పాటలపై వివాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పాటలు వైరల్ అయి మంచి వ్యూస్ సాధించాలన్నా వివాదాలు ఉంటే మంచిదేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. దాంతో కొందరు కావాలనే వివాదాలు కూడా సృష్టిస్తుంటారు. సోషల్ మీడియా ప్రాధాన్యం పెరిగాక వివాదాలు కూడా పెరిగాయి. ఆ మధ్య లవ్ స్టోరీలోని సారంగ ధరియా పాట వివాదం తర్వాత ఆ పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పాట యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడానికి వివాదం కూడా కారణమనే విషయాన్ని ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే గాయని మంగ్లీ ఇలాంటి ఓ వివాదంలో ఇరుక్కోవడం.
మంగ్లీ పాటలకు ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా జానపద పాటలకు కొత్త సోయగాన్ని మంగ్లీ గళం సంపాదించింది. ఇటీవల మంగ్లీ పాడిన ఓ బోనాల పాటపై పెద్ద వివాదం బయలుదేరింది. ‘చెట్టు కింద కూర్చున్నావమ్మా చుట్టం లెక్క మైసమ్మా..’ అంటూ సాగే ఈ పాట విని గ్రామ దేవతలను విమర్శిస్తారా? అంటూ కొందరు మండిపడ్డారు. మంగ్లీపై చర్య తీసుకోవాలని భాజపా కార్పొరేటర్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా మంగ్లీ జాతి, కులం, మతంపైనా వ్యాఖ్యలు చేశారు. దాంతో మంగ్లీ కూడా తగ్గలేదు. దీనిపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తానేమీ పండితుల కుటుంబం నుంచి రాలేదని చెప్పింది.
బోనం ఎత్తని వారు, ఎప్పుడూ గుడికి పోనివారు కూడా మాట్లాడమేంటని ప్రశ్నించింది. రచయిత రామస్వామి అభిప్రాయం ప్రకారం ‘చెట్టుకింద కూసున్నవమ్మ’ పాటలో మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థం ఉందని, ఇప్పుడీ పదం వ్యతిరేక పదంగా వాడుకలో ఉందని వివరించింది. భక్తిలో కూడా రకాలు ఉన్నాయని చెప్పేలా ఈ పాటను రూపొందించినట్టు తెలిపింది. తండాలో పుట్టిన తాను తమ తాతలనాటి ఆంజనేయ స్వామి గుడి కట్టించి పూజలు చేస్తున్నామని చెప్పింది.
ఏనాడూ బోనం ఎత్తని వారు తనపై కామెంట్టు చేయడమేంటని, తాను ఏటా లాల్ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నానని వివరించింది. బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు.. లాంటి పర్వదినాల్లో పాటలు పాడుతున్నానని చెప్పింది. తన పాటల వెనక పదేళ్ల కష్టం ఉందని, తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరచిపోయి విచక్షణ కోల్పోయి విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయినా విమర్శలు వచ్చాయి కాబట్టి సాహిత్యంలో కొన్ని మార్పులు చేశామని చెప్పింది.
Must Read ;- మా ఎన్నికలపై కోట ఆగ్రహం.. ముదురుతున్న వివాదం