ఓం నమ: శివాయ సిధం నమః’ అంటూ అక్షరాభ్యాసం చేశాం… ఓనమాలు దిద్దుకున్నాం. తెల్లారిలేస్తే ఓంకారంతో మంత్రాలు జపిస్తున్నాం… ధ్యాన సాధన చేస్తున్నాం. అసలేమిటి ఈ ‘ఓం’. ఈ అనంతమైన సృష్టికీ, జ్ఞానానికీ ఆది ఓంకారమేనా? ఎలా? ఓంకారమే వేదం సర్వమ్ అంటోంది మన శాస్త్రం. ఆదిలో ఒక మాట ఉంది… అదే భగవంతుడు అంటోంది బైబిల్. ఓంకారాన్ని ఎరుగనివాడు బ్రహ్మను తెలుసుకోలేడు అంటుంది గీత. ధ్వనులలో నేను ఓంకారాన్ని అంటాడు గీతలో శ్రీకృష్ణుడు. ఓంకారం అనేది ఓ శబ్దరూపం. తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన జీవుడు బయటకు రాగానే వినిపించే ఏడుపు కూడా శబ్దమే… దానికి అర్థంలేదు. ఆ బిడ్డకు ఆ శక్తి రాగానే అమ్మ అనే ఓ అర్థవంతమైన పదాన్ని పలుకుతుంది. జీవుడు అనే సూక్ష్మసృష్టికే ఇంత శక్తి ఉన్నప్పుడు అనంతమైన ఈ సృష్టికి ఇంకెంత శక్తి ఉండాలి? జీవుడు, దేవుడు అనే పదాలు ఈ సృష్టికి సూక్ష్మ, స్థూల రూపాలే. ఈ రూపాల్లో అంతర్లీనంగా ఉన్న శబ్దమే ‘ఓం’. అందరూ అనుకునేట్లుగా ఇది పదం కాదు ఓ శబ్దం. ఆ శబ్దంలోనే అనంతమైన జ్ఞానభాండాగారముంది.
‘ఓంకారమే వేదం సర్వం’ అన్నారు కాబట్టే మనం అక్షరాభ్యాసాన్ని ఓంకారంతో ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. అక్షరం అంటే క్షరం కానిది. క్షరం అంటే నశించటం. అక్షరం అంటే నశించనిది అనే కదా అర్థం. వేదమంత్రాల్లోని అక్షరాలు శబ్దాలు మాత్రమే కావు అవి శక్తిబీజాలు. బీజాక్షరం అంటే మూల మంత్రం. ఆ మూల మంత్రమే ఓం. ‘క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే’ అని గీతలో శ్రీకృష్ణభగవానుడు ప్రవచించాడు. ఈ చరాచర జగత్తంతా క్షరమేనని, ఆత్మ మాత్రమే అక్షరమని దీని భావం. వేదాలను శ్రుతులు అన్నారు. శ్రుతం అంటే వినిపించటం. మన మహర్షులు తమ సాధనతో ఈ సృష్టిలోని ఓంకార నాదాన్ని విని ఆ జ్ఞానాన్ని నాలుగు వేదాలుగా మనకు అందించారు. ఈ వేదసారమంతా ఒక్క ‘ఓం’లోనే ఉంది. ఈ సృష్టికి ముందు బ్రహ్మదేవుని కంఠం నుంచి వెలువడిన శబ్దమే ఓంకారమంటోంది శాస్త్రం. అందుకే వేదాలను నేర్చుకునేటప్పుడు కూడా ముందుగా ఓంకారాన్నే ఉచ్చరిస్తారు. ఈ అనంతమైన సృష్టికి ఆదిమధ్యాంతాలు లేవు. ఓంకార నాదం నుంచే ఈ సకల చరాచర జగత్తు ఏర్పడిందని వేదాలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఓంకారమే ఈ సృష్టికి ఆదిగా భావించాలి.
