ఏపీలో ఓ వైపు మూడు రాజధానుల ఉద్యమం జరుగుతుండగా మరో ఉద్యమానికి తెరలేచింది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసే దిశగా కేంద్రం అడగులు వేయడంతో ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలై 32 బంది బలిదానంతో ఏర్పాటై నవరత్నాల్లో ఒకటిగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే నిర్ణయం వెనుక కుట్ర ఉందని కూడా విమర్శలు మొదలయ్యాయి. విశాఖ ఉక్కు కర్మాగారంతో కేవలం వైజాగ్కి మాత్రమే కాదు..తెలుగు రాష్ట్రాలతోనూ సెంటిమెంట్ బంధం ఉంది. ఆనాటి ఉద్యమంలో అప్పటి ఏపీ నుంచి అన్నిప్రాంతాల నేతలూ ఇందుకు పోరాడారు. విశాఖ ఉక్కు కోసం.. ఆదిలాబాద్లోనూ ప్రాణత్యాగం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నో ఒత్తిళ్లూ ఎదుర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించారు. ఆనాటి పరిస్థితిని చూసిన రాజకీయ నాయకులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆ విషయాలను పరిశీలిస్తే..
అంత ఉద్యమం ఎందుకు..
1960వ దశకంలో ఆంధ్రప్రదేశ్ అన్నిరకాల సంక్షిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలూ ఇందుకు కారణం అయ్యాయి. పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా అమలవుతున్న కార్యక్రమాల్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందనే వాదన అప్పటికే ఉంది. అంతే కాకుండా ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయి (1953) 10 ఏళ్లు అవుతున్నా ఏపీ (1956)లో పలు ఇబ్బందులు నెలకొన్నాయి. 1960ల్లోనూ ఆ ఇబ్బందులను అధిగమించలేదు. మద్రాసీ అనే ముద్ర నుంచి బయటపడలేదు. అప్పటికే అన్నివర్గాల్లోని మేథావుల్లో ఆ అభిప్రాయం నెలకొంది. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన మాత్రమే పరిష్కారమని మేథావులు నినదించారు. అదే సమయంలో నాలుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో రూర్కెలా(ఒడిశా), భిలాయ్(అప్పటి మధ్యప్రదేశ్ ప్రస్తుత చత్తీస్ఘడ్), అసన్సోల్ (పశ్చిమబెంగాల్)లలో మూడు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. నాలుగోది బొకారో ( అప్పటి బీహార్, ఇప్పటి ఝార్ఖండ్ ) ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దక్షిణాన ఒక్క కర్మాగారం లేక అప్పటికే వ్యతిరేకత మొదలు కావడంతో దీనిపై చర్చ నడిచింది.
Must Read ;- విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. కాపాడుకుందాం రండి
ఇదీ ఉద్యమ ప్రస్థానం..
ఈ కంపెనీని ఏపీలో ఏర్పాటు చేయాలని 1964లో అసెంబ్లీలో అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సారథ్యంలో తీర్మానం జరిగింది. అప్పటి ప్రతిపక్ష నాయకులు తెన్నేటి విశ్వనాధం, గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాల కృష్ణయ్య, పి.వెంకటేశ్వర్లు లాంటివారు కూడా మద్దతు ఇచ్చారు. అప్పుడు కేంద్ర మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉండడంతో ఆయనపైనా ఉమ్మడి ఏపీ నుంచి విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్రం పరిశీలనకు హిందూస్తాన్ స్టీల్స్ (అప్పటి)ను కోరగా పలు సంస్థలు కలిసి నివేదిక ఇచ్చాయి. వైజాగ్తో పాటు సేలం, గోవా, నైవేలీలను ప్రతిపాదించారు. విశాఖ ఓడరేవు కూడా కావడంతో సానుకూలత ఉంటుందని కమిటీ తేల్చింది. తరువాత కాలంలో కంపెనీ ఏర్పాటుకు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చారు. అయితే 1966లో ఆయన ఆకస్మిక మరణంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. తరవాత ప్రధాని అయిన ఇందిరాగాంధీ విశాఖతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా డిమాండ్ వస్తోందని చెప్పడంతో ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.
