భూ ఆక్రమణల ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.రెండు మూడు రోజులుగా ఆయన బీజేపీలో చేరతారని ఓవైపు,సొంత పార్టీ వైపు అడుగులేస్తున్నారని మరోవైపు చర్చలు జరిగిన నేపథ్యంలో ఈటల రాజేందర్ ధిల్లీ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యాక ఈటల రాజేందర్ పలు పార్టీల నాయకులను,తటస్థ నాయకులను కలిశారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి,కోదండరాం తదితరులతోనూ భేటీ కాగా మరికొందరు నాయకులతో ఫోన్ లో టచ్లో ఉన్నారు.రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసిన ఈటల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.వీరితోపాటు భూపేందర్ జాదవ్,మరికొందరు నేతలు ఉన్నట్లు సమాచారం.ఈ భేటీ ముగిసిన మరుసటి రోజే ఈటల ధిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

టార్గెట్ కేసీఆర్..
కాగా ఏ పార్టీలో చేరినా,ఎవరితో కలిసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల రాజేందర్ టార్గెట్ ఒక్కటేనని తెలుస్తోంది.పలువురు నాయకులతో జరిగిన భేటీలో ఈటల మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.కేసీఆర్ అవినీతి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం,అమర వీరుల త్యాగాలు అంశాల ప్రాతిపదికతోనే చర్చలు జరిగాయి.బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ఎదుట కూడా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.వాస్తవానికి ఈటల రాజేందర్ ఆర్థికంగా,సామాజికంగా బలవంతుడని,ఏ పార్టీలో చేరినా ఆయన ఆర్థిక అంశాల పరంగా పెద్దగా ప్రాధాన్యం ఉండదనే చర్చ నడుస్తున్ననేపథ్యంలో కేసీఆర్ మాత్రమే టార్గెట్ అవుతారనే ప్రచారం నడుస్తోంది.
కేసీఆర్పై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు
ఈటల రాజేందర్ ఓవైపు ధిల్లీ పర్యటన ప్లాన్లో ఉండగా ఆయన సతీమణి,జమున హేచరీస్ డైరక్టర్ ఈటల జమున కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ఇష్టారాజ్యంగా తెలంగాణను పాలించాలనుకుంటున్నారని,కొన్ని చట్టవ్యతిరేక పనులకు ఈటల అడ్డుగా ఉన్నారన్న అభిప్రాయంతోపాటు ఒక్కడే ఏలాలనుకుంటున్నాడని,అందుకే ఈటలపై ఆరోపణలు చేయించి బయటకు పంపించారని ఆరోపించారు.కేసీఆర్తో పాటు నమస్తే తెలంగాణ పత్రికపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.తమకు చెందిన ఆరు ఎకరాల భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పత్రిక స్థాపనకు డబ్బు ఇస్తే అలాంటి పత్రికే నీచస్థితికి దిగజారి నెల రోజులుగా తమ కుటుంబానికి చెందిన జమున హేచరీస్,గోడౌన్లపై బురద జల్లుతోందని విమర్శించారు.దేవరాయాంజల్ భూములు అక్రమించుకున్నామంటూ రాస్తున్నందుకు నమస్తే తెలంగాణ పత్రిక సిగ్గు పడాలని,ఆ భూములను కుదువ పెట్టి తాము పత్రికకు సహాయం చేసిన విషయం మర్చిపోయారని,దేవుని భూములైతే బ్యాంకులు లోన్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు.నిస్సిగ్గుగా వార్తలు రాస్తున్నారని విమర్శించారు.ఈ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసునని,కష్టాన్ని నమ్ముకుని తాము పైకి వచ్చామని వ్యాఖ్యానించారు. మసాయిపేటలో తన కుమారుడు నితిన్ 46 ఎకరాల భూమి కొన్నది వాస్తవమని, అయితే అక్రమించుకున్నామని నమస్తే తెలంగాణ రాస్తున్న కథనం అవాస్తవమని వ్యాఖ్యానించారు.46 ఎకరాల కంటే ఎక్కువని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని,లేకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు.తమ్మి తమ్మి అంటూ కేసీఆర్ తడిబట్టతో గొంతు కోశారని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ధిల్లీ వెళ్లడానికి పార్టీలో చేరిక మాత్రమే కారణమా లేక ఇతరత్రా అంశాలేమైనా ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది.
Must Read ;- కేసీఆర్ భయపడేది బీజేపీకే.. అందుకే ఈటల అడుగులు అటు











