AP CM Jagan Accepted The YSRCP As The Pilla Congress By Starting Sealed Cover Culture :
కడప ఎంపీగా ఉంటూ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే కదా. నాడు వైరివర్గాలన్నీ జగన్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని హేళన చేసిన సంగతి గుర్తుంది కదా. ఆ మాటను నిజం చేస్తూ ఇప్పుడు జగన్.. తన తల్లి పార్టీ సంస్కృతికి తెర తీశారు. ఇటీవలే ముగిసిన పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలోని సంస్కృతి వైసీపీలో చాలా స్పష్టంగానే కనిపించింది. సీల్డ్ కవర్ అంటూ ఎంపీపీ, జడ్పీ చైర్మన్ లను ఎంపిక చేసిన జగన్.. ఆయా సీల్డ్ కవర్లను ఆయా జిల్లాల ఇంచార్జీ మంత్రులకు ఇచ్చి సంబంధింత నేతలకు పంపారు. ఈ తరహా సంస్కృతి వైసీపీలో ఇప్పటిదాకా లేదనే చెప్పాలి. ఏ పదవికి నేతను ఎంపిక చేసినా జగనే స్వయంగా ఆయా నేతల పేర్లను ప్రకటించేవారు. నేతలను ఎంపిక చేసి ఆ జాబితాను గుట్టుగా సీల్డ్ కవర్లలో పంపిన దాఖలా అయితే లేదు. తాజాగా ఈ సీల్డ్ కవర్ సంస్కృతిని ప్రారంభించడం ద్వారా తన పార్టీపై పడిన పిల్ల కాంగ్రెస్ వాదనను జగన్ నిజం చేశారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
పదేళ్ల పాటు కొత్త బాణీనే
2011లో ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పుంతలు తొక్కించారనే చెప్పాలి. ఏ నిర్ణయం తీసుకున్నా.. బహిరంగంగానే ప్రకటనలు చేయడంతో పాటు తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవేనన్న విషయంపైనా జగన్ క్లారిటీ ఇచ్చేవారు. రాజ్యసభకు నేతల ఎంపిక, రాష్ట్ర శాసనమండలికి నేత ఎంపిక, ఆయా నామినేటెడ్ పదవులకు నేతల ఎంపిక, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి నిర్ణయాలు.. ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ తరఫున జగనే స్వయంగా పార్టీ వైఖరిని వెల్లడించేవారు. కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి తామేమీ ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోలేమని.. కాపుల కంచుకోట అయిన తూర్పు గోదావరి జిల్లా జక్కంపేటలో జగన్ చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. మొత్తంగా కొత్త పార్టీ అయిన వైఎస్సార్సీపీపై జగన్ ఏనాడూ ఇతర పార్టీల ముద్ర పడకుండా జాగ్రత్తగానే వ్యవహరించారని చెప్పాలి. అయితే అధికారం చేజిక్కిన తర్వాత ఈ తరహా జగన్ తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఇకపై అన్నీ సీల్డ్ కవర్లలోనేనా?
పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ఎంపికను పార్టీ అధిష్ఠానం నిర్ణయించి ఆ నిర్ణయాలను సీల్డ్ కవర్ లో పెట్టి.. వాటిని జిల్లాల ఇంచార్జీ మంత్రుల చేతుల్లో పెట్టేసిన జగన్.. ఆ మేరకే నేతలకు పదవులు కట్టబెట్టాలని తీర్మానించారట. ఈ సీల్డ్ కవర్లను పట్టుకుని జిల్లాలకు పరుగులు తీసిన ఇంచార్జీ మంత్రులు.. జడ్పీ చైర్మన్ల వరకైతే న్యాయం చేయగలిగారు గానీ.. ఎంపీపీ స్థానాలకైతే న్యాయం చేయలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్లంటే జిల్లాకు ఒకరే ఉంటారు కాబట్టి.. జగన్ సీల్డ్ కవర్ మంత్రాంగం సాఫీగానే సాగిపోయింది. అయితే ఎంపీపీల విషయానికి వచ్చే సరికి ఒక్కో జిల్లాలో హీనపక్షం 50 స్థానాలు ఉండటంతో ఆ పదవులకు నేతల ఎంపికలో ఇంచార్జీ మంత్రులు కూడా చేతివాటం ప్రదర్శించారన్న వాదనలు లేకపోలేదు. చిత్తూరు జిల్లా నగరి పరిధిలోని నిండ్ర మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి.. ఎమ్మెల్యే రోజా, మంత్రి పెద్దిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో సీల్డ్ కవర్ లో ఖాళీ పేపర్ ను పెట్టేసిన జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. దానిని ఎమ్మెల్యే రోజా చేతిలో పెట్టారట. ఈ విషయం తెలిసిన వైరివర్గం రోజా ప్రతిపాదించిన నేతకు పదవిని అప్పగించేందుకు ససేమిరా అన్నది. ఈ తరహా పరిస్థితి చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కొనసాగుతున్న సీల్డ్ కవర్.. ఇకనపై వైసీపీలోనూ కంటిన్యూ కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఫర్ ద ఫస్ట్ టైం..ఆర్కే తేలిపోయారు