ఇందిర హయాంలో..
అదే సమయంలో సేలంలో కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని ఆ రాష్ట్ర సీఎం తమిళనాడు అసెంబ్లీలో ప్రకటించడంతో ఏపీ ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆగ్రహావేశాలకూ లోనయ్యారు. అదీ చాలదన్నట్లు.. నీలం సంజీవరెడ్డిని ఉక్కు శాఖ మంత్రిగా తప్పించిన ఇందిర..ఆయనకు పర్యాటక శాఖ అప్పగించారు. ఇది మరో సెంటిమెంట్కు కారణమైంది. ఇదే సమయంలో నీలం వర్సెస్ కాసు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కూడా పెరిగింది. పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు జరిగాయి. రాజకీయ కారణాలతో విశాఖ ఉక్కు సాధ్యం కాదన్న చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో 1966 అక్టోబరు 15న గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. రోజురోజుకూ ఉద్యమం విస్తరించింది. అన్నివర్గాలూ మద్దతు తెలిపాయి.
Must Read ;- వాట్ ఏ జోక్.. విశాఖ ఉక్కుపై బీజేపీ పోరాటమట..!
విశాఖ ఉక్కు కోసం ఆదిలాబాద్లో ఆందోళన..కాల్పుల్లో ఒకరు బలి
1966 నవంబరు 1న జరిగిన ఘటన ఉద్యమాన్ని మలుపు తిప్పింది . ఆరోజున ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పరస్పరం దాడులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో మొత్తం 9మంది చనిపోయారు. ముగ్గురు విద్యార్థులు, తొమ్మిదేళ్ల బాలుడు, మరోఐదుగురు ఉద్యమకారులు ఉన్నారు. ఈ ఘటనతో ఉద్యమంపై హింసాత్మక ముద్ర వేసేందుకు కేంద్రం యత్నించడం మొదలు పెట్టిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఆ క్రమంలో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఉద్యమకారులు రైల్వే స్టేషన్లు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోవడంతో వాటిని ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు మొదయ్యాయి. పోలీసుల కాల్పులూ జరిగాయి. ఆ కాల్పుల్లో ఆదిలాబాద్, శ్రీకాకుళం, కాకినాడ, వరంగల్, సీలేరుల్లొ ఒకరు చొప్పున, గుంటూరు, విజయవాడలో 5గురు చొప్పున, విజయనగరంలో ఇద్దరు చనిపోయారు. మొత్తం మీద 32మంది బలయ్యారు. ఉద్యమం అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్రం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో కంపెనీ ఏర్పాటు చేయాలని కోరేందుకు వెళ్లిన ఎంపీలపై ప్రధాని ఇందిర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అప్పటి నాయకులు చెబుతుంటారు. మంత్రివర్గ ఉప సంఘం నియమించిందన్న ప్రకటనతో ఆందోళనకు తత్కాలికంగా తెరపడినా.. తరువాత కేంద్రం మళ్లీ మొదటికొచ్చింది. ఖనిజాల లభ్యతను బట్టి కర్మాగారం ఏర్పాటు అవుతుందని, ప్రజల్లో వచ్చే డిమాండ్ని బట్టి కాదని కేంద్రం ప్రకటించడంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 67మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు.
