పులివెందుల.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఏళ్ల తరబడి అక్కడ వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. గతంలో జగన్ తండ్రి వైఎస్సార్, ఆ తర్వాత జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, ఇప్పుడు జగన్ అక్కడి నుంచి గెలిచారు. మొత్తంగా పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటే. 2019లో అక్కడి నుంచే గెలిచిన జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. సీఎం నియోజకవర్గమంటే అందరి దృష్టీ దానిపైనే ఉంటుంది కదా. అలాంటి నేపథ్యంలో ఆయా విభాగాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అయితే అదేమీ లేదు. రాష్ట్రంలో జగన్ పాలన మాదిరే పులివెందులలోనూ అధికారులు ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్నారు. అక్కడి పోలీసు శాఖ అయితే అస్సలు నిబంధనలనే పట్టించుకోదు. జగన్ ఫ్యామిలీ ఏది చెబితే అదే చేస్తుంది. జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలోపులివెందుల పోలీసులు వ్యవహరించిన తీరు పెను దుమారాన్నే రేపింది. తాజాగా పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఏకంగా లాకప్ డెత్ జరిగిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
పులివెందుల అహోబిళపురం కాలనీకి చెందిన వల్లెపు అశోక్ అలియాస్ అక్కులప్ప (25) తల్లి కువైట్కు వలస వెళ్లగా, తండ్రి చిన్నప్పుడే మరణించాడు. అక్కులప్పకు ఓ సోదరి కూడా ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్న అక్కులప్ప అక్కడే ఉంటున్నాడు. అతడిపై పలు దొంగతనం కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఓ దొంగతనం కేసులో అక్కులప్పను అనుమానించిన పులివెందుల పోలీసులు ఆదివారం అతడిని పులివెందులకు తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత అతడు చనిపోయాడు. పోలీసులు అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, విషయం బయటకు రాకుండా స్థానిక నాయకుడి సాయంతో అక్కులప్ప కుటుంబ సభ్యులతో పంచాయితీ నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని రాత్రికి రాత్రే స్థానిక హిందూ శ్మశాన వాటికలో దహనం చేసినట్టు సమాచారం. తొలుత పూడ్చిపెట్టాలని భావించి గుంత తవ్వినా ఆ తర్వాత దహనం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు ముందు అశోక్ సోదరితో పోలీసులు సంతకాలు తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాస్ అశోక్ది లాకప్ డెత్ కాదని, అనారోగ్యంతోనే మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు అతడి చెల్లెలు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిందన్నారు. అయితే, ఈ లాకప్డెత్పై విచారణ జరిపించాలని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు.
వివేకా కేసు తేలేదెప్పుడు?
ఇదిలా ఉంటే.. జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన సొంతింటిలోనే దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య జరిగి ఇప్పటికే రెండున్నరేళ్లు కావస్తోంది. అయినా ఈ కేసు చిక్కుముడి ఇంకా వీడలేదు. నాడు కూడా పులివెందుల పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వివేకా బాడీపై మారణాయుధాలతో దాడి చేసిన గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నా.. ఆయనది గుండెపోటు అంటూ నాడు పులివెందుల సీఐగా వ్యవహరించిన శంకరయ్య చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రక్తపు మరకలు, ముఖం, తలపై రక్త గాయాలు కనిపిస్తుంటే.. గుండెపోటు వల్ల చనిపోయారని శంకరయ్య చెప్పిన వైనం చూస్తుంటే.. అక్కడ జగన్ ఫ్యామిలీ ఏది చెబితే అదే చేస్తున్నారని చెప్పక తప్పదు. పోలీసులు అయినా, ఇతర శాఖల అధికారులైనా ఇలాగే వ్యవహరిస్తారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు పులివెందులలో ఏం జరిగినా కూడా.. ఆయా ఘటనలకు సంబంధించి నిజానిజాలు బయటకు రావన్న వాదన మరింతగా బలపడిపోయింది. తాజాగా పులివెందుల లాకప్ డెత్ కూడా ఇలాగే మరుగున పడిపోవడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది.
Must Read ;- వివేకా కేసులో అన్ని వేళ్లూ జగన్ వైపే!











