1999వ సంవత్సరంలో విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా సుల్తాన్. ఇందులో బాలయ్యతో పాటు సీనియర్ హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుల్తాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయినా.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ నిలిచింది. ఈ సినిమా సక్సస్ గురించి పక్కనపెడితే.. ఒకే సినిమాలో ముగ్గురు కృష్ణలు కలిసి నటించడం విశేషం.
హీరో అండ్ విలన్ పాత్రలో హీరో బాలకృష్ణ అదిరిపోయేలా నటించి.. ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేస్తే.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఇద్దరూ కూడా థియేటర్లో విజిల్స్ పడేలా నటించారు. వివిధ గెటప్పుల్లో బాలకృష్ణను ట్రైలర్ లో చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ.. ఈ సినిమా అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. అయితే.. ఈ మూవీ డైరెక్టర్ శరత్, రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ముగ్గురు కృష్ణల ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండేలా వాళ్ల పాత్రలను డిజైన్ చేశారట.
ముఖ్యంగా వాళ్ల ఫ్యాన్స్ ని సంతృప్తి చేసేలా కథను సిద్ధం చేసుకున్నారు. ఈ కథ రాస్తున్నప్పుడు సిబిఐ ఆఫీసర్ గా ఎవరైతే బాగుంటారని చాలా చర్చలు జరిగాయట. అప్పుడు పరుచూరి బ్రదర్స్ సిబిఐ ఆఫీసర్ గా కృష్ణంరాజు గార్ని, పోలీసాఫీసర్ గా కృష్ణ గార్ని తీసుకుంటే బాగుంటుందని సూచించారట. దానికి టీమ్ అంతా ఓకే అనడంతో వాళ్లని సంప్రదించారట. అప్పుడు కథ కూడా బాగుండడంతో కృష్ణ అండ్ కృష్ణంరాజు బాలయ్యతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
కృస్ణ.. ఎన్టీఆర్ తో కలిసి 5 సినిమాల వరకు నటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరితోనూ నటించడం విశేషం. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాకా సీనియర్ హీరోలైన కృష్ణ గారు, కృష్ణంరాజు గారితో ఉన్న సీన్స్ అన్నింటిని ముందుగా చేసేద్దామని బాలయ్య చెప్పారట. బాలయ్య కోరిక మేరకు వాళ్లతో ఉన్న సీన్స్ అన్నింటిని ముందుగా కంప్లీట్ చేశారట.
ఈ సినిమా షూటింగ్ అండమాన్ దీవుల్లో ఉండడం వలన ఎటూ అండమాన్ వెళుతున్నాం కదా.. ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసినట్టుగా కూడా ఉంటుందని ఈ ముగ్గురు కృష్ణులు వాళ్ల వాళ్ల ఫ్యామిలీస్ ని కూడా అండమాన్ తీసుకుని వెళ్లారట. అక్కడ లోకేషన్స్ సూపర్ గా ఉన్నా.. ఉండడానికి రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ తప్పా.. ఏమీ ఉండేది కాదట. తినడానికి తిండి కూడా దొరికేది కాదట. ఇక చేసేది ఏమీ లేక అందరూ అక్కడే ఎడ్జెస్ట్ అయ్యారట. వెళ్లిన రోజు తినడానికి ఏమీ లేకపోవడంతో బిస్కెట్లు చిన్న చిన్న చిరు తిండ్లుతో కాలం గడిపేశారట.
తర్వాత రోజు ఎక్కడ నుంచో బియ్యం కూరగాయలు తెప్పించారట. వాటితో విజయనిర్మల గారు అద్భుతంగా వంట చేసిపెడితే.. అంత లొట్టలేసుకుని తిన్నారట. బాలయ్య బాబు ఎక్కడ ఉన్నా అందరితో కలిసిపోతారు కాబట్టి.. సముద్రంలోని చేపలను వేటాడి విజయనిర్మల గార్కి ఇస్తే.. ఆమె వాటితో చేపల పులుసు పెట్టిందట. ఆ చేపల పులుసు అదిరిపోవడంతో లోకేషన్ లోకి కూడా పట్టుకెళ్లారట. సినిమా టీమ్ అంతా విజయనిర్మల గారి వంటను ఆవురావుర్మంటూ తిన్నారట. దీంతో విజయనిర్మల గారి చేపల పులుసుకు మంచి పేరు వచ్చిందట. ఏది ఏమైనా ఈ సినిమాలో ముగ్గురు కృష్ణలు నటించడం ఓ విశేషమైతే.. వాళ్ల ఫ్యామిలీస్ అంతా కలిసి అండమాన్ వెళ్లి సరదాగా గడపడం మరో విశేషం.
Must Read ;- బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కి 20 ఏళ్లు!
https://www.youtube.com/watch?v=VZKu6yXe5bU











