అడవి బిడ్డలపై అటవీ అధికారుల అక్కసు కొనసాగుతోంది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపై దాడులు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన అందరినీ కలచివేస్తోంది. అటవీ ఉత్పత్తులకు వెళ్లిన గిరిజన మహిళలు, వృద్ధులపై ఫారెస్టు అధికారులు ప్రతాపం చూపారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దొరికిన వారిని దొరికినట్టే చితక్కొట్టారు.
నలుగురి పరిస్థితి విషమం..
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా, గుంపన్పల్లి గ్రామాల మహిళలు అటవీ ఉత్పత్తులు సేకరించేందుకు అడవిలోకి వెళ్లారు. అక్కడే కొంతసేపు సేదతీరేందుకు పడుకున్నారు. ఆ సమయంలో అక్కడికి అటవీ అధికారులు వచ్చారు. ఆగ్రహంతో వారిపై విరుచుకు పడ్డారు. మహిళలు, వృద్ధులు అనే కనికరం లేకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ.. చితక్కొట్టారు. ఈ దాడిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మన్ననూర్ బేస్ క్యాంప్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు.
ఆందోళనలు.. ఆగ్రహావేశాలు..
అడవిలో నిద్రిస్తున్న వారిపై అటవీ అధికారులు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై నిరసన నిర్వహించారు. మున్ననూర్ చెక్ పోస్టు వద్ద ప్రజా సంఘాలతో కలిసి గిరిజన నాయకులు రాస్తారోకో చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఆదివాసీలు బేస్ క్యాంపు వద్దకు చేరుకుని అటవీ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఫారెస్ట్ అధికారితో పాటు ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
Must Read ;- గుర్రంబోడులో రణరంగం.. పచ్చని పల్లెలో రాజకీయ విధ్వంసం!