బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారం జరిగి.. ఇప్పటికి మూడు వారాలు గడుస్తున్నాయి. ఈ కిడ్నాప్ కథను నడిపించడం వెనుక అత్యంత కీలకమైన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. అయితే ఆయన తరఫున.. ముందస్తు బెయిల్ కోసం మాత్రం సికింద్రాబాదు కోర్టు వారి ఎదుట పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కూడా సెషన్స్ కోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి.. ఒకవైపు భార్గవరామ్ మీద తీవ్రమైన ఆరోపణలు ఉండగా.. ఆయనకు బెయిల్ మంజూరయ్యే విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
చిక్కడు దొరకడు..
హఫీజ్ పేట్ భూములపై అధికారం కోసం జరిగిన బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో ఇప్పటికీ సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. కిడ్నాప్ జరిగిన తర్వాత.. వెంటనే దానిని ఛేదించిన పోలీసులు.. అందుకు కారకురాలిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అప్పుడే అరెస్టు చేశారు. ఒకరోజు తర్వాత.. ఆమెను ఏ2 నుంచి ఏ1గా కూడా మార్చారు. భూమా అఖిలప్రియ అనుచరులే.. ఈ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు పక్కా ఆధారాాలు కూడా సేకరించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు కొత్త సెల్ ఫోన్లు, కొత్త సిమ్ కార్డులు తీసుకుని మరీ జాగ్రత్తగా కిడ్నాప్ చేశారు. అయితే.. ఆ సంగతులన్నీ ఛేదించిన పోలీసులు.. కిడ్నాప్ సమయంలో.. ఆయా నెంబర్లనుంచి కిడ్నాపర్లు భూమా అఖిలప్రియతో మాట్లాడినట్లు చాలా పక్కా ఆధారాలు రాబట్టారు.
ఈ అంశాలన్నీ.. ఆధారాల సహా అఖిలప్రియ ముందు ఉంచి పోలీసులు విచారించినప్పుడు ఆమె నిరుత్తరులయ్యారు. తర్వాతి దశలో అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి డ్రైవరును పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. కేసులో కొత్తగా అతని పేరు కూడా కలిసింది. అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పాత్ర చాలా కీలకంగా ఉదనికూడా పోలీసులు గుర్తిచారు. కానీ అప్పటికే భార్గవరామ్ పరారీలో ఉన్నాడు. ఆయన బెంగుళూరు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు.. ఆయన కోసం బెంగుళూరు వెళ్లాయి. అక్కడినుంచి కూడా భార్గవరామ్ మైసూరు పారిపోయినట్లు గుర్తించారు. మధ్యలో ఒక సందర్భంలో భార్గవరామ్ పోలీసులకు చిక్కినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదు. పోలీసుల అన్వేషణ సాగుతూనే ఉన్నది గానీ.. భార్గవరామ్ మాత్రం పట్టుబడలేదు.
ఈలోగా ఇటు అఖిలప్రియ చంచల్ గూడ జైల్లో ఉంటూ బెయిల్ కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్యం సవ్యంగా లేదని, అసలే గర్భంతో ఉన్నదని, అనేక కారణాల మీద ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగాయి. నాలుగైదుసార్లు ప్రయత్నించిన తర్వాత.. చివరకు అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది.
అఖిలప్రియతో సమానంగా, ఈ కిడ్నాప్ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన భార్గవరామ్ను మాత్రం పోలీసులు ఇప్పటిదాకా అరెస్టు చేయలేకపోయారు. ఆయన మాత్రం సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఇదివరకు ఒకసారి బెయిల్ పిటిషన్ వేస్తే.. కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు సెషన్స్ కోర్టులో మళ్లీ బెయిల్ కోసం అప్లయి చేశారు. ఇదే కేసులో ఆయన తల్లిదండ్రులు కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది.
భార్గవరామ్ విషయంలో మాత్రం చిక్కడు.. దొరకడు.. బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు.. అని జనం వ్యాఖ్యానిస్తున్నారు.
Must Read ;- అఖిల ప్రియ ఏమి చెబుతారు.. అందులో ఎవరెవరున్నారు..?











