ఓ ఆంధ్రుడా.. ఎవరు మన ఆంధ్రప్రదేశ్ ఇంతటి దీనస్థితికి కారకులు అంటే.. తెల్లమొహం వేస్తాడేమో.. లేదా తనకిష్టమైన పార్టీని వెనకేసుకొస్తూ.. మిగిలిన పార్టీలపై తిట్ల దండకం మొదలుపెడతాడు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల్లో అంతర్గత వ్యూహాలు ఎక్కువైపోయాయి. పైకి మాట్లాడే మాటలను బట్టి రాజకీయ పార్టీల వ్యూహాలను అంచనా వేయలేని స్థితి ఏర్పడింది. అధికార ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండాల్సింది పోయి.. ఆజన్మ శతృత్వం ఏర్పడింది. మనం మనం కొట్టుకుంటే.. పరాయివాడు తన్నుకుపోయినట్టు.. కేంద్రం.. ఈ శతృత్వాన్ని అలుసుగా తీసుకుని చెలరేగిపోతోంది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. ‘మేమంతా తెలుగువారం.. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి’ అని నినదించి, కలసి కట్టుగా పోరాడి మరీ ఆంధ్రదేశాన్ని సాధించుకున్న నాటి పౌరుషం.. నేడు ఎక్కడికి పోయింది! ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని నినదించిన నాటి సమైక్య భావన.. నేడు ఏమైపోయింది! ప్రజల్లో చేవ చచ్చిపోయిందా? పోరాట స్ఫూర్తి నశించిపోయిందా? లేదా.. యథా రాజా.. తథా ప్రజా.. అని అనుకోవాలా? పార్టీలు, నాయకుల్లోని అధికార దాహం, ప్రజల్లోని ఈ నిర్వీర్య నిస్తేజ భావనే.. కేంద్రానికి బాగా కలిసొచ్చింది. బ్రిటిష్ వారి నుంచి నేర్చుకున్న ‘విభజించి పాలించు’ సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంపై అమలు చేస్తోంది.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!

ప్రత్యేక హోదాతో మొదలైన నిర్లక్ష్యం..
2014 ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో పగ్గాలు అందుకున్న మోదీ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెప్పేందుకు తొలుత సందేహించారు. రకరకాల కారణాలు చెబుతూ దాటవేస్తూ వచ్చారు. ఎందుకంటే.. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో అన్న భయం. తన మిత్రపక్షం టీడీపీ.. ఎన్డీయేకు దూరమవుతుందేమోనన్న ఆందోళన. కానీ, రెండు మూడేళ్లలోనే ఆయనకు తత్వం బోధపడింది. ఇక్కడ రాజకీయ పార్టీలు కుమ్ములాటలతోనే కాలం గడిపేస్తాయని, ప్రజలకు తమ హక్కుల కోసం పోరాడే అంత ‘టైం’ లేదని తెలుసుకున్నారు. ఆ తర్వాతే ఆయన ప్రభుత్వం.. హోదా ఇవ్వలేం అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేసింది. అయినా.. జనం పట్టించుకోలేదు.
ఇక్కడి ప్రజలకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. అందుకే.. ఆ తర్వాత ఎన్నికల్లో.. టీడీపీని చిత్తుగా ఓడించి.. 11 తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఏ1 ముద్దాయి జగన్ కు పాలనా పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామం.. రాజకీయ చాణక్యులైన మోదీ, షా ద్వయానికి అందివచ్చిన అవకాశంలా మారింది. కేసులను బూచిగా చూపిస్తూ.. జగన్ ను తమ అదుపులో పెట్టుకున్నారు. సుసంపన్నమైన రాష్ట్రాన్ని.. సర్వనాశనం చేసేస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధానిని మొగ్గ దశలోనే తుంచేశారు. రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను తమ రాజకీయ క్రీడలో బలిపశువులను చేశారు. వారి కుటుంబాలను బజారుకీడ్చారు. గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలను పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయేలా చేశారు. కొత్త పరిశ్రమలను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను కూడా దివాలా తీయించి ప్రైవేటుకు అప్పగించే నెపంతో.. కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారు. అందుకు పెద్ద ఉదాహరణే.. విశాఖ ఉక్కు.
Also Read ;- విశాఖ ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతుల మద్దతు..
విశాఖ ఉక్కు.. కాదా ఆంధ్రుల హక్కు!
ఈ మధ్య విశాఖ వచ్చిన సందర్భంలో మన సీఎం గారు ఓ మాట చెప్పారు. ‘విశాఖ ఉక్కుపై కేంద్రానిదే హక్కు’ అని. అంటే.. ఇది ఆంధ్రుల హక్కు కాదని ఆయన ఉద్దేశమా? ఈ దిశగా జనం మనసు మార్చి.. ప్రైవేటుకు అప్పగించేసే ప్రక్రియలో కేంద్రానికి సహకరిస్తున్నారని భావించవచ్చా? అంటే.. ఔననే అనిపిస్తోంది. సుదీర్గ ఉద్యమంతో ఆంధ్రులు సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఈ రోజు ప్రైవేటు పరం పేరుతో కాజేసేందుకు తెరవెనుక భారీ కుట్ర జరుగుతోందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కుట్రలో సూత్రధారులు, అమలులో ప్రధాన పాత్రధారులు.. సీఎం జగన్, ఎంసీ విజయసాయిరెడ్డి అనేది విశ్లేషకుల అనుమానం. జరుగుతున్న పరిణామాలన్నీ అందుకు తగ్గట్లుగానే ఉంటున్నాయి.
