికి నోటీసులు జారీ కావాల్సిందే కదా. డ్రైనేజీ, తాగు నీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోవాల్సిందే కదా. అప్పటికీ స్పందించకపోతే… ఆ భవనానికి మునిసిపాలిటీ అధికారులు గేట్లు మూసేయాల్సిందే కదా. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో చూడాలి.
Must Read ;- జగన్, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, జోగి.. ఇప్పుడు జక్కంపూడి