Megastar Chiranjeevi With Film Journalists :
కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారటానికీ, చిరంజీవి మెగాస్టార్ గా మారటానికీ వెనక ఎంతో కృషి, కసి ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ ఆలోచన తీరు ఎలా ఉంటుందో ఈ మూడుగంటల ముచ్చట్లు చూస్తే అర్థమవుతుంది.
మనం నడిచి వచ్చిన మార్గాన్ని గుర్తుంచుకునే వారు అరుదు. సినిమా నటులకూ జర్నలిస్టులకూ మధ్య దూరం పెరిగిపోయింది. జర్నలిస్టులకు దగ్గరకు కూడా రానీయని నటులు ఉన్నారు. దానికి కారణం జర్నలిజం పేరుతో అనుచితంగా ప్రవర్తించే వారు పెరగడం కూడా కారణమే. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం కోకాపేటలో దేవాలయం సెట్ వేశారు. అక్కడ షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కొందరు జర్నలిస్టులు వెళ్లి కలిస్తే ఆయన స్పందించిన విధానం చూసి సెట్ లో ఉన్న అందరూ నివ్వెరపోయారు. దాదాపు మూడు గంటలపాటు వారితో మమేకమయ్యారు.
చాలా కాలం గ్యాప్ తర్వాత కలిసిన జర్నలిస్టులను ఆయన పేరు పెట్టి పిలిచి మరీ పలకరించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన మెగాస్టార్ ఎందుకయ్యారు? ఎలా అయ్యారన్న దానిపైనే జర్నలిస్టులే చర్చించుకునే దాకా పరిస్థితి వెళ్లిందంటే ఊహించుకోవచ్చు. జులై 30న ఈ సంఘటన జరిగింది. ఆరోజు ఆయన మామగారు అల్లు రామలింగయ్య వర్ధంతి. ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆయన శ్రీమతి సురేఖ, ఆయన మరదలు వసంత, బావమరిది అల్లు అరవింద్, నిర్మల దంపతులు.. ఇంతమంది వచ్చినా వారికి చిరంజీవి సమయం కేటాయించలేదు.
వారిని కార్వాన్ కే పరిమితం చేసి జర్నలిస్టులతో ముచ్చట్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎంతో ఎదిగినా ఇంత ఒదిగి ఉండటం ఓ మెగాస్టార్ కు అవసరమా అన్న సందేహం ఎవరికైనా వచ్చి తీరుతుంది. నిజానికి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం మెగాస్టార్ చిరంజీవికి ఉందా? 65 ఏళ్ల వయసులో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో బిజీ జీవితం గడిపే మెగాస్టార్ ఈరోజుల్లోనూ పాత్రికేయులతో గడపాల్సి రావడం ఎందుకు అంటే సమాధానం చెప్పలేం.
వేదాంతి.. వ్యక్తిత్వ వికాస నిపుణుడు..
మీడియాతో చిరంజీవి మాట్లాడుతున్నపుడు ఆయనలో ఓ వేదాంతి కనిపించారు.. ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆవిర్భవించాడు. ఓ మెగా స్టార్ ఎలా ఆలోచిస్తారు? ఆయన ఏం కోరుకుంటున్నారు? చివరికి ఏం మిగులుతుందనుకుంటున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే అవకాశం నాలాంటి పాత్రికేయులకు దక్కింది. అసలు జర్నలిస్టుల కోసం అరగంట సమయాన్ని కేటాయిస్తున్న హీరోలు ఈరోజు ఎంత మంది ఉన్నారు అంటే దాదాపు లేరు అనే సమాధానమే వస్తుంది.
మరి మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నారు? జర్నలిస్టుల కోసం ఇంత సమయాన్ని కేటాయించడం వెనక ఆయనకు స్వార్థం ఉందా అన్న ఆలోచన కూడా రాకపోదు. అలా లేకపోయినా ఆయనను ఎవరూ ఏమీ అనరు కదా? అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారేమో అనుకోవలసి వస్తోంది. ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఇంటి నుంచి భోజనంతో శ్రీమతి వచ్చినా ఆయన జర్నలిస్టులతోనే కలిసి భోజనం చేశారు.
ఆయన కోసం నిరీక్షించలేక వెళ్లిపొమ్మంటారా అంటూ శ్రీమతి నుంచి కబురు వస్తే వెళ్లి పొమ్మని కబురు పంపారు. ఇలాంటి అంశం నుంచి యువహీరోలు నేర్చుకోవలసిన పాఠం ఎంతో ఉంది. అసలు జర్నలిస్టుల కోసం అరగంట సమయాన్ని కేటాయిస్తున్న హీరోలు ఈరోజు ఎంత మంది ఉన్నారు అంటే దాదాపు లేరు అనే సమాధానమే వస్తుంది. ముఖ్యంగా యంగ్ హీరోలు పూర్తిగా జర్నలిస్టులకు దూరమైపోయారు.
విమర్శలపై స్పందన
సినిమా హీరోల మీద తరచూ విమర్శలు వస్తుంటాయి. ఇలాంటి వాటికి మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఆయనే సమాధానం చెప్పారు. దీనికోసం తాను ఎప్పుడో చదివిన కథను గుర్తుచేసుకున్నారు. ఎదురుగా వచ్చిన వ్యక్తిని కోపంగా చూస్తూ అకారణం తిట్టే వ్యక్తిపై అతను తిరగబడ్డాడు. పైగా కొట్టాడు కూడా. ఈలోగా ఓ వాహనం వచ్చి అతను పిచ్చివాడని చెప్పి తీసుకెళ్లారట. మెగాస్టార్ ఈ కథ చెప్పి ఎవడో ఏదో అన్నాడంటే వాడి మానసిక పరిస్థితి బాగుండక పోవచ్చు. అలాంటప్పుడు మనకు కోపం ఎందుకు రావాలి. వాడు పిచ్చితనంతో వాగాడు.. నువ్వు పిచ్చితనంతో వాడితో తలపడకూడదు. ఆ స్టోరీ తనలో చాలా మార్పు తెచ్చిందని చెప్పారు. ‘విమర్శలు చూసినప్పుడు నీకు ఏ మాత్రం కోపం రాదా అంటారు.. నేను నవ్వి ఊరుకుంటాను.
ఆ రకంగా కూడా నేను వారికి ఉపయోగపడుతున్నాను అనుకుంటే నాకు అంతకన్నా కావలసింది ఏముంటుంది’ అని ఆయన వివరించారు. ఓ మెగాస్టార్ విమర్శలను ఎలా తీసుకుంటారనడానికి ఇది ఓ ఉదాహరణ. మనిషికి కావలసింది మానసిక ప్రశాంతత తప్ప మరేమీ కాదన్నారు. మూడు గంటల పాటు చిరంజీవి ముచ్చట్లును ఇలా క్లుప్తంగా ముగించడం కూడా కష్టమే. మెగాస్టార్ ఎందుకవుతారు? ఎలా అవుతారు? దాన్ని ఎలా కాపాడుకుంటారు? అన్న ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరికే అవకాశం ఉండి తీరుతుంది. ఇది మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఉపాఖ్యానం అని కూడా అనుకోవచ్చు.
– హేమసుందర్
Must Read ;- జర్నలిస్టులూ మా కుటుంబమే అంటున్న చిరంజీవి











