ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది,ఎలా పుట్టందనే అంశంపై ఇప్పటికే పలు వాదనలున్నాయి. గబ్బిలాల నుంచి,అపరిశుభ్రంగా ఉన్న మాంసాహారం నుంచి పుట్టిందని,సహజసిద్ధంగా వైరస్ పుట్టిందని ఓవైపు చర్చ నడుస్తుండగా చైనా ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీకైందనే చర్చకూడా ఉంది.ఈ తరుణంలో వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.ఈ కథనం ప్రకారం వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)నుంచి పుట్టిందని,ఆ ల్యాబ్లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్లో అస్వస్థతకు గురయ్యారని, చికిత్స కోసం ప్రభుత్వానికి విన్నవించారని ప్రచురించింది.ఈ అంశంతోపాటు ఆ ల్యాబ్లో పనిచేస్తూ అనారోగ్యానికి గురైన వారికి సంబంధించి ఓ నిఘా రిపోర్టుకు సంబంధించిన అంశాలను కూడా ఆ పత్రిక ప్రచురించింది.కాగా కరోనా పుట్టుక,వ్యాప్తి,మూలాలకు సంబంధించి జాయింట్ కమిషన్,ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశానికి ముందురోజు ఈ రిపోర్టు వెల్లడి కావడం సంచలనం రేపింది.
వుహాన్ వైరస్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు
కాగా కరోనా వైరస్కు సంబంధించి గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు.కరోనా వైరస్ను ట్రంప్ చైనా వైరస్,వుహాన్ వైరస్గా పిలిచారు.దీంతో చైనా అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వైరస్ మూలాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్యసంస్థ పరిశోధన చేసింది.అయితే చైనా సహకరించలేదనే ఆరోపణలూ వచ్చాయి.కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్లో పుట్టిందనేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించడంతో పలు విమర్శలు తలెత్తాయి.ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధి నుంచి తప్పుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాఆ నిర్ణయం అమలయ్యే సమయానికి అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక కావడంతో అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొనసాగేందుకు నిర్ణయించింది.అయితే కరోనా వైరస్ విషయంలో బైడెన్ ప్రభుత్వం కూడా పలు అనుమానాలను వ్యక్తం చేసింది.తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఇంటిలిజెన్స్ నివేదికపై ఇంకా వైట్ హౌస్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా కరోనా వైరస్ మూలాల దర్యాప్తుపై బైడెన్ ప్రభుత్వం సీరియస్గా ఉందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఎమిలీ హార్న్ వ్యాఖ్యానించారు.కొవిడ్-19 మూలాలపై జరుగుతున్న దర్యాప్తులో రాజకీయాలకు తావివ్వకూడదని,డబ్ల్యూహెచ్ఓ,ఇతర దేశాల నిపుణులతో కలిసి అమెరికా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.
ముగ్గురు పరిశోధకులకు అస్వస్థత
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో మరో అంశం కూడా చర్చకు కారణమైంది.ల్యాబ్లో ముగ్గురు పరిశోధకులు అస్వస్థతకు గురికావడంతోపాటు దీనిపై పక్కా ఆధారాలు కోసం లోతైన దర్యాప్తు,అధ్యయనం అవసరమని ఓ అధికారి చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.కాగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం స్పందించేందుకు నిరాకరించింది.గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలను గుర్తు చేసింది.కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందనేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా అమెరికా ఇప్పటికీ వివాదం కొనసాగిస్తోందని వ్యాఖ్యానించింది.కాగా దీనిపై మరింత దర్యాప్తు అవసరమని స్వీడన్,కెనడా,ఫ్రాన్స్ తదితర దేశాలు డిమాండ్ చేశాయి. ఇక గతంలోనూ ఆస్ట్రేలియా సైస్స్ మేగజైన్ ఓ కథనాన్ని ప్రచురిచింది.కరోనాతో జీవాయుధాల తయారీపై చైనాలో 2015లోనే చర్చ జరిగిందని ఓ కథనం ప్రచురించింది.వీరితోపాటు కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రొఫెసర్,భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రవీంద్ర గుప్తా,ప్రముఖ సైన్స్ రచయిత నికొలస్ వెడ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. గబ్బిలాల్లోని కరోనా వైరస్ను జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో మానవ కణజాలాల్లకి ప్రవేశపెట్టడంపై పరిశోధనలు జరుగుతున్ననేపథ్యంలో వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు రాలేదని ఎందుకు అనుకోవాలనే సందేహాన్ని నికొలస్ వ్యక్తం చేశారు.మరోవైపు ఈ అనుమానాలపై లోతైన దర్యాప్తు,అధ్యయనం జరగాలని పరిశోధకులు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు.
Must Read ;- కరోనాకు తోడు మరిన్ని.. యూపీలో ఎల్లో ఫంగస్ కేసు











