ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారా? సజ్జల నుంచి ఫోన్ కాల్ రాగానే.. ప్రెస్ మీట్లో ఉన్నా కూడా ఉద్యోగ సంఘాల నేతలు వణికిపోయారా? సజ్జల నుంచి జారీ అయిన బెదిరింపులతో ఉద్యోగ సంఘాల నేతల చొక్కలు చెమటలతో తడిసిముద్దయ్యాయా? సరైన సమయానికి వేతనాలు ఇవ్వలేని జగన్ సర్కారుపై నిరసన గళం వినిపించేందుకు మీడియా ముందుకు వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు.. సజ్జల బెదిరింపులతో వెనక్కు తగ్గారా?.. ఇలా ఒకేసారి లెక్కలేనన్ని ప్రశ్నలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇవేవో వైసీపీ సర్కారు అంటే గిట్టని వారు చేస్తున్న విమర్శలు కాదు. సంధిస్తున్న ప్రశ్నలు అంతకంటే కూడా కాదు. స్వయంగా ఉద్యోగ సంఘాల నేతల నోట నుంచి వచ్చిన మాటలు విన్న వారెవరికైనా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉమ్మడిగా మీడియా ముందుకు రావడం, తాజాగా వారిద్దరూ మళ్లీ శనివారం నాడు మీడియా ముందుకు రావడం.. ఈ రెండు సందర్భాల్లో వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు వింటూ ఉంటే.. పైన మనం చెప్పుకున్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి.
బండి శ్రీనివాస్ ఏమంటారంటే..?
మూడు రోజుల క్రితం బండి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్న ఏపీజేఏసీ, బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్న ఏపీజేఏసీ అమరావతి సంఘాలు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఇకపై రెండు సంఘాలు కూడాకలిసికట్టుగానే పనిచేస్తాయని, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేస్తామన్న విషయాన్ని చెప్పేందుకే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ సమాచారం సజ్జలకు ఎలా తెలిసిందో గానీ.. బండి, బొప్పరాజుల్లో ఒకరికి ఫోన్ చేశారట. దాంతో వారిద్దరూ మాట మార్చేసి అప్పటికి మీడియా సమావేశం ముగిసినట్టుగా చెప్పుకుని వెళ్లిపోయారు. దీనిపై విమర్శలు రేకెత్తడంతో తాజాగా శనివారం నాడు వారిద్దరూ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా బండి ఏమంటారంటే.. ‘‘రెండు JAC లు కలిసి పోయాయని చెప్పడానికే మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాము. మేము ప్రెస్ మీట్ లో ఉండగా సజ్జల ఫోన్ చేసిన మాట వాస్తవం. మమ్మల్ని కంట్రోల్ లో ఉండమని చెప్పడం అవాస్తవం. మాకు శుభాకాంక్షలు తెలియ జేయడానికే సజ్జల ఆ రోజు ఫోన్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా మేము ప్రెస్ మీట్ పెట్టలేదు అని సజ్జలకు చెప్పాము. ఫ్యాన్ లు తీయడం వల్ల నాడు చెమటలు పట్టాయి. ప్రభుత్వ పెద్దలకు భయపడి కాదు. ఏ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండం. ఇప్పటికి జీతాలు రాని వారు ఉన్నారు. 10 తేదీ అయ్యింది.. సమాధానం చెప్పే వారు లేరు. మంత్రి బుగ్గన, రావత్ తో సహా ఒక్కరు సచివాలయం లో కనిపించడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇప్పటికి అందడం లేదు. మంత్రుల ఇళ్లలో కుక్కలకు వేసే బిస్కట్ల కు కూడా ఉద్యోగుల జీతాల నుంచే బడ్జెట్’’ అని బండి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
మరి బొప్పరాజు మాటేమిటంటే?
మూడు రోజుల నాటి ప్రెస్ మీట్పై అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన తాజా మీడియా సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా తనదైన శైలి వాదన వినిపించారు. ఈ సందర్భంగా బొప్పరాజు ఏమంటారంటే.. ‘‘మా సమస్యలపై స్పందించేది సజ్జల ఒక్కరే. మమ్మల్ని సజ్జల బెదిరించలేదు. మేమిద్దరం ఒకే వేదిక మీదకు వచ్చే సరికి సజ్జల ఫోన్ చేశారు. మేము ఉద్యోగులం. ప్రభుత్వానికి లోబడి ఉంటాము. ఉద్యోగుల సమస్యలపై రాజీ పడే అవకాశమే లేదు. ఆర్థికేతర సమస్యల పై సీఎం స్పందించాలి. CPS రద్దు చేస్తారని సీఎం పై నమ్మకం ఉంది. 11 వ PRC దసరా నాటికి ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం సహకరిస్తుంది. అధికారులు సీఎం మాటను అమలు చెయ్యడం లేదు. ఆర్ధిక మంత్రి మాకు దొరకడం లేదు. ఏమి చెయ్యాలో తెలియడం లేదు’’ అని బొప్పరాజు కూడా సేమ్ టూ సేమ్ బండి వాదననే వినిపించారు. వీరిద్దరి మాటలు వినేంత దాకా సామాన్య జనానికి సజ్జల నుంచి వారికి బెదిరింపులు వచ్చాయనే మాటే తెలియదు. అయితే సజ్జల బెదిరించారంటూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు రేకెత్తడంతో బొప్పరాజు, బండి ఇద్దరూ మరోమారు మీడియా ముందుకు వచ్చి తమను సజ్జల బెదిరించనే లేదు, మాకు చెమటలు పట్టిన మాట వాస్తవమే గానీ.. అది సజ్జల బెదిరింపుల వల్ల కాదు అంటూ వివరణలు ఇచ్చాక.. వారిద్దరికీ సజ్జల నుంచి బెదిరింపులు నిజంగానే వచ్చి ఉంటాయని సామాన్య జనం కూడా భావిస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.
Must Read ;- లోకేశ్ ఎంట్రీ.. సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్