తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. కాకినాడలో టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు కేటాయించడంలో భారీ అవినీతి జరిగిందని రాజ్యసభ సభ్యుడు ప్రభుత్వానికి, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణకు వారం కిందటే ఫిర్యాదు చేశారు. ఇశాళ కాకినాడలో జరిగిన డీఆర్సీ సమావేశంలోనూ టిడ్కో ఇళ్ల అవినీతిని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తారు. దీంతో కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజ్యసభ సభ్యుడి వైపు చేయి చూపిస్తూ, బండబూతులు తిడుతూ దూసుకెళ్లారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా బిత్తరపోయారు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ దగ్గరకు రావడంతో పరువు పోతుందని కొందరు సభ్యులు వారిని దూరంగా తీసుకెళ్లారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించకపోయినా వీడియోలు బయటకు వచ్చాయి. వారు పరస్పరం తిట్టుకుంటోన్న వీడియోలు వైరల్ గా మారి వైసీపీ నేతల పరువు తీశాయి.
అక్రమ కట్టడాల వల్లే కాకినాడ మునిగిపోయింది
కాకినాడ నగరాన్ని ఇటీవల వరదలు ముంచెత్తాయి. నగరంలోని మేడలైన్ ప్రాంతంలో కొందరు నేతల అక్రమ కట్టడాల వల్లే నగరంలో వరదలు ముంచెత్తాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ డీఆర్సీలో లేవనెత్తారు. దీంతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా లేచి బూతులందుకున్నారు. దీంతో బోస్ కూడా తగ్గలేదు. ఒకరినొకరు తిట్టుకుంటూ దగ్గరగా వచ్చారు. కొట్టుకునేంత పనైంది. కొందరు సభ్యులు వారిని వారించి బయటకు తీసుకెళ్లారు. దీంతో వైసీపీలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి మరోసారి రచ్చకెక్కింది.
ప్రశ్నిస్తే ఊరుకోం…
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిని ప్రతిపక్షాల నేతలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఇక సొంత పార్టీ వారే అవినీతిపై ప్రశ్నిస్తే బూతులతో విరుచుకుపడుతూ వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదనే మొండి వైఖరితో ముందుకెళెతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
Must Read ;- జగనన్న చేతులు కలిపినా, కలవని మనుషులు