కాబోయే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్కడ టీడీపీ నేతలకు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. శనివారం వచ్చిందంటే చాలు ఎదో ఒక టీడీపీ నేతకు చెందిన నిర్మాణం కూల్చివెయ్యడమో, ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడమో చేస్తూ స్థానిక అధికారులు సంచలనం సృష్టిస్తున్నారు.
తాజాగా ..
టీడీపీ నాయకుడు .. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడుగా పేరుగాంచిన కాశీ విశ్వనాధ్కి కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. కాశీ అసోసియేట్ అధినేత కాశీ విశ్వనాథ్కు చెందిన ‘గో కార్టింగ్’ను శనివారం ఉదయం జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. కాపులుప్పాడ సమీపంలోని మంగమారి పేట వద్ద ఉన్న గో కార్టింగ్ నిర్మాణంలో సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారుంటూ తొలగించారు. తీర ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను కాశీ అసోసియేట్స్ ఉల్లంఘించిందని అధికారులు తేల్చారు. అంతేకాకుండా కాశీ ఎస్టేట్స్ పేరిట అక్కడ సుమారు 150 గజాల ప్రభుత్వ స్థలాన్ని కూడా నిర్వాహకులు ఆక్రమించుకున్నారని అధికారులు చెప్తున్నారు. ఒక ఎకరా స్థలంలో కార్ల రేసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Must Read ;- టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!
స్థానికుల ఫిర్యాదుతో ..
ఇటీవల స్థానికులు కూడా గో కార్డింగ్పై పలు ఫిర్యాదులిచ్చినట్లు సమాచారం. దీంతో శనివారం ఉదయం ఆ ప్రాంతానికి జీవీఎంసీ యంత్రాంగం చేరుకుని స్థలాన్ని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
నోటీసులు ఇవ్వకుండానే ..
తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఇలా కూలదోయించేస్తున్నారని సంస్థ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా యంత్రాంగం పట్టించుకోలేదు. నిర్మాణాలను, షెడ్లను కూల్చివేశారు.
పూర్తిగా ప్రైవేటు భూమి : కాశీ విశ్వనాథ్
ఇది పూర్తిగా ప్రైవేటు భూమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కాశీ విశ్వనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ భూమి అంటూ ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
Also Read: విశాఖ కూల్చివేతల్లో ఈ వీకెండ్ టార్గెట్ ఎవరు?











