కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న భాయతీయ జనతా పార్టీలో తెలుగు నేలకు చెందిన నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. బీజేపీ నేతలుగా చెప్పుకోవడానికి చాలా మంది నేతలే ఉన్నా.. పార్టీలో రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో సత్తా చాటిన నేతలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చంటే.. బీజేపీలో తెలుగు నేతలకు ఏ మేర ప్రాధాన్యం దక్కిందో ఇట్టే చెప్పేయొచ్చు. బీజేపీలో ఓ మోస్తరు నేత అంటేనే.. తెలుగు జనం ఓ ఆరాధనా భావంతో చూస్తే.. ఇక ఆ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన నేతలంటే.. తెలుగు ప్రజల మనసులో ఇంకెంత ఎత్తుకు ఎదిగినట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ రూపు సంతరించుకున్న బీజేపీకి ఉత్తరాది పార్టీగానే గుర్తింపు దక్కింది. ఈ కారణంగానే కావచ్చేమో తెలియదు గానీ.. తెలుగు రాష్ట్రాల్లో గానీ, దక్షిణాది రాష్ట్రాల్లో గానీ బీజేపీకి పెద్దగా పట్టు చిక్కలేదు. అదే సమయంలో ఆ పార్టీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగిన మేర ఏ తెలుగు నేత కూడా ఎదగలేదు.
వెంకయ్యదే అత్యుత్తమ స్థాయి
ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ తరహా వాదనలను పక్కనపెట్టి మరి బీజేపీలో జాతీయ స్థాయికి ఎదిగారు. బీజేపీ ఎప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆయా మంత్రివర్గాల్లోవెంకయ్య తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. అది కూడా ఏ చిన్నా చితక మంత్రి పదవో కాదు.. ఓ కీలక శాఖతో పాటుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కూడా ఆయనకే దక్కి తీరాలి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ అంశంమైనా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంటే.. పార్టీలతో పని లేకుండా వాటి పరిష్కారం కోసం వెంకయ్య చొరవ తీసుకునేవారు. తెలుగు ప్రజలు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా వెంకయ్యనే ఆశ్రయించేవారు. ఈ క్రమంలో వెంకయ్య బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. మొత్తంగా వెంకయ్యకు బీజేపీలో ఏ తెలుగు నేతకూ దక్కని ప్రాధాన్యం దక్కిందనే చెప్పాలి. ఇక బీజేపీకి జాతీయ స్థాయిలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కరించే బాధ్యత వెంకయ్యదే. అందుకే కాబోలు.. ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న వెంకయ్యను బీజేపీ పలు ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. మొత్తంగా వెంకయ్య తెలుగు నేలకు చెందిన నేత అయినా.. తనదైన చాకచక్యంతో పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగి.. అన్ని రాష్ట్రాలకు చెందిన నేతగా పేరు గడించారు.
వెంకయ్య మాదిరే కిషన్ కూడా
వెంకయ్య శకం ముగిసింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయనను తప్పించిన బీజేపీ అధిష్ఠానం ఆయనను రాజ్యాంగబద్ద పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టింది. పార్టీ అధిష్ఠానం గీతను శిరసావహించిన వెంకయ్య.. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. అయితే వెంకయ్య శకం ముగిస్తే.. ఇక తెలుగు నేలకు చెందిన ఏ నేత వద్దకు తమ సమస్యలు తీసుకెళ్లాలి అన్న దిశగా తెలుగు ప్రజలు ఓ రకమైన ఆవేదనలో కూరుకుపోయిన సమయంలో వారికి కిషన్ రెడ్డి రూపంలో మరో నేత కనిపించారు. హైదరాబాద్ పరిధిలోని అంబర్ పేటలో గల్లీ స్థాయి నేత నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన కిషన్ రెడ్డి ప్రస్థానం నిజంగానే ఇప్పటి యువతకు ఆదర్శమనే చెప్పాలి. గల్లీ, ఢిల్లీ అన్న తేడాను ఏనాడూ చూడని కిషన్ రెడ్డి.. పార్టీ తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడమే లక్ష్యంగా సాగారు. విజయానికి పొంగిపోలేదు. పరాజయానికి కుంగిపోలేదు. వెరసి తనలోని సిసలైన రాజకీయవేత్తను బయటపెట్టగలిగిన కిషన్ రెడ్డిని బీజేపీ అధినాయకత్వం గుర్తించింది. పార్లమెంటులో అడుగిడిన తొలిసారే మంత్రిగా గుర్తింపు ఇచ్చిన బీజేపీ.. మొన్నటి రీషఫిలింగ్ లో ఏకంగా కేబినెట్ హోదాను కట్టబెట్టింది. ఇది జరిగి రోజులు కూడా గడవకముందే.. కర్ణాటక రాష్ట్ర శాఖ పరిశీలకుడిగి కిషన్ రెడ్డికి మరింత కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం కన్నడనాట రాజకీయ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీఎస్ యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయగా… కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కమలనాథులు కిషన్ రెడ్డికి అప్పగించారు. పని ఏదైనా అధినాయకత్వం ఆదేశాల అమలే పరమావధిగా కదులుతున్న కిషన్ రెడ్డి మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. కర్ణాటక సీఎంను ఎంపిక చేసి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. రానున్న కాలంలో వెంకయ్య మాదిరే కిషన్ రెడ్డి కూడా బీజేపీలో ఓ రేంజికి ఎదుగుతారని ఆశిద్దాం.
Must Read ;- ‘రామప్ప’కు గుర్తింపు.. కిషన్ రెడ్డి ప్రభావమేనా?