(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటే.. నగరంలో వైఎస్ఆర్ సీపీ నేతలు గ్రూపులు వారీగా విడిపోయి రచ్చకెక్కుతూ పార్టీ పరువు రోడ్డుకు ఈడుస్తున్నారు.
రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో అధికార పార్టీ నాయకుల్లో విభేదాలు ఎలా ఉన్నప్పటికీ.. విశాఖలో కొంత క్రమశిక్షణ మేరకు నడుచుకునేవారని చెప్పవచ్చు. అందుకు జగన్ మీద ఉన్న భయమో.. మరి ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు గానీ… ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన వాళ్ళను తప్పించి కొత్తవారికి, అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి అందలం ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ విభేదాలు తార స్థాయికి చేర లేదు.
గతంలో సమన్వయకర్తలుగా ఏళ్ల తరబడి పార్టీ కోసం .. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారిని పక్కన పెట్టి, కొత్త వారికి టికెట్లు మంజూరు చేసినప్పుడు కూడా భారీ స్థాయిలో కొట్లాటలకు దారి తీయలేదు. కానీ ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి.
తూర్పులో తలనొప్పిగా..
నియోజకవర్గం పరిధిలో పార్టీ ఆవిర్భావం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వచ్చిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గం టికెట్ కేటాయించాల్సి వచ్చింది. దీంతో అక్కడ సమన్వయకర్తగా పనిచేస్తున్న ఏ.విజయనిర్మలకు తూర్పు నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. దీంతో వంశీకృష్ణ అనుచరులు వీరంగం సృష్టించారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థిని పక్కనపెట్టి నియోజకవర్గం తో సంబంధం లేని వ్యక్తికి ఎలా సీటు ఇస్తారు? అంటూ అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగు బావుటా ఎగురవేశారు. దీంతో ఆయనకు నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించి అసంతృప్తి వాదులను బుజ్జగించారు. అప్పటి నుంచి విజయనిర్మల ఒకవైపు వంశీకృష్ణ మరోవైపు రెండు వర్గాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆదిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు.
Must Read: భూముల స్వాహాకు పథకం.. ఆక్రమణలు, బదలాయింపులంటూ చర్యలు
పశ్చిమంలో పచ్చిగా…
ఈ నియోజకవర్గంలో నేతలు పచ్చి బూతులతో మరీ దిగజారి పోతున్నారు. అమ్మనా బూతులు తిట్టుకుంటూ పార్టీ ప్రతిష్టను మంటగలిపేస్తున్నారు. జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు ఇవే గ్రూపు లైన 58 వ వార్డు వైసిపి కార్పొరేషన్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, 61 వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి సురేష్ మల్కాపురం ప్రాంతంలో నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. బూతులు తిట్టుకున్నారు.
దక్షిణంలో దారుణం..
ఇక్కడ నాలుగు వర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. పార్టీ ఆరంభం నుంచి సమన్వయకర్త గా పనిచేసిన కోలా గురువులు ను కాదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. ఆయన ఓటమిపాలైన, నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్లో కొనసాగించారు. శ్రీనివాస్ మరణం తరువాత ఆయన కుమారుడు శ్రీవాత్సవ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ పరోక్షంగా పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఆయన కుమారులు కూడా వైఎస్సార్సీపీలో చేరడంతో శ్రీవాత్సవ కు మైలేజీ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు ఎమ్మెల్యే వాసుపల్లి.
వీరితో పాటు సాయిరెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే జాన్ వెస్లీ కూడా వేరు కుంపటి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే. 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం లోని ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ను కాదని అనకాపల్లికి చెందిన దాడి రత్నాకర్ కు టికెట్ ఖరారు చేశారు. అప్పుడు కూడా ఆయన అనుచరు లు ఆందోళనకు దిగలేదు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇలా పొరుగు ప్రాంతాల నుంచి… ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చి టిక్కెట్లు ఖరారు చేసిన వారంతా ఓటమి పాలైన పార్టీ పాఠాలు నేర్చుకోలేదు. 2019 ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగించారు.
రెడ్డి గారితోనూ తల నొప్పులు ..
విశాఖలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి కి వ్యతిరేకంగా డిఆర్సి మీటింగ్ లో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్ , కరణం ధర్మశ్రీ మాట్లాడడాన్ని జగన్ సీరియస్గానే తీసుకున్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి పదేపదే అధికారుల అందరి సమక్షంలో సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు, ఈ మేరకు జగన్ క్లాస్ పీకినట్టు ప్రచారంలో ఉంది. పార్టీని క్రమశిక్షణలో నడిపించాల్సిన నాయకుడే ఇలా ప్రవర్తించడం జగన్ కు తలనొప్పిగా మారింది.
చోటా నాయకుల దందా..
వీటన్నింటికీ తోడు వైఎస్ఆర్సిపి చోటా నాయకులు దందాలు నాయకత్వానికి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. మన్యంలో గిరిజనుల పోడు భూముల పట్టాల పంపిణీ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ నేతలు అమాయక గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్ళింది. మండల స్థాయి నాయకులు రూ 1500 నుంచి 3 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నీ జగన్ లో అసహనానికి కారణంగా మారుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారాలను ఎప్పటి కల్లా చెక్కదిద్దుతుందో పార్టీ అధిష్టానం వేచిచూడాలి.
Also Read: వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు











