హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో గానీ.. అప్పటిదాకా ఈ ఎన్నికపై రోజుకో కొత్త సమీకరణం వెలువడుతోంది. నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు ఉన్న బీసీల ఓట్లను గంపగుత్తగా చేజిక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ తన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటిస్తూ బుధవారం నాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ గానీ, ఆయన సతీమణి గానీ బరిలోకి దిగడం ఖాయమే. అంటే రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినట్లుగానే చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త జవజీవాలు నింపుకున్నట్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుందని చెప్పాలి. అంతేకాకుండా అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఏకంగా ఆ సీటును ఎగురవేసుకుపోయే దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాస్ ఫాలోయింగ్ కలిగిన కొండా సురేఖను బరిలోకి దించాలని యోచిస్తోంది.
ఈటల వర్సెస్ కేసీఆర్
సీఎం కేసీఆర్ తో దూరం పెరిగిన నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నకు గురి అయిన సంగతి తెలిసిందే. అయితే బర్తరఫ్ అనేది ఎవరికైనా అవమానమే కదా. ఆ అవమానం జీర్ణించుకోలేని ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో పాటుగా ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సత్తా చాటి తనకు టీఆర్ఎస్ అవసమేమీ లేదని చాటడంతో పాటుగా గతంలోనూ తాను తన సొంత ఇమేజీతోనే విజయాలు సాధిస్తూ వచ్చానని చెప్పుకునేందుకు ఈటల యత్నిస్తున్నారు. అదే సమయంలో హుజూరాబాద్ లో అయినా, ఇంకెక్కడైనా పార్టీనే కీలకం, పార్టీ లేకుండా ఏ నేతా గెలిచి రాలేడు అన్న విషయాన్ని నిరూపించాలంటే ఈటలను ఓడించాల్సిందేనన్న కసితో టీఆర్ఎస్ సాగుతున్నాయి. మొత్తంగా హుజూరాబాద్ బరి ఈ రెండు పార్టీల మధ్యే.. ఇంకా చెప్పాలంటే కేసీఆర్, ఈటల మధ్య సాగుతున్నదేనని చెప్పాలి.
హుజూరాబాద్ లోనూ కొండాకు బలం
ఇలాంటి నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. మొన్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన దండోరాకు వచ్చిన జనమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. అంతేకాకుండా 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనన్న మాటను మరింత బలంగా వినిపించేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అందివచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలన్న దిశగా యోచించిన రేవంత్.. హుజూరాబాద్ బైపోల్ బరిలో సాదాసీదా నేతను కాకుండా గట్టి అభ్యర్థినే బరిలోకి దించాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి కూడా వివరించిన రేవంత్.. సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారట. సరే మరి.. హుజూరాబాద్ బరిలో నిలిచే బలమైన అభ్యర్థి ఎవరు? అలాంటి అభ్యర్థి అసలు ఉన్నారా? అన్న దిశగా యోచించిన రేవంత్ కు.. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ దంపతులు కనిపించారట. వైఎస్సార్ మరణం, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిపోయిన కొండా ఫ్యామిలీకి తమ సొంత జిల్లా వరంగల్ తో పాటు పొరుగు జిల్లా కరీంనగర్ లోనూ ఓ మోస్తరు బలం ఉందట. ఇక హుజూరాబాద్ పరిధిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీ వర్గానికే చెందిన కొండా ఫ్యామిలీకి కూడా బంధువర్గంతో పాటు అనుచర వర్గం కూడా భారీగానే ఉందన్న విషయాన్ని రేవంత్ గుర్తించారట. దీంతో కొండా సురేఖను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు కాంగ్రెస్ దాదాపుగా సిద్ధపడిపోయిందట. ఇదే జరిగితే.. ఇటు టీఆర్ఎస్ తో పాటు అటు ఈటలకు కూడా గట్టి పోటీనే తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రేవంత్ సత్తా.. ‘ఇంద్రవెల్లి’ గ్రాండ్ సక్సెస్