ఏపీ సీఎం జగన్ సలహాదారుల్లో ముఖ్యంగా ఎల్లప్పుడూ మీడియా ముందుకు వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి పొలిటికల్ వ్యాఖ్యలకు బ్రేకులు పడనున్నాయా? నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో వారిక సీఎంకు సలహాలిచ్చేందుకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. సలహాదారులుగా నియమితులైన వారు వైసీపీ నాయకుల్లా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేయటం, అధికారులతో సమీక్ష సమావేశాల్లో పాల్లొనటడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వ సలహాదారుల నియామక విధానం, వారికి అప్పగించిన విధులు ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విధుల నిబంధనలు, విధివిధానాలేంటో అదనపు అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను 19కు వాయిదా వేసింది.
దాదాపు 50 మంది సలహాదారులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 50 మంది సలహాదారులను నియమించారు. నిధుల కొరతతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే విడతల వారీగా వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం సలహాదారులు ఒక్కొక్కరికి నెలకు రూ.లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వేతనాలే గాక వాహానాల లాంటి అదనపు వసతులు సమకూరుస్తున్నారు. సమయానుకూలంగా వారు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారని వారి నియామకం సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మాజీ సీఎస్, మాజీ జగన్ సలహాదారు, ప్రస్తుత ఎస్ఈసీ నీలం సాహ్నీ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ సలహాదారుల అంశం తెరపైకి వచ్చింది. సలహాదారుల్లో కొందరు తమకు అప్పగించిన విధులకు పరిమితం కాకుండా, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
సలహాదారుల విధానంపై విమర్శలు
సలహాదారుల విషయంలో వస్తున్న విమర్శలపై హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎస్ఈసీ నీలం సాహ్నీ నియామకం విషయంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో మీరు ఏజీగా పనిచేసినప్పుడు ఇలాంటి పరిస్ధితి ఉందా అని ప్రశ్నించగా ఆయన లేదని సమాధానం ఇఛ్చారు.
సజ్జల రాజకీయ వ్యాఖ్యలపై
సలహాదారుల్లో ముఖ్యంగా ఎక్కువగా మీడియాతో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిని ఇప్పటికే ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం జగన్కు ప్రజా భద్రతా సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై హైకోర్టు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. కొందరు సలహాదారులు రాజకీయ అంశాలు మీడియాతో మాట్లాడటాన్ని హైకోర్టు తప్పు బట్టి, ఇది చట్ట విరుద్ధం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కూడా గవర్నర్కు అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదులో సజ్జల పొలిటికల్ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన పేరు ప్రస్తావించకుండా సలహాదారుల పొలిటికల్ కామెంట్స్ను తప్పుబట్టింది.
సలహాదారులు సమీక్షలు నిర్వహించవచ్చా..?
సీఎం సలహాదారులు అధికారులతో సమీక్షలు నిర్వహించడంపైనా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రులు ఉండగా కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సలహాదారులు సమీక్షలు నిర్వహించవచ్చా అని హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అసలు సలహాదారులకు అప్పగించిన విధుల్ని తాము పరిశీలించాలని భావిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనిపై వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
Must Read ;- జగన్ గారు.. విజయమ్మను గెంటేస్తారా..?