జాంబిరెడ్డి.. ఈ పేరు వింటేనే ఇదేదో కొత్త ప్రయోగం లాగానే ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందింది ‘జాంబిరెడ్డి చిత్రం. మొదటి సినిమా ‘అ’తోనే కొత్త ప్రయోగానికి నాంది పలికారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ చిత్రాన్ని రూపొందించారు. థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఈ సినిమా ఎలా ఉంది? జాంబి కాన్సెప్ట్ కు దర్శకుడు ఎంతవరకు న్యాయం చేశాడు? అనే విషయాలను చూద్దాం.
కథలోకి వెళితే..
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూపొందించే ప్రయోగాలు వికటించి కొత్త వైరస్ కు దారితీస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయన్నదే స్థూలంగా ఈ కథ. ఈ కథలో ముఖ్యంగా రెండు గ్రామాల ప్రజలు జాంబియాలుగా మారితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశాన్ని ఆసక్తికరంగా మలిచారు. మారియో (తేజ సజ్జా) ఓ గేమ్ డిజైనర్. తను రూపొందించిన గేమ్ లో చిన్న లోపం దొర్లడం, ఆ గేమ్ రూపకల్పనలో అతనికి తోడ్పడిన మిత్రుడు కళ్యాణ్ (హేమంత్) అందుబాటులో లేకపోవడం జరుగుతుంది.
ఆ లోపాన్ని సరిదిద్దాలంటే కళ్యాణ్ సహకారం అవసరం. కానీ అతను తనకు పెళ్లి కుదిరిందని, కర్నూలులో జరిగే పెళ్లికి రావాలని ఆహ్వానిస్తాడు కళ్యాణ్. దాంతో ఆ పెళ్లికి తన స్నేహితులు భద్రం, దీక్ష( దామరాజు కిరీటి, దీక్షా నగాకర్ )లతో కలిసి బయలుదేరతాడు తేజ. మార్గ మధ్యంలో తేజతో పాటు ప్రయాణించే భద్రం జాంబియా కాటుకు గురవుతాడు. ఆ సంగతికి తేజ, దీక్ష్ల లకు తెలియదు. పెళ్లి కూతురు తండ్రి కర్నూలు భూమారెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్టు అనే సంగతి మారియోకు తెలుస్తుంది. భూమారెడ్డి ఇంట్లో నందినీ రెడ్డి (ఆనంది) ఎందుకుంది అన్నది సినిమా చివరలో కానీ తెలియదు.
భూమారెడ్డి బద్ద శత్రువు వీరారెడ్డి పెళ్లి కొడుకును అంతమొందించాలనుకుంటున్న సంగతి కూడా తెలుస్తుంది. ఎలాగైనా తన మిత్రుడిని రక్షించుకోవాలనుకుంటాడు మారియో. మిత్రుడికి ఈ విషయం చెప్పినా అతను నమ్మడు. చివరికి జాంబియా కాటుకు గురైన మిత్రుడు ఇతరులను కూడా కొరకడంతో అందరూ జాంబియాలుగా మారిపోతుంటారు. విషయం అర్థమైన మారియో మిగతా వారిని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన ఇబ్బందులేమిటి? చివరికి అతను ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు అన్నదే కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
నలిగిన ట్రాక్ లో కథను అల్లాడు. చిరిగిపోయిన విస్తరాకులో విందు భోజనం పెట్టినట్టుంది.
దర్శకుడు తనదైన శైలిలోనే ఈ కథను డీల్ చేశాడు. కథనంలో గ్రిప్పింగ్ ఏమాత్రమూ సడలలేదు. ఓ పక్క భయం, మరో పక్క నవ్వు మిళితమైన కథనం ఆద్యంతం థియేటర్లో ప్రేక్షకుడిని కూర్చోబెడుతుంది. ఈవీవీ ‘జంబలకిడి పంబ’ ఫార్మాట్ లో కథను చెప్పే ప్రయత్నం చేశాడు.ఆ సినిమాలో కైమాక్స్ లో ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్న ఆసక్తి కలుగుతుంది. అదే మాదిరిగానే దర్శకుడు ఈ కథకు కూడా ముగింపు చెప్పాడు. హారర్ కథను వినోదాత్మకంగా చెప్పే ప్రయ్నతం చేశారు.
కసిరెడ్డిగా గెటప్ శ్రీను నటన ఈ సినిమాలో వినోదం స్థాయిని పెంచింది. మారియోగా తేజ సజ్జాకు మరో మంచి అవకాశంగా ఈ సినిమాని చెప్పాలి. తెలిసిన నటులు తక్కువగా ఉండటం కొంత ఇబ్బంది కలిగించింది. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. హీరోయిన్ ఆనంది నందినీ రెడ్డి పాత్రలో మెప్పించింది. ఆమెకు మరిన్ని అవకాశాలు రావడానికి ఈ సినిమా దోహదపడుతుంది. కరోనాకి వ్యాక్సిన్ కనుగొనే శాస్త్రవేత్త పాత్రను త్రిపురనేని చిట్టి పోషించారు. మేకప్ అవసరం లేకుండానే ఈ పాత్రకు ఆయన చక్కగా సరిపోయారు. కరోనా తర్వాత దర్శకుడు జాంబిరెడ్డితో బాక్సాఫీసు మీద దాడి చేశారనే చెప్పాలి. జాంబీ కాన్సెప్ట్ హాలీవుడ్ లో ఉన్నదే. దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ కథకు సీక్వెల్ ఉన్నట్లుగా ముగింపు చూస్తే అనిపిస్తుంది.
నటీనటులు – సాంకేతివర్గం: తేజ సజ్జా, ఆనంది, దీక్షానగార్కర్, రఘుబాబు, పృద్వీ, గెటప్ శ్రీను, దామరాజు కిరీటి, మహేష్ విట్టా తదితరులు.
రచన : తాజుద్దీన్ సయ్యద్
సంగీతం: మార్క్ కే రాబిన్
సినిమా టో గ్రఫీ : అనిత్
ఎడిటింగ్ : సాయిబాబు,
నిర్మాణం : ఏపిల్ ట్రీస్ స్టూడియోస్
నిర్మాత : రాజ్ శేఖర్ వర్మ,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
విడుదల: 05-02-2021
ఒక్కమాటలో: తెలుగులో కొత్త ప్రయోగం
రేటింగ్: 2.75
-హేమసుందర్ పామర్తి











