అక్రమంగా తరలిస్తూ మిజోరాం సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాల వివాదంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడ దొరికింది తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలేనన్న ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలూ విమర్శలు చేశాయి. ఈ వివాదంపై టీటీడీ కూడా స్పందించింది. ఆ తలనీలాలతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ వివరణ ఇవ్వడంతో పాటు తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకూ ఫిర్యాదు చేసింది.
3,240 కిలోల తలనీలాల పట్టివేత
మయన్మార్, మిజోరాం మధ్య ఫ్రీమూవ్మెంట్ ఏరియా పరిధిలో.. మార్చి 7 మిజోరాంలోని చుంగ్డే చెక్ పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్ సరిహద్దు భద్రతా విభాగం సాధారణ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే 3,240 కిలోల తలనీలాలను రవాణా చేస్తున్న వైనం బయటపడింది. దీంతో అస్సాం రైఫిల్స్ ఆ తలనీలాలను (120 సంచులు) సీజ్ చేసి కస్టమ్స్ విభాగానికి సమాచారం అందించింది. ఎలాంటి అనుమతుల్లేవని కస్టమ్స్ తనిఖీల్లోనూ తేలడంతో రవాణా దారులపై కేసు నమోదైంది. కాగా వీటి విలువ ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ విలువ ఎంత అనే అంశంపై పలు రకాల వాదనాలూ ఉన్నాయి. రూ.18 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
టీటీడీపై ఆరోపణలు..
ఈ అక్రమ రవాణా వ్యవహారంపై ప్రతిపక్షాలు టీటీడీపై ఆరోపణలు చేశాయి. తిరుమలకు సంబంధించిన తలనీలాలేనని ఆరోపించాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై ప్రచారం జరిగింది. తెలుగుదేశం నేత అయ్యనపాత్రుడు, వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు మాట్లాడుతూ ఇది వైసీపీ ప్రభుత్వ వైఫల్యమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని అంశాల్లోనూ జగన్ సర్కారు అవినీతికి పాల్పడుతోందని, ఇప్పటివరకు ఎర్రచందనానకే పరిమితమైన అక్రమ రవాణాను తలనీలాలకూ విస్తరించిందని, పూర్తిగా టీటీడీ, వైసీపీ సర్కారు వైఫల్యమేనన్న ఆరోపణలు వచ్చాయి.
టీటీడీ వివరణ..
ఈ ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఈ తలనీలాల వ్యవహారంలో టీటీడీకి సంబంధం లేదని టీటీడీ అదనపు కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి మూడునెలలకోసారి ఈ టెండరు ద్వారా తలనీలాలను విక్రయిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని వ్యాఖ్యానించారు. మిజోరాంలో పట్టుబడిన తలనీలాలకు సంబంధించిన ఇష్యూలో టీటీడీ పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారన్నారు. దేశంలోని పలు ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతాయని, అయినప్పటికీ అసలు ఆ తలనీలాల అంశంపై కస్టమ్స్ కూడా ఎవరి పేరునూ ప్రస్తావించలేదన్నారు. అక్కడ దొరికినవి అన్ ప్రాసెస్డ్ తలనీలాలేనని, టీటీడీ నుంచి కేవలం ప్రాసెస్డ్ తలనీలాలే బయటకు వెళ్తాయని వ్యాఖ్యానించారు. దురుద్దేశంతోనే టీటీడీపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానిచండంతోపాటు సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కొందరిపై తిరుపతి ఈస్ట్ జోన్ పోలీసులకూ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
మరోవైపు ఈ అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తలనీలాలను రవాణా చేస్తున్న వారు ఎవరు.. టీటీడీ ఈ టెండరులో సదరు సంస్థలు లేదా వ్యక్తులు ఎప్పుడైనా పాల్గొన్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ అంశంపైనా టీటీడీ వివరణ ఇచ్చింది. తలనీలాల అక్రమరవాణా వ్యవహారంలో పట్టుబడిన వ్యక్తులను, సంస్థలను రానున్న కాలంలో బ్లాక్ లిస్టులో పెడతామని ప్రకటించింది.
Must Read ;- అప్పులు చేయడంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్.. ఎంపీ రఘురామకృష్ణంరాజు