వరదల వల్ల హైదరాబాద్లోని ప్రజలు ఎంతగా ఇబ్బందిపడ్డారో అందరికీ తెలుసు. చాలామంది కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతుంటే… ఇప్పుడు ఆ వరదనే అవకాశంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణ నేతలు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వరద సాయాన్ని అందించడం నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకనే ప్రయత్నాలు మొదలుపెట్టారు రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్. బీజేపీని నిందిస్తూ వారిని దోషులుగా నిలబెట్టడం మొదలుపెట్టారు. ఇదేం కొత్త స్ట్రాటజీ కాదులేండి. ఎప్పటి నుండో మన జగనన్న పాటిస్తున్నదే. దాన్ని ఇప్పుడు కేసీఆర్ ఫాలో అవుతున్నారంతే! మరి ఆ ఐడియా ఏమిటో పూర్తిగా తెలుసుకోండి…
అంతా గందరగోళం
వరద బాధితులకు రూ.10 వేల సాయం అందించిన విషయంలో కాస్త గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. దానిని సరిదిద్దటానికి బాధితులు ఈ సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకంటే అధికారులు విచారించి వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అది మొదలు, సాయం ఆశిస్తున్న ప్రజలు ఈ సేవా కేంద్రాల ఎదుట క్యూ కట్టారు. దాని వల్ల చాలాచోట్ల ట్రాఫిక్కి కూడ అంతరాయం కలిగిందంటే చూడండి వరద బాధితులు ఎంత మంది ఉన్నారో.
Must Read ;- కేసీఆర్ డైరెక్షన్లో గ్రేటర్ ఎన్నికలు!
బీజేపీదే పాపమంతా..
ఈ సేవా కేంద్రాల వద్ద పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగానే, దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమిషన్, వరద సాయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకేముంది, దీన్ని అవకాశంగా మార్చుకోవడానికి వెంటనే ఈ పాపమంతా బీజేపీదే అంటూ కేసీఆర్ దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టాడు. కానీ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. అది తెలీసీ, పేర్లు నమోదు చేసుకోండని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు బీజేపీని నిందించడం ఎంత వరకూ న్యాయం?
జగనన్నా మజాకా..
ఇలా ఏదైనా పథకం ఆగిపోగానే, తమ ప్రత్యర్థి పార్టీని తిట్టడం కొత్తేమీ కాదు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సక్రమంగా చేస్తున్న పని ఇదొక్కటే అని చెప్పవచ్చు. ప్రభుత్వం మొదలు పెట్టాలనుకున్న ఏ పథకం ఆగినా, వాయిదా పడినా ప్రతిపక్షమే కారణమంటూ వారిని నిందించడం జగన్కి బాగా అలవాటైన విషయం. ఇదే ఐడియాని కేసీఆర్ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ రాజకీయంగా, వయస్సు పరంగా ఎంతో పెద్దవాడు, అనుభవం ఉన్న కేసీఆర్, జగన్ని ఫాలో అవుతున్నాడేంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
గెలుపు కోసమేనా ఇదంతా
రాజకీయాల్లో తనదంటూ ఒక కొత్త పంధాని, ఒరవడిని ఏర్పరచుకున్న నేత కేసీఆర్. అటువంటి వ్యక్తి, స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల్లో తగిలిన దెబ్బకి కేసీఆర్కి గెలుపుపై నమ్మకాలు సన్నగిల్లాయనే చెప్పొచ్చు. పైగా ఎన్నికల సమయంలోనే వరద సాయం వ్యవహారంలో చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని సవరించడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమవడంతో జగన్ ఐడియానే శరణ్యం అనుకున్నట్టు ఉంది. మరి ఇది కేసీఆర్కి కలసొస్తుందో.. బెడిసికొడ్తుందో చూడాలి.
Aslo Read ;- ఎవరీ భూపేంద్ర?.. గ్రేటర్ బీజేపీ రాత మారుస్తారా?











