వైసీపీ రాజకీయ వ్యవహారాల సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో పీకే, జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవాలయాల ధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారిని సమర్థంగా తిప్పికొట్టడంతోపాటు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తుడిచి వేసేందుకు పీకే కొత్త వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది.
పరువు కాపాడుకోవడం ఎలా?
ఏపీలో 145 దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోందనే విషయాన్ని వైసీపీ అధినేత కూడా గుర్తించారని తెలుస్తోంది. అందుకే దేవాలయాలపై దాడులు ప్రతిపక్షాలే చేయించి గొరిల్లా వార్ ఫేర్ నడుపుతున్నాయని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉండి ప్రతిపక్షాలపై తప్పును నెట్టడం వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తోందనే విషయం మరచిపోయినట్టు భావించాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు దేవాలయాలు ధ్వంసం చేయిస్తూ ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు. దాడులు చేస్తున్న వారికి అరెస్టు చేసి బొక్కలో వేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేవాలయాలపై దాడులు మీరంటే మీరు చేయించారని ఆరోపించుకోవడం ద్వారా ప్రయోజనం లేకపోగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వైసీపీ రాజకీయ సలహాదారు పీకే, సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Must Read ;- పవన్ సభకు అనుమతి- రద్దు : జగన్కు భయమా?
కొత్త వ్యూహాలకు పదును పెడతారా?
దేవాలయాలపై దాడులు చేసిన వారికి అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు ప్రజలు గగ్గోలు పెడుతుంటే, బెజవాడ దుర్గగుడి ఫ్రైఓవర్ నిర్మాణ సమయంలో తొలగించిన దేవాలయాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం కూడా పీకే సలహాగానే భావించాల్సి వస్తోంది. వైసీపీ పాలనలో కేవలం విగ్రహాలు, దేవాలయాలు మాత్రమే ధ్వంసం జరిగిందని, టీడీపీ పాలనలో, చంద్రబాబు హయాంలో దేవాలయాలే కూల్చివేశారని ప్రజలకు మరోసారి గుర్తుచేయడానికే ఇలా చేశారని తెలుస్తోంది. ఇదంతా పీకే వ్యూహాల్లో భాగంగా అనుమానించాల్సి వస్తోంది. ఎదురుదాడి చేయడం, గతంలో టీడీపీ చేసిన తప్పులను ప్రజలకు మరలా గుర్తు చేయడం, మీడియాలో వ్యతిరేకత వార్తలు రాకుండా చూసుకోవడం, వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్న టీవీల కేబుళ్లు కట్ చేయడం ఇవన్నీ పీకే అనుసరించే వ్యూహాలే. తాజాగా మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డితో పీకే కలవడంతో రేపటి నుంచి కొత్త ఎత్తులు బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే అవకాశం ఉంది. హిందువుల ఓట్లను చీల్చడం ద్వారా కూడా వైసీపీ ప్రయోజనం పొందాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బీజేపీని ఎదుర్కొనే అనుభవం పీకేకు పుష్కలం..
దేవాలయాలపై దాడులు జరిగితే బీజేపీ నాయకులు వెంటనే రంగంలోకి దిగి మైలేజీ కోసం పాకులాడుతారు. కానీ ఏపీలో ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేసినా బీజేపీ మైలేజీ పెరగడం లేదని పీకే భావిస్తున్నారట. అందుకే తాజా వ్యూహాలు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 145 దేవాలయాలు ధ్వంసం చేసినా ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రామతీర్థం విషయంలోనూ బీజేపీ నేతలు పెద్ద తప్పే చేశారు. టీడీపీ అధినేత రామతీర్థంలో పర్యటించిన తరవాత వచ్చిన స్పందన చూసి బీజేపీ నేతలు వాతలు పెట్టుకున్నారు. రాముడి తలనరికినా బీజేపీ నేతలు స్పందించలేకపోయారంటే వారు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారో అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా పీకే ఖరారు చేసే వ్యూహాలు త్వరలో ఏపీలో అమల్లోకి రానున్నాయనేది మాత్రం నూరు శాతం నిజం.
Also Read ;- బీజేపీ స్వామి గారి జగన్ వకాల్తా ఎందుకు?
హిందువుల్లో చీలికే పీకే వ్యూహమా?
ఏపీలో హిందువుల్లో చీలిక తీసుకువస్తే వైసీపీ గెలుపు నల్లేరుపై నడక అవుతుందని భావిస్తున్నారు. ఒక వైపు కులం అండ, మరో వైపు మతం మద్దతుతో దూసుకుపోతున్న వైసీపీ అధినేత, ప్రతిపక్షాలకు వచ్చే ఓట్లను చీల్చడం ద్వారా బీహార్లో బీజేపీ అనుసరించిన మార్గాలను తెరమీదకు తెస్తున్నట్టు తెలుస్తోంది. మన బలం పెరగకపోయినా ఎదుటివాడి బలాన్ని ముక్కలు చేయగలిగితే అదే విజయానికి మార్గం చూపుతుందనే విషయం వైసీపీ అధినేతకు, పీకేకు తెలియని విషయం కాదు. అందుకే ఏపీలో ఓట్ల చీలిక అస్త్రం ప్రయోగించే పనిలో వ్యూహాలను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే వ్యూహాలు అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. త్వరలో స్థానిక ఎన్నికలు కూడా ఉండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పీకేతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.











