రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. కాకలు తీరిన యోధులే తమకు అనుకూలించని సమయాల్లో కిందా మీదా పడుతుంటారు. ఇక పాలిటిక్స్లో ఏమాత్రం అనుభవం లేకుండానే అలా అలా లాగించేస్తామన్న రీతిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే యువ నేతలు ఓ లెక్కా. కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు.. ఇలా ఎన్నెన్నో యుద్ధ విద్యలను నేర్చుకున్న వారే ఈ తరం పాలిటిక్స్లో రాణించే అవకాశాలుంటాయి. ఈ కారణంగానేనేమో తెలియదు గానీ.. రాజకీయ నాయకుల వారసులు మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో బాగానే రాణిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. తండ్రులు పదవుల్లో ఉండగానే.. వారి వెన్నంటి నడిచి పాలిటిక్స్ యుద్ధ విద్యలన్నింటినీ ఒక్కొక్కటిగానే ఒంటబట్టించుకుంటున్నారు కదా. అయితే ఇ తరహా తర్ఫీదులు లేని కారణంగా పొలిటికల్ ఫ్యామిలీల నుంచి కాకుండా బయటి నుంచి వచ్చే యువకుల్లో సక్సెస్ సాధిస్తున్న వారు అతికొద్ది మందేనని చెప్పాలి. సమాజంలో మార్పు తెస్తామని తమదైన శైలి సిద్ధాంతాలతో అడుగుపెట్టే యువకులు ప్రతికూల పరిస్థితుల కారణంగా సర్దుకుపోక తప్పడం లేదు. టీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించిన జర్నలిస్టు, యువ నేత తీన్మార్ మల్లన్న పరిస్థితి చూస్తే.. ఈ మాటలన్నీ నిజమేనన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.
టీఆర్ఎస్కు చుక్కలు చూపినట్టే
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపడమే లక్ష్యంగా జర్నలిస్ట్ విధుల నుంచి కాస్తంత తప్పుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎంత దూకుడు ప్రదర్శించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడిన మల్లన్న.. తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ తరహా బాణీతో ముందుకు సాగిన మల్లన్న ప్రజల పక్షాల నిలబడి ప్రశ్నిస్తున్నానని గొప్పగానే చెప్పుకున్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లన్న.. ఎన్నికల్లో విక్టరీ సాధించలేదు గానీ.. టీఆర్ఎస్కు, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిక్ఇ ముచ్చెమటలు పట్టించారు. రోజుల తరబడి సాగిన ఓట్ల లెక్కింపులో ఒకాకొన దశలో పల్లాను దాటేసిన మల్లన్న.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపునకు తిప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో పల్లా విజయం సాధించగా.. మల్లన్న రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టేసిన మల్లన్న తన సత్తా చాటారు.
దూకుడే శాపమైందా?
ఆ ఎన్నికలో ఫలితాల తర్వాత తీన్మార్ మల్లన్న మరింత దూకుడు పెంచారు. తనకు మద్దతుగా నిలిచే వాళ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఓ బృందాన్ని తయారు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అతని వైఖరి నచ్చి ఎంతో మంది ఆ బృందంలో చేరారు. రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తానని కూడా మల్లన్న ప్రకటించారు. కానీ ఇప్పుడు పలు కేసులను ఎదుర్కొంటూ జైళ్లో కాలం వెళ్లదీస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తనపై కక్ష్య కట్టి కేసులతో జైళ్లో పెట్టిచ్చిందని ఆరోపణలు చేసిన మల్లన్న.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదైన కేసుల నుంచి రక్షణ కోసమే ఆయన బీజేపీలో చేరుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయంపై మల్లన్న బృందం ఒక్కసారి షాక్ తిన్నది. అంతేకాకుండా ఈ తరహా రాజకీయాలు తమకు సరిపోవంటూ బృందం సభ్యులు వేర్వేరు దారులు చూసుకుంటున్నారు. ఈ బృందంలో నంబర్ 2గా కొనసాగిన మాజీ పోలీసు అధికారి దాసరి భూమయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు మరో వంద మంది మల్లన్న బృందం సభ్యులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో చిలుక ప్రవీణ్ లాంటి మల్లన్న సహచరులు తిరుగుబాటు చేసి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక భూమయ్యల లాంటి పెద్దలు దూరం కావడంతో తీన్మార్ మల్లన్న బృందం ముక్కలయినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కూతురి దెబ్బకు కేసీఆర్ దిగొచ్చారే