ఓ వైపు సాగు ఖర్చులు పెరుగుతుంటే మరో వైపు వరి ధాన్యం ధరలు పతనం అవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కకపోవడంతో డెల్టా ప్రాంతాల్లో నేటికీ పొలాల వద్దే ధాన్యం కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. పతనమైన ధరలకు అమ్ముకోలేక మరోవైపు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో రెండు నెలలుగా పొలాల వద్దే ధాన్యం రాశులు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ రావడం వర్షాలు కూడా ప్రారంభం కావడంతో పొలాల వద్ద ధాన్యం ఎక్కడికి తరలించాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. అసలే చిన్నసన్న కారు రైతులు చిన్నచిన్న ఇళ్లలో నివాసం ఉంటూ ఉంటారు. ధాన్యం బస్తాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుందామన్నా జాగా లేదని రైతులు వాపోతున్నారు.
ధాన్యం ధరలు ఎందుకు పతనం అయ్యాయి
ధాన్యం ధరలు మూడేళ్ల కిందటే 75 కేజీల బస్తాకు రూ. 1400 ధర దక్కింది. నేడు అదే బస్తా కనీసం రూ.1100లకు కూడా కొనుగోలు చేసేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందా? అంటే అదీ లేదు. పదిహేను రోజులుగా రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా దొడ్డురకం దాన్యం కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సరే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తే 75 కేజీల బస్తా రూ.1100లకే అడుగుతున్నారని రైతుల వాపోతున్నారు. రైతుల వద్ద నుంచి ఈ సీజన్ లో 45 లక్షల టన్నుల ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటికి కేవలం 28.35 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా రైతుల వద్ద 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది
ఎరువుల ధరలు మూడేళ్ల కిందటితో పోల్చుకుంటే 50 శాతంపైగా పెరిగాయి. ఇదే సమయంలో ధాన్యం ధర 40 శాతం తగ్గింది. మూడేళ్ల కిందట డీఏపీ బస్తా రూ.800 ఉండగా నేడు రూ.1250కు పెరిగింది. ఇక మూడేళ్ల కిందట 75 కిలోల లావు రకాల ధాన్యం బస్తా రూ.1400లకు కొనుగోలు చేయగా నేడు, రూ.1100లకు కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఓ వైపు సాగు ఖర్చులు పెరిగిపోయి, మరోవైపు ధాన్యం ధరలు పతనం కావడంతో డెల్టాలో సాగు సంక్షోభంలో పడింది. వరి సాగులో కనీసం గడ్డి కూడా మిగలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధర ఎక్కడ?
75 కిలోల ధాన్యం బస్తాకు కేంద్ర ప్రభుత్వం రూ.1416 ధర ప్రకటించింది. అయితే కొనుగోలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఏపీలో ఖరీఫ్, రబీల్లో కోటి 50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో కోటి టన్నులు సేకరించాల్సి ఉంది. ఖరీఫ్లో ధాన్యం సేకరణలో పెద్దగా అవాంతరాలు లేకపోయినా, రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రబీలో రైతులు పండించిన 65 లక్షల టన్నుల్లో కనీసం 45 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. నేటికీ కనీసం 28.35 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.5300 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొదట ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన ఏపీ సీఎం తరవాత మాట మార్చి, ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో నగదు జమ చేస్తామని చెప్పారు. అయితే రైతుల వద్ద నుంచి రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటిపోతున్నా…ఇంకా రైతులకు రూ.3670 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
చెల్లింపులు అంతంత మాత్రమే..
రెండు నెలల కిందట రబీ ధాన్యం అమ్మిన రైతులకు నేటికీ డబ్బులు చెల్లించలేదు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే ధాన్యం రైతులకు ప్రభుత్వం రూ.1581 కోట్లు బకాయి పడింది. ఇక తూర్పు గోదావరిలో రూ.1092, కృష్ణా జిల్లాలో రూ.469 కోట్లు, నెల్లూరు రూ.240, గుంటూరు జిల్లాలో రూ.130 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోవడమే కష్టంగా ఉంటే, ఇక అమ్మిన ధాన్యానికి కూడా ప్రభుత్వం ఎప్పుడు చెల్లింపులు చేస్తుందో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. సన్నాల రకం ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాలు అమ్ముకునేందుకు రైతులు పెద్దగా ఇబ్బందులకు గురికావడం లేదు. కానీ బోండాల రకం సాగు చేసిన రైతులకు మాత్రం ధాన్యం అమ్ముకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.
ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని, అందుకే ధాన్యం రైతులకు చెల్లింపులు ఆలస్యం అవుతోందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. నేటి నుంచి ప్రతి రోజు రైతులకు రూ.200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. మరో రెండు రోజుల్లో రూ.1200 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రాబోయే పది రోజుల్లో ధాన్యం రైతుల బకాయిలు మొత్తం చెల్లిస్తామని కమిషనర్ ప్రకటించారు. అయితే మిగిలిపోయిన ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం మీనమీషాలు లెక్కిస్తోంది. ఇంకా రైతుల వద్ద 22 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. లావు రకాలు కావడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. లావు రకాలు కేవలం ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
బకాయిలు చెల్లించాలని చంద్రబాబు లేఖ
ధాన్యం రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎంకు లేఖ రాశారు. ఖరీఫ్ పనులు మొదలైనా రబీ ధాన్యానికి బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా వెంటనే బకాయిలు చెల్లించి, రైతుల వద్ద పేరుకుపోయిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన లేఖలో కోరారు.
Must Read ;- సీఎం జాబ్ క్యాలండర్ కన్నా మార్కెట్లో దొరికేవి బెటర్ : అచ్చెన్నాయుడు