బాలీవుడ్ యువకెరటం కార్తీక్ ఆర్యన్ కూ దర్శకనిర్మాత కరణ్ జొహార్ కూ ఎక్కడో చెడినట్టుంది. కరణ్ జొహార్ రూపొందించే ‘దోస్తానా 2’ నుంచి వైదొలిగాడు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ సినిమాలో లక్ష్ లల్వానీ, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆ మధ్య కరోనా బారిన పడి తాను ఇబ్బంది పడినట్టు కార్యీక్ ఆర్యన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి పాల్గొని సర్ ప్రైజ్ ఇచ్చాడు.
కార్తీక్ ‘దోస్తానా2’ నుంచి వైదొలగడానికి కారణాలు తెలియడంలేదు. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం నటించిన కామెడీ సినిమా ‘దోస్తానా’కు సీక్వెల్ గా ‘దోస్తానా2’ రూపొందుతోంది. టీవీ నటుడు లక్ష్య ఈ సినిమాలో నటించే మంచి అవకాశం వచ్చింది. కొల్లిన్ డి కున్హా దీనికి దర్శకుడు. కరణ్ జొహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ కు తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు లభించింది. చేతుల్లో మంచి సినిమాలే ఉన్నాయి. క్రియేటివ్ కాన్ ఫ్లిక్ట్ కారణంగా కార్తీక్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు సమాచారం.
నిజానికి ఈ సినిమా గత ఏడాది ద్వితీయార్థంలోనే విడుదల కావాలి. కోవిడ్ కారణంగా షూటింగ్ వాయిదా పడిపోయింది. నెట్ ఫ్లిక్ కోసం చేస్తున్న హారర్ కామెడీ భూల్ భూలయ్యా 2 డబ్బింగ్ లో కార్తీక్ బిజీగా ఉన్నాడు. అసలు ధర్మా ప్రొడక్షన్ లాంటి పెద్ద సంస్థ నుంచి హీరో వైదొలగడం లాంటి సంఘటన అరుదు. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. సినిమా కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ దశలో కార్తీక్ స్థానంలో వేరొక నటుడిని తీసుకోవడం ఇబ్బందికరమే. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ధర్మ ప్రొడక్షన్స్ ఓ కొత్త మొహం కోసం అన్వేషిస్తోందట. ఆ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.
Must Read ;- బాలీవుడ్ లోకి వెళుతోన్న శంకర్ ‘అపరిచితుడు’