ఏడాది క్రితమే.. కొరియా సంస్థ ‘పోస్కో’ ప్రతినిధులు.. విజయసాయి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారిని కలశారు. తొలుత బుకాయించినా.. ఆ తర్వాత జగనే స్వయంగా ఆ విషయాన్ని అంగీకరించడం తెలిసిందే. ఇప్పుడు ‘పోస్కో’ సంస్థకే విశాఖ ఉక్కును అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు పాతిక లక్షల కోట్ల విలువైన స్టీల్ ఫ్యాక్టరీని కేవలం 500 కోట్లకు ప్రైవేటు పరం చేసేస్తారంటున్నారు. మరీ ఇంత తక్కువకే అప్పగించేయడం వెనుక.. ఎన్ని వేల కోట్లు చేతులు మారాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read ;- విశాఖ ఉక్కుపై జగన్ది కుట్రే.. ఆధారాలతో వెల్లడించిన పట్టాభి

విజయసాయీ పాదయాత్ర అంట!
తాము పనిచేస్తున్నది ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనాలు చేకూర్చడానికే అని బల్లగుద్ది చెప్తున్నారు రాష్ట్ర అధికార గణం. దానికి తగ్గట్లుగానే పైకి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. లోలోపల తతంగమంతా నడిపించేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తతంగం అంతటినీ ఎంపీ విజయసాయిరెడ్డే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని కూడా అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తూ.. ఢిల్లీలో పొర్లుదండాలు పెట్టి మరీ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
విశాఖలో ముదురుతున్న ఉద్యమంతో ప్రతిపక్షాలు ఎక్కడ లబ్ది పొందుతాయోనన్న భావనతో.. తాము కూడా ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు నటిస్తున్నారు. త్వరలో జరగనున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తమపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే.. విజయసాయి పాదయాత్ర మొదలెట్టారు. నగరంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలనూ కవర్ చేసే విధంగా దీనికి రూట్ మ్యప్ రూపొందించారు. ఆయన చేసే పాదయాత్ర.. విశాఖ ఉక్కు కోసమా.. ఓటర్ల మెప్పు కోసమా అనేది దీన్ని బట్టే తెలిసిపోతోంది. విశాఖ ఉక్కు కోసమే అయితే.. తన మీదున్న కేసుల మాఫీ కోసం ఢిల్లీలో రోజూ ఆయన పెట్టే పొర్లుదండాలు.. ఈ ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, విశాఖ ఉక్కు రక్షణ కోసం పక్కన పెట్టొచ్చుగా! కానీ, ఆయన ఆ పని చేయరు. ఇక్కడి కొచ్చి పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకే యత్నిస్తారు. ప్రజల్లో దీనిపై అయోమయం సృష్టించేందుకే ప్రయత్నిస్తారు.
కొరవడిన సమైక్య భావన
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కచ్చితంగా ప్రజలదే బాధ్యత. ఇలాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఉన్నా.. ప్రజలు పాలకులపై తిరగబడేవారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించేవారు. అక్కడి రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసికట్టుగా పోరాడేవి. అందుకే కేంద్రం కూడా వేరే రాష్ట్రాల్లో జోక్యం చేసుకోదు. ఇక్కడి ప్రజలు కులాలు, ప్రాంతాల వారీగా విడిపోయారు. అందుకే నాయకులు కూడా వీరిపై ఆ అస్త్రాలనే ప్రయోగిస్తున్నారు.
అమరావతి విషయంలో రైతులపై కులం ముద్ర వేశారు. వారికి ఇతర ప్రాంతాల నుంచి మద్దతు రాకుండా చేయడంలో విజయవంతమయ్యారు. ఏడాదికి పైగా మన రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆ ఉద్యమానికి.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి స్పందన కరువైంది. అదే రాష్ట్రమంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించి ఉంటే.. ప్రభుత్వం ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టేదా! ఎక్కడో ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల కోసం ర్యాలీలు తీస్తున్న ఇక్కడి రైతులు.. మన అమరావతి రైతులకు మాత్రం సంఘీభావం ప్రకటించరు. ఎందుకంటే.. అది తమ ప్రాంతం కాదు కాబట్టి.
అలాగే.. విశాఖ ఉక్కు ఉద్యమం.. ఉత్తరాంధ్రకే పరిమితమైపోయింది. దాని కోసం మిగిలిన ప్రాంతాల ప్రజలు స్పందించరు. తమ మెడపైకి కత్తి వస్తే తప్ప స్పందించని ప్రజల వైఖరే.. ప్రభుత్వాల చేతికి బలమైన ఆయుధంలా మారింది. మనమిచ్చిన కత్తితో మన పీకే కోసేందుకు తెగబడుతున్నారు మన పాలకులు. ఇంత జరుగుతున్నా.. మనకెందుకులే అనుకుంటూ చేవ చచ్చి బతికేసే ప్రజలున్నంత వరకు పాలకులు మారరు. రాష్ట్రం బాగుపడదు.











