ఏ ముహూర్తాన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కంటబడ్డారో తెలియదు గానీ.. జస్టిస్ కనగరాజ్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ సర్కారు ఆయనను నియమిస్తే..అదెలా కుదురుతుందంటూ హైకోర్టు ఆయన నియామకాన్ని కొట్టేసింది. అయితే అప్పటికైనా ఇటు జగన్ సర్కారో, అటు జస్టిస్ కనగరాజో.. ఎవరో ఒకరు వెనక్కు తగ్గి ఉండాల్సింది. తాను ఎంపిక చేసిన వ్యక్తికి ఏదో ఒక పదవి ఇచ్చి తీరతానని ఇటు జగన్.. జగన్ ఇచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకోవాలని అటు జస్టిస్ కనగరాజ్.. ఇరు వర్గాలూ ఒకే బాటలో సాగుతున్నాయి. అయితే జస్టిస్ కనగరాజ్ కోసమే జగన్ సర్కారు కొత్తగా సృష్టించిన ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గిరిలోనూ జస్టిస్ కనగరాజ్ కుదురుకునే ఛాన్స్ కనిపించడం లేదు. జగన్ చెప్పగానే.. ముందూ వెనుకా చూసుకోకుండా ఎగేసుకుని వస్తున్న జస్గిస్ కనగరాజ్ తాజా పదవిలోనూ కూర్చునేందుకు కూడా వీల్లేదన్న కోణంలో గురువారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని హైకోర్టు ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. అంటే.. ఈ పదవి నుంచి తక్షణమే తప్పుకోవడంతో పాటుగా పదవిలో కొనసాగాలంటే.. జస్టిస్ కనగరాజ్ ఏకంగా ఆరు వారాల పాటు వేచి చూడాలి. అప్పుడు కూడా హైకోర్టు ఓకే అంటే సరి.. లేదంటే ఈ దఫా కూడా జస్టిస్ కనగరాజ్ తట్టాబుట్టా సర్దుకుని తమిళనాడు బయలుదేరాల్సిందే.
హైకోర్టు తీర్పు నేపథ్యం ఇదే
ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని న్యాయవాది పారా కిశోర్ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జస్టిస్ కనగరాజ్ ను నియమించారని తన ఫిర్యాదులో కిశోర్ పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీ నిబంధన 4(ఏ)కు విరుద్ధంగా జస్టిస్ కనగరాజ్ ను నియమించారని కిశోర్ తెలిపారు. రాజకీయ జోక్యం లేకుండా ఈ అథారిటీ వ్యవహరించాలని సుప్రీంకోర్టు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. ఛైర్మన్ గా నియమితులయ్యే వ్యక్తి చట్టప్రకారం 65 ఏళ్లు నిండే వరకే ఆ పదవిలో ఉండాలని.. కానీ జస్టిస్ కనగరాజ్ ప్రస్తుత వయసు 78 ఏళ్లని.. వయసు రీత్యా కూడా జస్టిస్ కనగరాజ్కు అర్హత లేదని తెలిపారు. ఈ వాదనలను విన్న హైకోర్టు జస్టిస్ కనగరాజ్ ను ఆరు వారాల పాటు పదవి నుంచి సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను కూడా ఆరు వారాల పాటు వాయిదా వేసింది.
అంత ఇంటరెస్ట్ ఏమిటో..?
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారు.. నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో సీఎం జగన్ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద జస్టిస్ కనగరాజ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే తనదైన మార్కు న్యాయపోరాటం చేసిన నిమ్మగడ్డ జగన్ సర్కారుపై విజయం సాధించారు. వెరసి తిరిగి ఆయనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో రోజుల వ్యవధిలోనే తనకు దక్కిన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి జస్టిస్ కనగరాజ్ దిగిపోక తప్పలేదు. అప్పటికీ సర్దుకోని జగన్ సర్కారు ఆయనను పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన పిటిషనర్.. జస్టిస్ కనగరాజ్ తో ముఖ్యమంత్రికి ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణమని చెప్పారు. జస్టిస్ కనగరాజ్ నియామకానికి అనుగుణంగా నిబంధనలను సవరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ జీవో ఫైళ్లను కోర్టుకు తెప్పించి పరిశీలించాలని, జీవోను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Must Read ;- ఈ సారి పూనం వంతు.. బెయిల్ కూడా లేదంతే