ఏపీ ప్రభుత్వ టార్గెట్ అక్రమ కట్టడాలా లేక పతిపక్ష నేతల ఆస్తులా? అన్నసందేహం కలుగుతోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాల తొలగింపు ముసుగులో పతిపక్ష నేతలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వం అక్రమ కట్టడాల తొలగింపు నెపంతో జీవిఎంసి పరిధిలోని తమను లక్ష్యంగా చేసుకుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. నగర పాలకమండలి ఎన్నికల్లో తమకు ఎదురు లేకుండా చేసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందంటున్నారు..
తాజా సంఘటనలే ఉదాహరణ ..
నోటీసులు ఇవ్వకుండా.. కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా .. సమయం చిక్కకుండా అర్థరాత్రి దాటిన తర్వాత.. తెల్లవారు జామున అక్రమ కట్టడాల తొలగింపులకు పాల్పడుతుండడం గమనిస్తే ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఆస్తులను లక్ష్యంగా చేసుకుందనేది విస్పష్టం. తాజాగా టిడీపీ నేత హర్షవర్థన్కు సంబంధించిన ఫ్యూజన్ ఫుడ్ హోటల్ ను అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో స్వాధీనం చేసుకున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అధికార యంత్రాంగం ఇలా వ్యవహరించడం చూస్తుంటే… వారి ధ్యాసంతా కేవలం ప్రతిపక్ష నేతల ఆస్తులు స్వాధీనం చేసుకుని వారిని ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ భూమికి సంబంధించిన లీజు గడువు 2015లో పూర్తి కాగా అప్పటి ప్రభుత్వ యంత్రాంగం దానిని 9 సంవత్సరాలు పొడిగించారు. దాని ప్రకారం 2024 వరకు లీజు గడువు ఉంది. అయినా అవేమీ పట్టనట్టు… ఆక్రమణ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనితో పాటు… విశాఖ నేత గంటా శ్రీనివాస రావుకు సంబంధించిన 4 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ, గంటా దీన్ని రాజీకీయ ప్రవేశం చేయకముందు 1997 లో కొన్నారు. గంటా రాజీకీయ రంగ ప్రవేశం చేసింది 1999 ఎన్నికల్లో అనే విషయం విధితమే. మరి ఈ చర్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రభుత్వ యంత్రాంగమే సెలవివ్వాలి.
Also Read ;- సవరించిన నిబంధనలతో అక్రమార్జన.. లంక గ్రామాల్లో రెచ్చిపోతున్న ఇసుకాసురులు
గతంలోనూ ఇలాంటి చర్యలు
టీడీపీ నేత సబ్బం హరి ఇంటిని కూడా ఇలాగే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే పాక్షికంగా కూల్చి వేశారు. సబ్బం హరి దీనిపై అప్పట్లో మీడియా ముఖంగా ప్రభుత్వ తీరును ఎండకట్టారు. ఇంటిలో ఉన్నప్పుడే ఇటువంటి చర్యకు పాల్పడ్డారంటూ తీవ్రంగా ఖండించారు. దీనితోపాటు.. గీతం విశ్వవిద్యాలయంకి సంబంధించిన ఆస్తుల ధ్వంసం కూడ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సుమారు 200 మీటర్ల కాంపౌండ్ గోడను అర్థరాత్రి కూల్చి వేశారు. ఆపై కోర్టు ఆదేశాల మేరకు ఆ చర్యలను నిలిపి వేశారు. విద్యాసంస్థల కట్టడాలను కూల్చివేయడం ప్రభుత్వ అరాచక చర్యలకు పరాకాష్ఠ అంటూ టిడీపి నేతలు ప్రభుత్వ దుశ్చర్యలను దుయ్యబట్టారు.
ఇంతటితో ఆగేనా..
అక్రమ కట్టడాల కూల్చివేతల ముసుగులో ప్రభుత్వ ఆగడాలు ఎక్కడి వరకు దారితీస్తాయో వేచి చూడాలి. ఇంకెందరి నేతల ఆస్తులు ప్రభుత్వ టార్గెట్ లిస్ట్లో ఉన్నాయో తేలనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలు గమనించడం లేదనుకోవడం వారి మూర్ఖత్వమే అవుతుంది. ఈ కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వానికి ఎంత మేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి.
Also Read ;- విశాఖ కూల్చివేతల్లో ఈ వీకెండ్ టార్గెట్ ఎవరు?










