పురపాలక సంఘ ఎన్నికల్లో అధికార వైసీపీ బెదిరింపులను అడ్డుకునేందుకు, శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆ పార్టీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకేరోజు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తుండగా బాలకృష్ణ హిందూపురంలో, లోకేష్ విశాఖలో పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ శ్రేణులు బెదిరించడమే కాకుండా దాడులకూ పాల్పడుతున్నాయని ఇప్పటికే టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు వేసినా..బలవంతంగా ఉప సంహరించుకేనేలా చేయడం, దౌర్జాన్యాలకు పాల్పడడం లాంటి చర్యలకు వైసీపీ దిగుతోందని ఆరోపిస్తూ మొన్న తిరుపతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబును రేణిగుంటలోనే అడ్డుకున్నారు పోలీసులు. రాత్రి వరకు విమానాశ్రయంలోనే నిరసన దీక్ష చేపట్టిన చంద్రబాబు తన శ్రేణులకు కూడా గట్టి మెస్సేజ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆ క్రమంలోనూ ముగ్గురూ ఏకకాలంలో రంగంలోకి దిగారు.
కర్నూలులో చంద్రబాబు..
చంద్రబాబు గురువారం కర్నూలులో పర్యటించారు. కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అరాచకాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని, పోలీసులు ఎప్పుడు ఎవరి ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతినేలా వైసీపీ పాలిస్తోందని, ఆలయాలపై దాడులు చేస్తున్నారని, తమ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేశామని, జగన్ విధ్వంసానికి పెద్దపీట వేశారని విమర్శించారు.
లోకేష్ సంచలన వ్యాఖ్యలు
కాగా ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ విధ్వంస పాలన చేస్తున్నారన్నారు. విశాఖలో గురువారం విద్యార్థులతో సమావేశమైన లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేసేందుకు జగన్ కుట్ర చేశారని విమర్శించారు. శుక్రవారం జరగబోయే బంద్కి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రెండేళ్లలో విశాఖకు ఏం చేశారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించిన లోకేష్ విశాఖలో రౌడీ దిగాడని, ఆ రౌడీ A2 అని, మొత్తం భూములు దోచుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం దారితప్పుతోందని, మీ ఓటు విశాఖ భవిష్యత్ను నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సమైక్య పోరాటం చేయాలని కోరారు.
హిందూపురంలో బాలకృష్ణ
హిందూపురం మున్సిపల్ ఎన్నికలకు బాలకృష్ణ ప్రచారం ప్రారంభించారు. సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించిన బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. యువత భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. హిందూపురంలో ఎవరూ భయపడొద్దని, రెండేళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని మండిపడ్డారు. ఒకరు చంద్రబాబును తిట్టడానికి మాత్రమే సమయం కేటాయిస్తున్నారని, మరొకరు లిక్కర్ మాఫియా నేత అని ఆరోపణలు చేశారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్లు గౌరవ ప్రదంగా వ్యవహరించేవారని, ఇప్పుడు వారి పరిస్థితి కూడా మారిపోయిందన్నారు.
Must Read ;- గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు