YSRCP MLA RK Roja Who Has Become A Dummy In Her Own Constituency :
ఎమ్మెల్యే అంటే.. నాలుగు నుంచి ఏడు దాకా మండలాలతో కలిసి ఉండే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధి. తన పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తన మాట చెల్లుబాటయ్యేలా చూసుకుంటే.. జనం మెచ్చిన నేతగా ఎదుగుతారు. తన పరిధిలోని అన్ని గ్రామాల సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ఆయా గ్రామాల్లో తన పార్టీకి, తనకు అండగా నిలిచేవారెవరన్న విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నేతలు ఎమ్మెల్యేలు అయితే.. వారికి ఇక తిరుగు ఉండదు. పార్టీ అధికారంలో ఉంటే.. అలాంటి నేతలకే మంత్రి పదవులు, పార్టీలో కీలక పదవులూ దక్కుతాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా? చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజాకు శనివారం తన సొంత నియోజకవర్గంలోని ఓ మండల కేంద్రంలో ఎదురైన పరిస్థితి చూస్తే.. ఇదంతా ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్న రోజా మాటను ఆమె పార్టీకే చెందిన ఓ ఎంపీటీసీ అధికారుల ముందే ధిక్కరించారు. ధిక్కరణ అనే మాట కంటే.. ఎమ్మెల్యే రోజాపై ఆ ఎంపీటీసీ ఏకంగా తిరుగుబాటు చేశారంటే సరిపోతుందేమో.
వైసీపీ జెండా ఎగిరినా.. ఎంపీపీ ఎన్నిక వాయిదా
నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలుంటే.. వాటన్నింటిలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఈ 8 మంది ఎంపీటీసీలో ఎమ్మెల్యే రోజా వర్గానికి చెందిన వారు ముగ్గురే అయితే.. ఆమె వైరివర్గం రెడ్డివారి చక్రపాణిరెడ్డి వర్గానికి చెందిన వారు ఐదుగురున్నారట. దీంతో ఎంపీపీ అభ్యర్థి ఎన్నికకు సంబంధించి సస్పెన్స్ నెలకొంది. దీప అనే ఎంపీటీసీని రోజా ప్రతిపాదిస్తే.. భాస్కరరెడ్డిని చక్రపాణి రెడ్డి వర్గం ప్రతిపాదించింది. ఈ క్రమంలో దీప, మరో ఇద్దరు ఎంపీటీలతో రోజా మండల పరిషత్ కార్యాలయానికి వస్తే.. భాస్కర రెడ్డి మరో నలుగురు ఎంపీటీసీలతో అక్కడికి చేరుకున్నారు. భాస్కరరెడ్డి నామినేషన్ ను ఎలా తీసుకుంటారని రోజా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో భాస్కరరెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నారని రోజా సంచలన ఆరోపణలు చేశారు . ఎమ్మెల్యే ప్రతిపాదించే ఎంపీటీసీని ఎంపీపీగా అంగీకరించే ప్రసక్తే లేదని, అవసరమైతే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడేది లేదని కూడా భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే అందుకున్న రోజా.. తక్షణమే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. మొత్తంగా అక్కడ రచ్చరచ్చ చోటుచేసుకుంది. అయినా ఇటు రోజా తగ్గలేదు. అటు భాస్కరరెడ్డి కూడా తగ్గలేదు.
మంత్రి పదవి ఎలా ఇచ్చేది?
జగన్ ను ఎవరు ఏమన్నా క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయే రోజా.. వైసీపీలో నిజంగానే ఫైర్ బ్రాండ్ నేతగానే చెప్పాలి. అందులోనూ జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేత కూడా. ఈ మాదిరి లెక్కలేసుకున్న రోజా.. జగన్ కేబినెట్ లో తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని, ఏకంగా హోం మినిస్ట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ రోజా కలలు కన్నారు. అవే విషయాలను ఆమె తన అనుచరుల ద్వారా మీడియాకూ లీకయ్యేలా ప్లాన్ చేశారు. అయితే జగన్ కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో అలిగి కూర్చున్నారు. ఆ తర్వాత ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవితో కాస్తంత శాంతించినా.. ఇటీవలే ఆ పదవి నుంచి కూడా రోజాను తప్పించారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తున్నందుననే ఏపీఐఐసీ పదవి నుంచి తప్పించారన్న భావనలో రోజా ఉన్నారు. అయితే తన నియోజకవర్గాన్నే చక్కబెట్టుకోలేకపోతున్న రోజాకు మంత్రి పదవి ఎలా దక్కుతుందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ ఢిల్లీ టూర్ రద్దుకు రీజనేంటి?











