దివీస్ లాబొరేటరీస్ కు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ శనివారం నాడు తుని సమీపం కొత్తపాకల లో సభ నిర్వహించదలచుకున్నారు. నాలుగు రోజుల కిందటే పోలీసు అనుమతుల కోసం జనసేన స్థానిక నాయకులు తుని పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా ఎస్పీని కూడా కలిసి పవన్ కల్యాణ్ సభ గురించి సమాచారం ఇచ్చారు. ‘నో ప్రాబ్లమ్.. సభ నిర్వహించుకోండి’ అంటూ ఎస్పీ కూడా వారికి మౌఖికంగా అనుమతి ఇచ్చారు. ఆ తర్వాతే.. పద్ధతి ప్రకారం పవన్ కల్యాణ్ పర్యటించే ప్రదేశాల రూట్ మ్యాప్ తో సహా తుని స్టేషన్లో దరఖాస్తు చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం జనసేన నాయకులకు తుని పోలీసు స్టేషన్ నుంచి ఫోను వచ్చింది. మీ సభకు పర్మిషన్ లెటరు వచ్చేసింది.. వచ్చి తీసుకువెళ్లండి అనేది ఆ లెటరు సారాంశం.
జనసేన నాయకులు పోలీసు స్టేషన్ కు బయల్దేరారు. అంతా నిమిషాల వ్యవధిలో సీన్ మారిపోయింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హష్మీ ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ కల్యాణ్ సభకు ఎలాంటి అనుమతులు లేవని.. సభ ఆలోచన మానుకోవాలని చెప్పారు. దీంతో ఖంగు తినడం జనసేన నాయకుల వంతయింది. వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇది చాలా అప్రజాస్వామికం అంటూ వారు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతాం.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ సభ నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు.
పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలోసీరియస్ అయినట్టు సమాచారం. ప్రజాస్వామ్య బద్ధంగా సభ నిర్వహించదలచుకుంటే.. అనుమతులు ఇస్తున్నాం అంటూ.. చివర్లో ఇలా అనుమతులు లేవని అనడాన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సభకు సిద్ధం అవుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటోంది. మరి పరిణామాలు ఎలా దారితీస్తాయోచూడాలి.
Must Read ;- పవన్ ప్రశ్న : జగన్రెడ్డీ లోపం మీలోనా.. మీ వ్యవస్థలోనా?
జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన :
తూ.గో జిల్లా ఎస్పీ వైఖరి గర్హనీయం
* కొత్తపాకల సభపై ఆంక్షలా?
* వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది
తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటించడం అప్రజాస్వామికం.. పోలీసు వ్యవస్థకే తలవంపులు. తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబరేటరీస్ పై అక్కడ సమీప గ్రామస్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే జనసేన నాయకులు ఎస్పీకి తెలియజేశారు. సభకు అనుమతి కావాలని, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరినప్పుడు ఆయన సుముఖుత వ్యక్తం చేసి, సభ నిర్వహించడానికి ఆమోదం తెలిపారు.
అయితే ఈ రోజు సాయంత్రం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభకు అనుమతులు రద్దు చేసుకుంటున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడం వైఎస్ఆర్సీపీ ఆదేశాలను అమలు చేయడంగానే భావిస్తున్నాం. దివీస్ కంపెనీ వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని వేలాదిమంది ప్రజలు ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతియుతంగా వారి మనోభావాలను అర్ధం చేసుకోవడానికి వెళ్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం. ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యధావిధిగా 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా గళాన్ని వినిపిస్తాం. పోలీసులను అడ్డుపెట్టుకొని జనసేన కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు జగన్ రెడ్డిగారి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేస్తున్నామన్న విషయాన్ని గుర్తెరగాలి.
– నాదెండ్ల మనోహర్
చైర్మన్
రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
Also Read ;- పవనే కరెక్టా? పేకాట బురదలోంచి నాని బయటపడేనా!