దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తమ్ముడు, ప్రస్తుత సీఎం జగన్కి బాబాయి, మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ కదలిక వచ్చింది. తాజాగా మరోసారి సీబీఐ బృందం కడపకు వచ్చింది. సోమ, మంగళవారాల్లో కీలక వ్యక్తులను విచారించనుందని తెలుస్తోంది. గతంలోనూ విచారణ కోసం సీబీఐ అధికారులు కడపకు వచ్చినా…కొన్ని సార్లు వారికి స్థానికంగా సహకారం అందలేదనే విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు జరుగుతున్న విచారణలో సీబీఐ ఏదైనా ఆధారాలు సంపాదించగలుగుతుందా లేదా అనేది చూడాలి. మరోవైపు కొన్నాళ్లపాటు సైలెంట్గా ఉన్న సీబీఐ ఇప్పుడు మళ్లీ కడపకు రావడం కాకతాళీయంగా జరిగిందా లేక వివేకా కుమార్తె డా.సునీత ఇటీవల సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడిన ఫలితమా అనే చర్చ నడుస్తోంది. ఇక ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే..రాజకీయంగా కూడా ప్రాధాన్య అంశంగా మారింది.
తన ఇంట్లోనే హత్య..
ఏపీలోఅసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు మందు.. 2019 మార్చి15న వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా వైసీపీ నాయకులు ప్రకటించారు. అయితే వివేకా ఒంటిపై గాయాలుండడంతో పలు అనుమానాలు తలెత్తాయి. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై విమర్శలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధినేత జగన్ అప్పట్లో సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. ఈ హత్యకు టీడీపీ నేత కారణమని ఆరోపణ చేశారు. ఈ హత్య ఘటన రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపింది. ఇక వివేకా కుమార్తె కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్ లోని అధికారులను బదిలీ చేసింది. కొత్త టీంను నియమించింది. అదే సమయంలో హైకోర్టులో సీబీఐ విచారణకు వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారని విమర్శలూ వచ్చాయి.
Also Read ;- విజయమ్మ లేఖ.. పవన్కి సమాధానం
వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించడంతో..
అయితే వివేకా కుమార్తె మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా హైకోర్టుకు విన్నవించిన నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పటిస్తూ హైకోర్టు ఆదేశాలచ్చింది. కాగా సీబీఐ విచారణ విషయంలో జగన్ వెనక్కి తగ్గడంతో రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. తరువాత ఈ కేసులో సీబీఐ ఎంటరైంది. అయితే పులివెందులలో సీబీఐకి ఈ ఫైలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో మరోసారి హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న శ్రీనివాస్రెడ్డి 2019 సెప్టెంబరులో ఆత్మహత్య (అనుమానాలున్నాయి) కేసుకుని చనిపోయాడు. ఈ విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.
1300 మంది అనుమానితులు, సాక్షులను విచారించినా..
2020 సెప్టెంబరులో రెండో విడత విచారణ మొదలైనా కేసులో పురోగతి కనిపించలేదు. ఈ కేసులో దాదాపు 1300 మంది అనుమానితులు, సాక్షులను విచారించినా.. కచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేదు. సిస్టర్ అభయ హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా చేసిన సామాజిక కార్యకర్త జోమున్ ను ఇక గత జనవరిలో సునీత కలిసి తన తండ్రి హత్య కేసును వివరించారు. ఇటీవలే ధిల్లీలో సీబీఐ అధికారులను కలిసిన అనంతరం సునీత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో నిజనిజాలు తేల్చే విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. తనకే పరోక్షంగా బెదిరింపులు వస్తున్నాయన్నారు. ప్రెస్ మీట్లోనే పలు అంశాలను వెల్లడించారు డా.సునీత.
జగన్ ప్రభుత్వంపై విమర్శలు
ఈ క్రమంలో రాజకీయపార్టీలు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టాయి. దీంతో వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ(సంతకం లేకుండానే) కూడా రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసు విషయంలో నిజనిజాలు తేల్చాలని తమ కుటుంబం కూడా కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ పరిణామాల తరువాత మళ్లీ సీబీఐ టీం కడపలో అడుగుపెట్టింది. మరి ఆధారాలు సంపాదిస్తుందా, కేసులో పురోగతి ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.
Must Read ;- వివేకా హత్యపై అన్నీ సమాధానాలున్న ప్రశ్నలే..!











