తెలుగు తెరపై ప్రతినాయక పాత్రల్లో తనదైన ముద్ర వేసిన నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఆయన డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఒకానొక సమయంలో కోట లేని సినిమా ఉండేది కాదు. పోస్టర్లో ఆయన కనిపిస్తున్నాడా? లేదా? అని చూసుకుని మరీ థియేటర్లకు వెళ్లినవారు ఉన్నారు. పవర్ఫుల్ విలనిజం .. కామెడీ టచ్ తో కూడిన విలనిజంతో తెరపై ఆయన చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి కోట శ్రీనివాసరావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.
“కోట శ్రీనివాసరావు పలు వేదికలపై తెలుగు సినిమాపై పరభాషా నటుల ప్రభావాన్ని గురించి ప్రస్తావించారు. ఆ విషయం ఈ ఇంటర్వ్యూలో చోటు చేసుకుంది. ‘మీరు ఇతర భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు … అలాంటి మీకు పరభాషా నటులపై ఎందుకంత కోపం?’ అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు కోట తనదైన శైలిలో స్పందిస్తూ .. ” ప్రతివాళ్లు ఈ ప్రశ్నను చాలా తప్పుగా అడుగుతున్నారు. పరభాషా నటులను నేను ఎప్పుడూ ఏమీ అనలేదు .. వాళ్లకి అవకాశం ఇచ్చేవాళ్ల దగ్గర నా ఆవేదన వ్యక్తం చేశాను.
మీకు దమ్ముంటే నసీరుద్దిన్ షాను పట్టుకు రండి .. నానా పటేకర్ ను తీసుకు రండి .. అమితాబ్ ను తీసుకురండి. మోహన్ లాల్ .. మమ్ముట్టి వంటి గొప్ప నటులను పట్టుకుని రండి. తమని తాము నిరూపించుకున్న నటులను తీసుకుని రాకుండా, చెత్త బ్యాచ్ ను తేవడం వలన సుఖం ఏముంటుంది చెప్పండి? ఆ మాత్రం నటన తెలిసినవారు మన దగ్గర చాలామందే ఉన్నారు. ఇతర భాషల నుంచి తీసుకొస్తున్న వాళ్లకంటే ఇక్కడి వాళ్లు బాగా చేస్తారు. మనవాళ్లకు అవకాశాలు ఇవ్వండి .. అదే నేను అనేది .. అడిగేది. దానిని వక్రీకరించి పరభాషా నటులంటే కోటకి కోపం అంటారు .. వాళ్లపై నాకెప్పుడూ కోపం లేదు” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- ఎన్నికల కోసం ఆగలేకపోతున్న ప్రకాష్ రాజ్