విద్… వేదం… విద్య
విద్ అనే ధాతువు నుంచి ఏర్పడిన పదమే వేదం. విద్ అంటే జ్ఞానం. వేదం అన్నా, విద్య అన్నా జ్ఞానమే. ఆ జ్ఞానం ఆ పరబ్రహ్మే. అందుకే ఆయన ఆక్షరుడు. అంటే నశించనివాడు. అక్షరాభ్యాసం అంటే నశించని ఆ జ్ఞానాన్ని అభ్యసించడమే. అనంతమైన జ్ఞానానికీ ఆదిమధ్యాంతాలు లేవు. ఆ అనంతంలోకి పయనించాలంటే ఓ మూలమంటూ ఉండాలి. ఆ మూలమే ఓంకారనాదమైంది. సృష్టికర్త అయిన నారాయణుడిని తలచుకునేటప్పుడు ‘ఓం నారాయణాయ’ అంటుంటాం. శివపంచాక్షరీ మంత్రానికీ, గాయత్రీ మంత్రానికీ… మరే మంత్రానికైనా ఆదిలో ఓం ఉంటుంది. ఓం ఏకాక్షరం… అనేకాక్షరం. ఇందులోనే అద్వైతం, ద్వైతం, ఏకత్వం, భిన్నత్వం లాంటివి ఉన్నాయి. శాఖలు వేరైనా చెట్టు ఒక్కటేనన్న విషయం గుర్తుంచుకోవాలి. ఓం అనేది నాలుగు పాదాల అక్షరం. అంటే నాలుగు వేదాల్లో ఏం అర్థముందో ఓంకారంలోనూ అదే అర్థముంది. ఇది ‘అ,ఉ,మ’ కారాల సమ్మిళితం. ‘అ’కారానికి అధిదేవత బ్రహ్మ. ఇక్కడి నుంచే రుగ్వేదం ఆవిర్భవించింది. రెండోదైన ‘ఉ’కారానికి అధిదేవత విష్ణుమూర్తి. దీన్నుంచి యజుర్వేదం పుట్టింది. మూడోది ‘మ’కారం. దీనికి అధిదేవత శివుడు. ఇక్కడి నుంచి సామవేదం ఉద్భవించింది. ‘అ,ఉ,మ’లకు చివర అతిసూక్ష్మమైన అర్థమాత్ర కూడా ఉంది. ఇది నాద స్వరూపం. ఇదే పరమేశ్వర స్థానం. ఇక్కడి నుంచి అధర్వణ వేదం ఆవిర్భవించింది. ఇంతటి మహత్తరమైన ‘ఓం’ అనే తారక మంత్రాన్ని పట్టుకుంటే చాలు పరమపదానికి తీసుకువెళుతుంది. జాగృత, స్వప్న, సుషుప్తి, తురీయం అనే నాలుగు స్థితులూ ఓంకారానికి సంబంధించినవే. అక్షరం పరబ్రహ్మం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ప్రణస్సర్వవేదేషు… లాంటి మాటన్నీ ఓంకార వైశిష్ట్యాన్ని చాటుతున్నాయి. అందుకే మన అక్షరాభ్యాసం ఆ పరమాత్మను తెలుసుకునేలా ఉండాలి. అంటే మనకు కావలసింది బ్రహ్మవిద్య… అంటే బ్రహ్మజ్జానం అన్నమాట.
ఆది నుంచి అనంతానికి…
జననమరణాలనేవి ఒక చక్రం. పునరపి జననం పునరపి మరణం అన్నారందుకే. జీవి ఈ భూమ్మీదకు వస్తేనేగానీ అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోలేడు. ఈ అనంతతత్వాన్ని తెలుసుకోవటానికి సాధన చేయాలి. అలా చేయలేక మాయలో చిక్కుకుని వచ్చిన పని మర్చిపోతున్నాడు. అనంతమైన జ్ఞానం ఆ పరబ్రహ్మకే తెలుసు. ఆ జ్ఞానం తెలిసనవాడిని బ్రహ్మజ్ఞాని అంటారు. నిజమైన సాధకుల అంతరంగంలో ఓంకారం ప్రతిధ్వనిస్తుంటుంది. జ్ఞానం అనేక రకాలు. ఖగోళానికి సంబంధించిన జ్ఞానం ఖగోళ జ్ఞానం. సంగీతానికి సంబంధించిన జ్ఞానం సంగీత జ్ఞానం. కాలానికి సంబంధించిన జ్ఞానం కాలజ్ఞానం. ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఆత్మజ్ఞానం. దీన్నే బ్రహ్మజ్ఞానం అంటారు. సరిగమపదని అనే సప్తస్వరాల నుంచి సంగీతం పుట్టింది. మూలాధారం నుంచి సహస్రారం వరకూ ఉండే ఏడు చక్రాలను చైతన్యవంతం చేయడం ద్వారా బ్రహ్మజ్జానం పుట్టింది. సృష్టి, స్థితి, లయలకు కర్త, కర్మ, క్రియ ఆ పరబ్రహ్మే. ఆయన ఓంకారంలో మమేకమై ఉండటమే యోగం. అందుకే దీన్ని క్రియాయోగం అని కూడా అన్నారు. ఈ క్రియాయోగంతోనే సమస్త జ్ఞానాన్నీ మహర్షులు మనకందించారు. త్రికాలజ్ఞతను సాధించిన యోగులంటే వీరే. కాలానికి సంబంధించిన జ్ఞానంతోనే శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మనకు కాలజ్ఞానం బోధించారు. నిశ్చలమైన ధ్యానానికి ఓంకారం తప్ప మరే మంత్రమూ ఉపయోగపడదు. మరణ సమయంలో ఓంకారాన్ని ఉచ్చరించి దేహాన్ని విడిచేవారు ఆ బ్రహ్మనే పొందుతారని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.