పార్లమెంటులో ప్రకటన
1967లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 167 ఎమ్మెల్యే సీట్లు గెలవగా 35 ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు 1970లో విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ఆధీనంలో ఆ కంపెనీ పనిచేస్తుందని ప్రధాని ఇందిర పార్లమెంట్లో ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన వెంటనే కురుపాం జమిందారులు 6వేల ఎకరాలు, మరికొందరు పారిశ్రామిక వేత్తలు 2వేల ఎకరాలను విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఇంత భూరి విరాళం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేసినా 1977లో పనులు మొదలయ్యాయి. సాంకేతికంగా రష్యా సహకారం తీసుకుని పనులు ప్రారంభించారు. అయితే నిధుల కొరత, సాంతికేక అంశాల కారణంగా దాదాపు 20 ఏళ్లు పట్టింది. 1992లో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైంది. అంటే దాదాపు 20ఏళ్ల పోరాటమని చెప్పవచ్చు. ఇలా మొత్తం 26వేల ఎకరాల్లో, ఏటా 7.3మిలియన్ టన్నుల సామర్థ్యం, 16వేలమంది ఉద్యోగులు, 17,500మంది తత్కాలిక ఉద్యోగులు, మొత్తం మీద లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించింది విశాఖ ఉక్కు కర్మాగారం. సొంత ఇనుప ఖనిజాలు లేకపోవడంతో ఖర్చులు పెరగడంతో నష్టాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తరచూ తలెత్తుతోంది. ఉత్పాదక నష్టాల్లేకపోగా ముడి ఇనుము కొనుగోలు, అప్పులపై వడ్డీల్లాంటివి కంపెనీకి భారంగా మారాయి.
Also Read ;- పెట్టుబడులు పెంచేందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: సుజనాచౌదరి
సొంతంగా గనులు లేని విశాఖ ఉక్కు..
దేశంలో సొంత గనులు లేని ఏకైక భారీ ఉక్కు కర్మాగారం వైజాగ్ స్టీల్స్ అని చెప్పవచ్చు.ముడి ఇనుము, బొగ్గు కోసం,కోకింగ్ కోల్ బ్లాక్ల కోసం ఒడిషా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బిస్రా స్టోన్ లైమ్ కంపెనీల నుంచి కొంటోంది. దీంతో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఏటా ఇందుకు రూ.3వేల కోట్ల అదనపు భారం పడుతోంది. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోగా తర్వాతి కాలంలో తేరుకొని రూ. 21,851 కోట్ల టర్నోవరు సాధించింది. 2003-2009 మధ్య కాలంలో రూ.వెయ్యికోట్ల లాభాలను సాధించింది. 2015-2018 మద్య ధరల పెరుగుదల కారణంగా నష్టాల్లోకి వెళ్లింది. 2018-19లో రూ.97 కోట్ల లాభం వచ్చింది. తరువాతి కాలంలో మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. ఇదే కారణంగా గతంలో పోస్కోను రంగంలోకి దింపేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఆందోళనలు జరగడంతో కంపెనీతో మాట్లాది పోస్కోను వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే నిర్మించేందుకూ సిద్దమైంది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధం కావడంతో ఆందోళన మొదలైంది.
ఇక్కడ ఎలా..
కాగా 1990ల్లో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిచేందుకు అంతా సిద్ధమైంది. పనులు కూడా పూర్తయ్యాయి. గతంలో మూతపడిన కర్మాగారం స్థానంలోనే గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు చేసింది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్సీఐల్)ల సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. అలాంటిది కొన్ని చర్యలు తీసుకుంటే లాభాల్లోకి వచ్చే విశాఖ ఉక్కును నష్టాలు వస్తున్నాయన్న కారణం చెప్పి.. ప్రైవేటు పరం చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎన్నో ఆరోపణలు..
ఇక టీడీపీ నేత అయ్యనపాత్రుడు చేసిన వ్యాఖ్యలూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూ.లక్ష కోట్లకుపైగా విలువ ఉన్న విశాఖ ఉక్కు కంపెనీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్ను పడిందని, అందుకే కుట్ర ప్రకారం ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇక పోస్కో కంపెనీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో ఎంటరయ్యేందుకు యత్నించిందన్న టాక్ కూడా గతంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యనపాత్రుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అధికార, విపక్ష ఎంపీలు ప్రకటన చేశారు. కాగా విశాఖలో ఇప్పటికే ఉద్యమం మొదలైన నేపథ్యంలో 22మంది ఎంపీలున్న వైసీపీ కేంద్ర నిర్ణయాన్ని ఎంతవరకు అడ్డుకుంటుందో చూడాలి.