Jagan Disappears In India’s Best CM List :
దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న ముఖ్యమంత్రులు ఎవరు? ఎవరి పనితీరు ఎలా ఉంది? ఎవరి స్థానం ఎక్కడ? అంటూ ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరిట ఎప్పటికప్పుడు సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ సంస్థ ఇలాగే చేసిన సర్వేలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో ప్లేసులో ఉన్నారని తేలింది. అప్పుడు వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ సోషల్ మీడియా జబ్బలు చరుచుకున్న వైనం కూడా తెలిసిందే. వైసీపీ అనుకూల మీడియా ఈ విషయాన్ని పతాక శీర్షికలతో రాసిన వైనమూ చూశాం కదా. మరి ఇప్పుడు కూడా అదే ఇండియా టుడే.. అదే రీతిన అదే సర్వేను చేసింది. వివరాలు కూడా వెల్లడించింది. మరి ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ఎందుకు గమ్మున ఉంది? ఎందుకంటే..ఏడాది క్రితం నాలుగో ప్లేసులో ఉన్న జగన్.. ఏడాది తిరక్కుండానే ఏ ప్లేసులో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. టాప్ టెన్ లో కూడా జగన్ కనిపించలేదట. అసలు జగన్ ఏ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఆ సర్వే చెప్పలేదు. అంటే.. ఇప్పుడు జగన్ ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ లేనట్టే కదా.
11 శాతం వ్యతిరేకత పెరిగిందట
ఏ రాష్ట్ర సీఎం పనితీరుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలతోనే ఇండియా టుడే ఈ సర్వే నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఆయా సీఎంల పనితీరును మదించే క్రమంలో వారు ప్రవేశపెడుతున్న పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాలనా తీరుతెన్నులు, స్వచ్ఛ పాలన, జవాబుదారీతనం.. ఇలా ప్రతి అంశంపై ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలనే తీసుకుని రేటింగ్ లు, ర్యాంకులు ఇస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది నాలుగో స్థానంలో ఉన్న జగన్ పై ఏడాది తిరక్కుండానే జనంలో 11 శాతం మేర వ్యతిరేకత పెరిగిందట. ఫలితంగానే ఆయన నాలుగో స్థానం నుంచి అసలు టాప్ టెన్ లిస్టులో కాదు కదా.. అసలు ఏ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఇండియా టుడే చెప్పలేదు. మొత్తంగా ఏడాది తిరక్కుండానే జగన్ ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని బెస్ట్ సీఎంల జాబితాలోనే లేకుండా పోయారన్న మాట.
కారణాలేంటంటే..?
జగన్ గ్రాఫ్ ఇలా అమాంతంగా పడిపోవడానికి గల కారణాలను ఇండియా టుడే వెల్లడించలేదు. కేవలం జగన్ పై 11 శాతం మేర వ్యతిరేకత పెరిగిందని మాత్రమే చెప్పింది. అయితే ఈ ఏడాది కాలంగా జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిపై జనంలో వెల్లువెత్తుతున్న నిరసనలు, ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్న వైనం.. ఆ అప్పులను కూడా నిబంధనలకు నీళ్లొదిలి మరీ తీసుకువస్తున్న తీరు, మద్య నిషేధంపై మాట మార్చిన వైనం. మద్యం ఆదాయం ఆధారంగానే అప్పులు తీసుకొస్తున్న వైనం, ఆయా అంశాల్లో వైసీపీ నేతల అవినీతి.. దానిపై జగన్ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు.. ఇలా చాలా కారణాలే జగన్ ర్యాంకును దిగజార్చేలా చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ ఇమేజీ డ్యామేజీ అయ్యిందని చెప్పిన ఇండియా టుడే..ఆ డ్యామేజీతో జగన్ ఏ ర్యాంకుకు దిగజారిపోయారన్న విషయాన్ని చెప్పకపోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రెండేళ్లలోనే ఈ మేర ఇమేజీని డ్యామేజీ చేసుకున్న జగన్ 2024 ఎన్నికల నాటికి అడ్రెస్ లేకుండా పోతారేమోనన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- నారా లోకేశ్ ను చూస్తుంటే జగన్ కు దడే