సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్ -19 టీకాలను సూపర్స్టార్ మహేష్ బాబు వేయించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని తనవంతు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం బుర్రిపాలెం వాసులకే కాదు మహేష్ తనవంతు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి 1000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్` సంస్థతో కలిసి వైద్య ఖర్చులను భరించలేని చిన్నారుల కుటుంబాలకు మహేష్ అండగా నిలుస్తున్నారు. టీకాల డ్రైవ్ వరుసగా ఏడు రోజులపాట కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్లో బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు మహేష్. ఆ గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేసే బాధ్యతలను స్వీకరించడం ద్వారా శ్రీమంతుడిగా నిరూపించుకుంటున్నారు. తన తండ్రి కృష్ణ పుట్టినరోజున మహేష్ ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు. దీంతో నిజ జీవితంలోనూ సూపర్ హీరోగా మహేష్ పేరు మార్మోగుతోంది. `టీకా అనేది మళ్లీ మనం సాధారణ జీవితం గడపడానికి ఆశాకిరణం లాంటిది.
బుర్రిపాలెం ప్రజలు ప్రతి ఒక్కరు టీకా వేసుకుని క్షేమంగా ఉండడానికి ఇది నా వంతు ప్రయత్నం. ఈ టీకా డ్రైవ్ను ఏర్పాటు చేయడంలో మాకు సహాయపడినందుకు ఆంధ్రా హాస్పిటల్స్కు కృతజ్ఞతలు. ఈ క్లిష్ట కాలంలో ‘టీమ్ మహేష్ బాబు సభ్యులు` స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించడం అభినందించాల్సిన విషయం. టీకా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వేయించుకోవడానికి ముందుకు వచ్చిన గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. టీకా వేయించుకోండి అందరూ సురక్షితంగా ఉండండి అని సూపర్స్టార్ మహేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Must Read ;- హీరో కృష్ణపై ఊర్వశి ఓటీటీ ప్రత్యేక పాట