బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసులో తెలంగాణకు చెందిన కొందరు నాయకులకు సంబంధాలున్నాయన్న సమాచారం బయటకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ కేసులో త్వరలో నోటీసు జారీచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో వీరి పాత్ర ప్రత్యక్షంగా ఉందా లేక సమాచారం కోసం నోటీసులు జారీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం మేరకు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
వీరి పేర్లు తెరపైకి..
ఫిబ్రవరి 26న బెంగళూరులో నవగరా సర్వీసు రోడ్డులో నైజీరియాకు చెందిన హరిసన్, జాననాన్సోలు డ్రగ్స్ రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. వీరు ఇచ్చిన సమాచారంతో పాటు పోలీసుల విచారణలో పలు అంశాలు బయటకు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్ను ఆనుకుని ఉన్న జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఉత్తర తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు..ఉద్యమకారుడిగా పేరున్న వ్యక్తి పేరు కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. వీరు పాల్గొనే పార్టీల్లో డ్రగ్ర్స్ ఉండేవని ప్రచారం జరుగుతోంది. కన్నడ నటుడితో వీరికి సంబంధాలు కూడా ఉన్నాయని, ఆ నటుడు పాల్గొనే పార్టీల్లోనూ మాదక ద్రవ్యాలు వాడేవారని పోలీసులకు సమాచారం అందింది. ఇక నైజీరియాకు చెందిన వ్యక్తుల వద్ద నుంచి రూ.4కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నైజీరియాకు చెంది ఉస్మాన్, లోకొండోల పేర్లతో పాటు కన్నడ నటుడు మస్తాన్చంద్ర, కేశవ్, నిర్మాత శంకరగౌడ తదితర పేర్లు బయటకు వచ్చాయి. వారిలో కొందరిని పోలీసులు ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నవారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితులు ఇచ్చిన పార్టీల్లో, వారు నిర్వహించిన పార్టీల్లో తరచూ పాల్గొనే తెలంగాణకు చెందిన సందీప్, కలహర్తో పాటుకొందరు నాయకుల పేర్లుకూడా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఫాంహౌస్లలో జరిగిన పార్టీలకు సంబంధించి కూడా వీరికి లింకులున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం తెరపైకి వచ్చినా..
కాగా టాలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపింది. ఈ కేసులో పలువురిని పోలీసులు ప్రశ్నించారు. హైదరాబాద్ పరిధిలో 2018లో 55కేసులు, 2019లో 88 కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేసులే. అంతకుముందే 2017లో డ్రగ్స్ వ్యవహారంపై దర్యాప్తునకు తెలంగాణ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించింది. తరువాతి కాలంలో విచారణ కొన్నాళ్లపాటు సాగినా.. ఆకస్మికంగా ఈ వ్యవహారం మరుగున పడింది. తరువాతి కాలంలో బాలీవుడ్లోనూ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. జర్మనీ, బ్రిటన్, ఇంగ్లండ్ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ను దిగుమతి చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా బెంగళూరుకు చెందిన డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2017నాటి కేసుకు ఏమైనా సంబంధం ఉందా, అప్పటి నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయా, ఆ నాయకులకు ఎంతవరకు సంబంధం ఉంది, తెలిసే జరిగిందా అనేది తేలాల్సి ఉంది.