(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
“తన భార్య ప్రసవ సమయం సమీపించిందని .. తాను తండ్రిని కాబోతున్నానని.. తనకు పితృత్వ సెలవులు కావాలి” అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. అందువల్ల శుక్రవారం నుండి తొమ్మిది రోజుల పాటు తాను బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదని .. తరువాత పాల్గొంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు లేఖ రాశారు. తన భార్య ప్రసవ సమయం సమీపించిందని, తాను తండ్రిని కాబోతోన్నానని తెలిపారు. తన భార్య ప్రసవానికి ముందు.. ఆ తరువాత.. ఆమె బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఓ భర్తగా.. కాబోయే తండ్రిగా తన మీద ఉందని గుర్తు చేశారు. ఈ తొమ్మిది రోజుల పాటు తన గైర్హాజరీని పితృత్వ సెలవుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.
రెండుసార్లూ శ్రీకాకుళం ఎంపీగా విజయం
రామ్మోహన్ నాయుడు.. తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కుమార్తె శ్రావ్యను 2017లో వివాహం చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు .. బండారు సత్యనారాయణ మూర్తి మంచి స్నేహితులు. ఆ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. తండ్రి ఎర్రన్నాయుడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన పోటీ చేసిన రెండుసార్లూ శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు.
సంసద్ రత్న పురస్కార గ్రహీత
లోక్సభ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే సభ్యుడిగా రామ్మోహన్ నాయుడికి మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గం ప్రజల తరపున అనేక అంశాలపై ఆయన సభలో ప్రస్తావించిన తీరు.. రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకతను తెచ్చిపెట్టంది. చిన్న వయస్సులోనే సంసద్ రత్న పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన సభ్యులకు లభించే పురస్కారం ఇది. అటువంటి రామ్మోహన్ నాయుడు సెలవు పెట్టడం .. ఆయన బాధ్యతను తెలియజేయడంతో పాటు .. జిల్లాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఆయన తండ్రి కావడం పట్ల ఆయన కుటుంబీకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందిస్తున్నారు.
Must Read ;- పితృత్వ సెలవులో ఎంపీ రామ్మోహన్












