తెలుగు తెరపై భారీ అందాల భామగా అనసూయకి విపరీతమైన క్రేజ్ ఉంది. అప్సరసలు అసూయపడే అందం .. జక్కన్న చెక్కిన శిల్పాలు చిన్నబుచ్చుకునే సౌందర్యం ఆమె సొంతం. అనసూయ కుర్ర ప్రేక్షకుల ఊహాసుందరి .. మనసు మనసును అల్లుకున్న మల్లె పందిరి. అలాంటి అనసూయ ఒక వైపున బుల్లితెరపై కార్యక్రమాలను చక్కబెడుతూనే, మరో వైపున సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతోంది. వెండితెరపై తన మెరుపులకు .. విరుపులు ఖరీదును పెంచుతూ కళ్లెం లేని గుర్రంలా దూసుకుపోతోంది.
అనసూయ సినిమాల్లో నిడివి కలిగిన పాత్రలు చేయలేక కాదు .. అలాంటి అవకాశాలు రాకా కాదు. కానీ ప్రస్తుతం ఆమెకి అంత తీరికలేదు. అందువల్లనే స్పెషల్ సాంగ్స్ చేయడానికే ఆమె మొగ్గుచూపుతోంది. ఆ మాత్రం అవకాశం తమకి చాలు అన్నట్టుగానే దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇంతకుముందు ఆమె ‘విన్నర్’ సినిమాలో చేసిన ‘సూయ సూయ సూయ’ స్పెషల్ సాంగ్, ‘ఎఫ్ 2’ సినిమాలో ‘డింగ్ .. డాంగ్’ స్పెషల్ సాంగ్ కుర్రాళ్లను ఊపేశాయి. ఇక తాజాగా ఆమె మరో స్పెషల్ సాంగ్ లోను తన అందాలను ఆరబోయనుంది .. యువకుల్స్ హృదయాలను ఆవిరి చేయనుంది. ఆ సినిమా పేరే ‘చావుకబురు చల్లగా’.
కార్తికేయ – లావణ్య త్రిపాఠి నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా ద్వారా, కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండటంతో, దానిని అనసూయతోనే చేయించాలని భావించారు. ఆ స్పెషల్ సాంగ్ ట్యూన్ .. లిరిక్ విన్న తరువాతనే అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 3 నిమిషాల నిడివి కలిగిన ఈ సాంగ్ లో సందడి చేయడానికి ఆమె అడిగిన పారితోషికం అక్షరాలా 20 లక్షలు అని అంటున్నారు. ప్రస్తుతం అనసూయకి గల క్రేజ్ .. ఆమెకి గల డిమాండ్ చూస్తుంటే, త్వరలో ఆమె పాటకి కోటి తీసుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదేమో!
Must Read ;- పవన్ మూవీలో అనసూయ? ఈసారైనా ఓకే చెబుతుందా.?