ఏనుగు కుంభస్థలాన్ని ఢీకొట్టాలంటే ఏనుగుల గుంపులోనే చేరితినే బెటరని ఈటల రాజేందర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ గడ్డ మీద ఎదురొడ్డి నిలబడాలన్నా..తొడ గొట్టాలన్నాకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు కావాల్సిందేనని రాజేంద్రుడు భావిస్తున్నట్లున్నారు.కాంగ్రెస్,కోదండరామ్, రేవంత్రెడ్డి వంటివాళ్లను నమ్ముకున్నా..నైతిక బలమే దక్కుతుంది తప్ప…కేసీఆర్ వ్యూహాలను,అధికార బలాన్ని తట్టుకోలేమని ఈటల ఆలోచిస్తున్నట్లున్నారు.కేసీఆర్ భయపడేది ఒక్క బీజేపీకే అన్నసత్యం కూడా తెలిసినవాడు ఈటల రాజేందర్.. ఆ భయం కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతవరకే.. ఆ తర్వాత వాళ్ల మీద కూడా పంచ్ లు విసరడానికి కేసీఆర్ రెడీగా ఉంటాడన్నది… ఆయన గురించి తెలిసిన వారందరీకీ…ఇన్నాళ్లు ఆయనతో జర్నీ చేసిన ఈటల రాజేందర్కి తెలియని విషయం కాదు.
ఎవరెంత భరోసా ఇచ్చినా..
అందుకే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని చెప్పుకుంటున్నారు.ఎవరెంత ఓదార్చినా…ఎవరెంత భరోసా ఇచ్చినా…బీజేపీ మద్దతే ఈటలకు నమ్మకాన్ని కలిగించినట్లున్నది.ఇప్పుడు ఈటల బీజేపీలో చేరి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే…ఈ మధ్యే అలాలేచి ఇలా పడిపోయిన కమలనాథుల గ్రాఫ్ మళ్లీ లేచే ఛాన్స్ ఉంది.హుజూరాబాద్లో దక్కబోయే విజయంతో మరో ఆరు నెలలు గడిపేయొచ్చు అని కమలనాథులు ప్లాన్ చేసుకుంటున్నారు.
బీజేపీ రంగంలోకి దిగితే..
కేసులు,దాడుల భయంతో ముందు వెనకా ఆలోచిస్తున్న ఈటల ఫ్రెండ్స్ కూడా బీజేపీ రంగంలోకి దిగితే ధైర్యంగా నిలబడే ఛాన్సుంది.అప్పుడు హూజూరాబాద్లో గెలుపు ఈటలకు పెద్ద లెక్క కాదు. పైగా బండి సంజయ్,ధర్మపురి అరవింద్ల దెబ్బకు మున్నూరు కాపులను చేరదీస్తున్న బీజేపీ,ఇప్పుడు ఈటల దెబ్బకు ముదిరాజ్లను కూడా తమ అమ్ములపొదిలో చేర్చుకుంటుంది.అప్పుడు దొరలు,రెడ్లు కాకుండా మిగిలిన కులాలన్నీ బీజేపీ వైపు ఆకర్షించడానికి ప్లాన్ వేస్తే బాగానే వర్కవుట్ అవుతుంది.
Must Read ;- ఈటల రూటు ఎటో.. మారిన ప్రొఫైల్ దేనికి సంకేతం!
హరీష్రావు సీనులో ఉంటే..
కేసీఆర్ ఎలాంటి ఎదురు వ్యూహం వేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్.బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. ఈడ గల్లీలో కొట్లాట ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తారనేది కీలకం.అయితే ఈటలను ఓడించే బాధ్యత హరీష్ రావుకే అప్పచెబుతారని గులాబీ కోటలో గుసగుసలాడుతున్నారు.హరీష్ రావు సీనులో ఉంటే..కొందరు నేతలు ఈటలకు మద్దతివ్వకుండా వెనకాడతారని అనుకుంటున్నారు.
ఎటు కాకుండా పోతున్న కాంగ్రెస్
ఒకవైపు కేసీఆర్కు అన్ని విధాలా సహకరిస్తూనే…రాష్ట్రంలో రాజకీయంగా బలపడటానికి ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు బీజేపి.టీఆర్ఎస్ సైతం అదే పంథాలో పోతోంది.ఎటొచ్చీ ఎటు కాకుండా పోతోంది కాంగ్రెస్ మాత్రమే. బలం ఉండి బలహీనంగా కనపడుతున్నది కాంగ్రెస్.రేవంత్రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పచెప్పకుండా మీన మేషాలు లెక్కేస్తూ…ఏళ్ల తరబడి బండి లాగించేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.ఈపాటికి రేవంత్కి పగ్గాలు అప్పచెప్పి ఉంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఉండేవారు, కూన శ్రీశైలం గౌడ్ ఆగేవారు. ఇప్పుడు ఈటల కూడా ఇటే చూసేవారు.కాని ఆ ఒక్కటి చేయకుండా కాంగ్రెస్ ఇంకా ఉత్తమ్ శల్యసారథ్యంలోనే నడుస్తూ… అంతకంతకు అవకాశాలను పోగొట్టుకుంటూ…బీజేపీకి తెలంగాణలో అవకాశాలను అందిస్తోంది. మరి ఈటల ఎపిసోడ్తో రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
Must Read ;- మరో కబ్జా ఉచ్చులో ఈటల ఫ్యామిలీ.. ఈ సారి ఆయన కుమారుడిపై