ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమ పథకాల జోరును సాగించిన జగన్… ఇటీవలే ఆ పథకాల అమలు భారమేమిటో తెలిసి వచ్చినట్టుంది. అందుకే… గతంలో లేని కొత్త పన్నులను అమల్లోకి తీసుకుస్తున్న జగన్.. సంక్షేమ పథకాలకు నిధులను సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడదీ కుదరక ఏకంగా సంక్షేమ పథకాల్లో కోతలకు శ్రీకారం చుడుతున్నారు. వాతలతో కోతలు లేకుండా సంక్షేమ పథకాలను నెట్టుకొద్దామన్న జగన్… వాతలతో వచ్చే నిధులు కూడా తనదైన మార్కు సంక్షేమానికి సరిపోవని గుర్తించారట. ఈ క్రమంలో ఇక కోతలే మార్గమన్న దిశగా తన మనసును మార్చుకున్నారట. అదెలాగో చూద్దాం పదండి.
లక్షన్నర కోట్లను ఎలా తెచ్చేది?
జగన్ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు లక్ష కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది. అయినా ఇంకా ఏదో మూల అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. దీంతో పథకాలను అర్హులకే అందేలా చూడటం అనే మాటను సాకుగా చూపి కోతలకు శ్రీకారం చుడుతోందట. ఇందులో భాగంగా సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు సిద్దమవుతోంది. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డుల్లో భారీగా కోతలు విధించిన జగన్ సర్కారు… ఇప్పుడు వితంతు, ఒంటరి మహిళల పింఛన్లలో కోత విధించబోతోంది. జగన్ సంక్షేమ పథకాలకు రెండేళ్లకే రూ.లక్ష కోట్లు అవసరమైతే… మిగిలిన మరో మూడేళ్లకు ఎంతలేదన్నా… రూ.1.5 లక్షల కోట్లు అవసరమే కదా. మరి నిధుల ఎలా సమకూర్చాలి?. అనర్హుల పేరిట కోతలు విధిస్తే తప్పించి ముందుకు సాగలేమని కూడా జగన్ సర్కారు యోచిస్తోందట. అనుకున్నదే తడవుగా ఇప్పటికే కోతల ప్రక్రియను మొదలెట్టేసిందట.
రేషన్ కార్డులు, పింఛన్లలో కోత
ఏపీలో మునుపటి ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ కార్డులతో పాటు విపక్షాల కార్యకర్తలు, సానుభూతిపరులు తీసుకున్న రేషన్ కార్డుల్లో వైసీపీ సర్కారు కోతలు పెట్టింది. ఇలా 8 లక్షల తెల్ల రేషన్ కార్డులకు కోత పెట్టారు. దీంతో ఈ 8 లక్షల మందికి అప్పటివరకూ తీసుకుంటున్న అమ్మఒడి పథకం కూడా దూరమైంది. ప్రభుత్వానికి రూ.1,200 కోట్ల మొత్తం ఆదా అయింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం మాత్రం అనర్హులను మాత్రమే తొలగించినట్లు ప్రకటించింది. ఇక తదుపరి చర్యగా వితంతు, ఒంటరి మహిళలకు కూడా సామాజిక పించన్లు ఇస్తోంది. ఈ పించన్లలో అనర్హులు చాలా మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందట. అనర్హులుగా తేలిన లక్ష మందిని ప్రాధమికంగా తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే వీరికి నోటీసులు పంపుతోంది. ఇప్పటికే వీరిలో ఆరువేల మంది అనర్హులుగా తేల్చారు. మిగతా వారు కూడా అనర్హులుగా తలితే తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. అనర్హులకు జూలై 1 నుంచి పింఛన్లు నిలిపేయబోతున్నారు. మొత్తంగా వాతలతో పాటు కోతలను కూడా జగన్ చాలా వేగంగానే అమలు చేస్తున్నారన్న మాట.
Must Read ;- బాబు తీసుకొస్తే!.. జగన్ తరిమేస్తున్నారు!











