ఎన్నికలకు సరిగ్గా ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీల మాటలు కోటలు దాటుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పలు తాయిలాలను జొప్పిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. అవి ఆచరణలో ఎంతమేరకు సాధ్యమైతాయా? లేదో కూడా తెల్వదు. ఒకవేళ అయినా.. ఆ హామీలపై కట్టుబడి పార్టీలు ఉంటాయా? అనేది కూడా పెద్ద ప్రశ్నే. పోటాపోటీగా ఎన్నికల మేనిఫెస్టోను ఆయా పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఒకరు పార్టీ పవర్, వాటర్ ఫ్రీ అంటే.. మరొక పార్టీయేమో ఇళ్లు కట్టుకునేందుకు లక్షలకు లక్షలు ఆర్థిక సాయం అందిస్తామంటున్నది. ఒకరు ఇంటి పన్నులో రాయితీ అంటుంటే మరొకరేమో ఇంటి పన్ను మాఫీ అంటున్నారు. ఇలా ఎన్నికల హామీలతో ఓటర్లను ప్రలోబపెడుతున్నారు. అసలు ఎవరికి ఓటు వేయాలో ఓటరు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్తో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచింది. అందులో ప్రధానంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలకు మెట్రో రైలులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని తెలిపింది. అలాగే వరద సాయం కింద రూ.50వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ తెలిపారు. వరదలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.2.5లక్షలు ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉంటే అలాంటి వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.8 లక్షలు ఇస్తామన్నారు. ఇళ్లుండి అదనపు గది కట్టుకోవడానికి రూ.4 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. 80 గజాల లోపు ఇళ్లున్నవారికి పూర్తిగా ఆస్తి పన్ను మాఫీ చేస్తామని పేర్కొన్నారు. పాతబస్తీ, ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. స్లమ్ డవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి 30వేల లీటర్ల నీళ్లను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
Must Read ;- మంచినీటి సరఫరా.. ఉచిత నల్లా కనెక్షన్: టీడీపీ మేనిఫెస్టో











