నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ సినిమా రూపొందింది. ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రకుల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి హైదరాబాద్ .. మాదాపూర్ లోని ‘ఎన్ కన్వెన్షన్’ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ లో ప్రియా వారియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్య అతిథిలుగా రాజమౌళి – వరుణ్ తేజ్ వచ్చారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. తనకి చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఆయన కథను నడిపించే తీరు, పాత్రలను తీర్చిదిద్దే విధానం తనకి బాగా నచ్చుతుందని అన్నాడు. ఈ వేడుకకి తాను ముఖ్యఅతిథిగా కాకుండా, నితిన్ స్నేహితుడిగా మాత్రమే వచ్చానని చెప్పాడు. రాజమౌళి వంటి గొప్ప దర్శకుడితో స్టేజ్ ను షేర్ చేసుకునే అదృష్టం తనకి కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. రాజమౌళి చేతుల మీదుగా ‘బిగ్ టికెట్’ అందుకున్నాడు. ఈ సినిమా తప్పనుకుండా హిట్ కొట్టాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు.
ఇక నితిన్ మాట్లాడుతూ .. చాలా కాలం తరువాత స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయడం సంతోషంగా ఉందని అన్నాడు. చంద్రశేఖర్ యేలేటిగారే కదా .. మనకు తెలిసిన యాక్షనే కదా అని సెట్స్ పైకి వెళ్లాను. కానీ ఆయనను మెప్పించేలా చేయడం చాలా కష్టమనే విషయం నాకు తొలిరోజునే అర్థమైంది. ఆయన స్కూల్ నాకు అర్థమయ్యేవరకూ సీన్ కి 10 .. 12 టేకులు తీసుకునేవాడిని. ఇప్పుడు అసలైన నటనను నేర్చుకుంటున్నాను అని నాకు అనిపించింది. ఆయన సినిమాల్లోని పాత్రలు ఎందుకు అంత సహజంగా అనిపిస్తాయనేది స్పష్టమైంది అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- వరుసగా నితిన్ సినిమాల సందడి











