Drugs That Have Come To Light In Vijayawada Are Huge :
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ గా కొనసాగుతున్న విజయవాడ ఇప్పుడు మాదక ద్రవ్యాలకు కూడా కేంద్రంగా మారిపోయిందన్న వార్తలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆదివారం నాడు గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డ రూ.9 వేల కోట్ల విలువైన మత్తు పదార్థాలు చాలా చిన్నదని, ఇదే మార్గంలో, ఈ మాదకద్రవ్యాలను తెప్పించుకున్న సంస్థ ఇటీవలే ఏకంగా రూ.72 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను డెలివరీ చేసుకుందట. ఇలా విజయవాడకు చేరిన ఈ.72 వేల కోట్ల డ్రగ్స్.. ఇప్పటికే ఆ సంస్థ ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేసిందట. వెరసి విజయవాడను డ్రగ్స్ కేంద్రంగా మార్చేసిన ఈ నయా దందాలో ఇంకెంత మేర మత్తు పదార్థాలను విక్రయించిందోనన్న వార్తలు నిజంగానే ఏపీ ప్రజలను పెను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
దొరికింది తీగ మాత్రమే
ఆదివారం నాడు గుజరాత్ లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.9 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకున్నారని, ఈ డ్రగ్స్ విజయవాడకు చెందిన ఆశి కంపెనీకి వెళుతున్నాయన్న వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. నిత్యం రాజకీయ పార్టీల నినాదాల హోరెత్తుతున్న విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల దందా సాగుతుందా? అంటూ జనం షాక్ కు గురయ్యారు. ఇక ఈ మత్తు పదార్ధాలన్నీ తీవ్రవాదుల చెరలోని ఆప్ఘనిస్తాన్ నుంచి వస్తున్నాయని, సరఫరాదారులు కూడా అక్కడి వారేనని తేలడం మరింత కలవరపాటుకు గురి చేసింది. ఇక ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. ఇద్దరు ఆఫ్ఘన్లు సహా ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఆ వెంటనే విజయవాడలో అడుగుపెట్టిన డీఆర్ఐ అధికారులు.. నగరంలోని సత్యనారాయణపురంలోని ఆశి ట్రేడర్స్ కార్యాలయం కోసం వెతుకులాట ప్రారంభించాయి. అయితే డీఆర్ఐ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ పూరింటికి ఆశి కంపెనీ బోర్డు కనిపించిందట. ఈ షాక్ నుంచి తేరుకోకముందే.. ఆశి కంపెనీ యజమాని సుధాకర్ అత్తారిల్లు ఆ పూరిల్లేనని, అత్తారింటినే కేంద్రంగా చేసుకుని సుధాకర్ దందా నడుపుతున్నాడని తేలింది. దీంతో క్షణాల్లోనే సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. మరింత కూపీ లాగడం మొదలెట్టారు.
Must Read ;- వీళ్ల పోరు పరువు నష్టం దాకా వెళ్లింది
డొంక చాలా పెద్దది గురూ!
సుధాకర్ ను విచారించిన డీఆర్ఐ మరింత మేర సంచలన వివరాలను వెలికి తీసిందట. ఆదివారం పట్టుబడ్డ 3 టన్నుల హెరాయిన్ పట్టుబడితే.. ఈ ఏడాది జూన్ లో ఆశి కంపెనీ ఏకంగా 24 టన్నుల హెరాయిన్ ను డెలివరీ చేయించుకుందట. దాని విలువ ఏకంగా రూ.72 వేల కోట్ల పైమాటేనని కూడా డీఆర్ఐ తేల్చింది. అంటే.. మూడు నెలల వ్యవధిలోనే ఆశి ట్రేడర్స్ ఏకంగా రూ.81 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను విజయవాడకు తెప్పించిందన్న మాట. తాజా ఘటనలో పట్టుబడ్డ 3 టన్నుల మాదక ద్రవ్యాలు అలా స్తంభించిపోగా.. మూడు నెలల క్రితమే డెలివరీ అయిపోయిన డ్రగ్స్ ను ఆశి కంపెనీ ఇంకా తన పూరిల్లు లాంటి కార్యాలయంలోనే ఎందుకు ఉంచుకుంటుంది? ఇప్పటికే ఎక్కడికక్క సరఫరా చేసేసి ఉంటుంది కదా. ఆ సరఫరా అయిపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా3 టన్నులకు ఆర్డర్ పెట్టి ఉంటుంది కదా. మరి రూ.9 వేల కోట్ల మత్తు పదార్థాలు పట్టుబడితేనే మనమంతా నోరెళ్లబెడితే.. మూడు నెలల క్రితం ఆశి కంపెనీ తెప్పించిన రూ.72 వేల కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడి ఉంటే.. ఇంకెంతగా కలవరపాటుకు గురయ్యేవారమో కదా. అదలా ఉంచితే.. ఈ మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.81వేల కోట్ల మేర డ్రగ్స్ విజయవాడకు చేరితే.. అంతకుముందు ఇంకెంత మేర డ్రగ్స్ ను ఆ కంపెనీ తెప్పించి ఉంటుందోనన్న విషయాన్ని గుర్తు చేసుకునేంటేనే ఒళ్లు జలదరించక మానదు.
బడా దందాకు సూత్రధారులెవరో?
వేల కోట్లు, లక్షల కోట్ల విలువైన మత్తు పదార్థాలు గుట్టు చప్పుడు కాకుండా విజయవాడకు చేరిపోతున్నాయంటే.. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా తొలుత గుజరాత్.. అక్కడి నుంచి ఏపీలోని బందరు పోర్టుకు చేరిపోతున్నాయంటే.. పూరిల్లులో తెరిచిన చిన్న ఆశి కంపెనీ మాత్రమే ఈ దందాను నడుపుతోందంటే నమ్మశక్యం కావడం లేదు.ఈ దందా వెనుక బడా సూత్రధారులే ఉంటారన్న దిశగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ భారీ దందాను వ్యాపారవేత్తలు కాకుండా రాజకీయాల్లో పలుకుబడి కలిగిన వారే నడుపుతుండవచ్చన్న దిశగానూ మరింత కలవరపెట్టే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలో చాలా కాలం నుంచి ఇటు విజయవాడతో పాటు అటు గుంటూరు, తిరుపతి నగరాల్లోనూ పలుమార్లు డ్రగ్స్ వినయోగంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంటే.. చాలా కాలం నుంచే ఏపీకి డ్రగ్స్ పోటెత్తుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ దందా గుట్టు ఏమిటో? దందా సూత్రధారులెవ్వరో ఎప్పుడు బయటపడుతుందోనన్న దిశగా సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- బస్తీమే సవాల్.. డ్రగ్స్పై కేటీఆర్ ఓపెన్ అప్